70% ఎన్నికల వాగ్దానాలు నెరవేర్చాము.. మిగిలిన వాటిని నెరవేరుస్తాం: తమిళనాడు సీఎం స్టాలిన్
తమిళనాడు: ఎన్నికల సందర్భంగా తాము ఇచ్చిన 70 శాతం వాగ్దానాలను నేరవేర్చామని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే.స్టాలిన్ అన్నారు. మిగిలిన వాటిని నెరవేరుస్తామని స్పష్టం చేశారు.
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్: 2021 అసెంబ్లీ ఎన్నికల సమయంలో డీఎంకే ప్రభుత్వం చేసిన వాగ్దానాలను అమలు చేయడం లేదంటూ ప్రతిపక్ష నేతలు చేస్తున్న విమర్శలపై ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ స్పందిస్తూ.. తమ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చుతుందని తెలిపారు. తాము ఎన్నికల సమయంలో చేసిన హామీలలో 70 శాతం నెరవేర్చామని గురువారం నాడు ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం మిగిలిన హామీలను కూడా అమలు చేస్తామని స్టాలిన్ హామీ ఇచ్చారు. మాజీ మంత్రి పొంగలూరు ఎన్.పళనిస్వామి మనవరాలు వివాహ వేడుకలో ఆయన మాట్లాడుతూ.. ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం పాలు, పెట్రోల్ ధరలు తగ్గించి ప్రభుత్వ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణానికి కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసిందన్నారు.
ప్రభుత్వానికి ఇటీవల రెండు నివేదికలు అందాయని – ఒకటి మాజీ ముఖ్యమంత్రి జె జయలలిత మరణానికి దారితీసిన పరిస్థితులకు సంబంధించినది కాగా, మరొకటి 13 మంది మరణించిన టుటికోరిన్ కాల్పుల ఘటనకు సంబంధించినది అని చెప్పారు. ఈ రెండు నివేదికలను అసెంబ్లీ ముందు ఉంచి చర్యలు తీసుకునే ముందు తగు చర్చలు జరుపుతామని, ఇవి కూడా ఎన్నికల హామీల్లో భాగమేనని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ చెప్పారు. అన్ని కుటుంబాల్లోని మహిళా కుటుంబ పెద్దలకు నెలకు రూ.1000 సాయం త్వరలో అందజేస్తామని తెలిపారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కార్పొరేషన్ పాఠశాలల్లో స్మార్ట్ క్లాస్ పథకం ప్రారంభోత్సవంలో పాల్గొనేందుకు సెప్టెంబర్ 5న తమిళనాడు వస్తున్నారనీ, ఈ సందర్భంగా ఉన్నత విద్యలో చేరే బాలికలకు రూ.1,000 పథకాన్ని కూడా ప్రారంభించనున్నట్లు స్టాలిన్ తెలిపారు.
మాజీ ముఖ్యమంత్రి జె. జయలలిత ఆసుపత్రిలో చేరి మృతి చెందడానికి దారితీసిన పరిస్థితులపై విచారణ జరిపిన జస్టిస్ (రిటైర్డ్) ఎ. ఆరుముఘస్వామి విచారణ కమిషన్ నివేదికను త్వరలో అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నట్లు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ గురువారం తెలిపారు. ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో నివేదికపై విస్తృతంగా చర్చించామని, 2018 తూత్తుకుడి పోలీసు కాల్పుల ఘటనపై జస్టిస్ అరుణ జగదీశన్ విచారణ కమిషన్ నివేదికతో పాటు అసెంబ్లీలో ప్రవేశపెట్టి బహిరంగపరచాలని నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి తెలిపారు. అలాగే, తమ ప్రభుత్వం చేసిన అభివృద్ది అంశాలను ప్రస్తావించారు. అధికారంలోకి వచ్చిన 15 నెలల్లోనే డీఎంకే నేతృత్వంలోని ప్రభుత్వం ఎన్నికల వాగ్దానాలలో దాదాపు 70% నెరవేర్చిందని పేర్కొన్న స్టాలిన్.. “ఇంతకుముందు, ప్రజలు ఫిర్యాదులు ఇవ్వడానికి వచ్చారు.. అప్పుడు ఆందోళనలో ఉండేవారు.. అయితే ఈరోజుల్లో తమ సమస్యలు త్వరగా పరిష్కారమవుతాయనే నమ్మకంతో ప్రజలు తమ బాధలను సంతోషంగా నాతో చెప్పుకుంటున్నారు. ఇదే ద్రావిడ నమూనా’’ అని అన్నారు.
ఇదిలావుండగా, తమిళనాడులోని ఈరోడ్లోని ప్రభుత్వ ఆసుపత్రిలో పేద రోగుల అటెండర్ల కోసం సహాయం చేస్తున్న దంపతులను తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అభినందించారు. దంపతులు, వెంకటరామన్- రాజలక్ష్మి గత 15 సంవత్సరాలుగా ఆహారాన్ని అందించడం కోసం మెస్ నడుపుతున్నారు. ఈ జంట కేవలం ఒక్క రూపాయికి రుచికరమైన భోజనాన్ని అందిస్తుంది. ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న నిరుపేద రోగుల అటెండర్లు తమ పక్కనే ఉన్న మెస్లో మూడు పూటల భోజనాన్ని ఒక్కొక్కరు ఒక రూపాయికి కొనుగోలు చేయవచ్చు.