సుదీర్ఘ కసరత్తు చేశాకే బోర్డు పరిధిలోకి ప్రాజెక్టులు: కేంద్ర జల్ శక్తి జాయింట్ సెక్రటరీ సంజయ్ అవస్తీ
సెంట్రల్ వాటర్ కమిషన్ తో చర్చలతో పాటు సుదీర్ఘ కసరత్తు చేసిన తర్వాతే బోర్డు పరిధిలోకి ఉమ్మడి ప్రాజెక్టులను తీసుకువచ్చినట్టుగా కేంద్ర జల్ శక్తి జాయింట్ సెక్రటరీ సంజయ్ అవస్తీ చెప్పారు.
న్యూఢిల్లీ: సుదీర్ఘ కసరత్తు చేసిన తర్వాతే బోర్డు పరిధిలోకి ఉమ్మడి ప్రాజెక్టులను తీసుకొచ్చామని కేంద్ర జల్ శక్తి జాయింట్ సెక్రటరీ సంజయ్ అవస్తీ తెలిపారు.శుక్రవారం నాడు ఆయన న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారంగా ఇరు రాష్ట్రాల మధ్య నీటి వాటా పంపిణీ జరిగిందన్నారు. కృష్ణా, గోదావరి నదులపై అన్ని ప్రాజెక్టులను బోర్డుల పరిధిలోకి తీసుకొచ్చామన్నారు. సెక్షన్ 84 ప్రకారంగా అపెక్స్ కౌన్సిల్ ఏర్పాటు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
also read:బోర్డు పరిధిలోకి ప్రాజెక్టులు:టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో చర్చ
సెంట్రల్ వాటర్ కమిషన్ సహకారంతో కసరత్తు చేసి గెజిట్ తయారు చేసినట్టుగా ఆయన వివరించారు. అపెక్స్ కౌన్సిల్ లో కేంద్ర జల్శక్తి మంత్రితో పాటు ఇరు రాష్ట్రాల సీఎంలు ఉన్నారని ఆయన గుర్తు చేశారు.2014 నుండి ప్రాజెక్టులను బోర్డుల పరిధిలోకి తీసుకు రావడానికి కసరత్తు చేస్తున్నామన్నారు. అన్ని అంశాలు, అందరి వాదనలు పరిగణనలోకి తీసుకొన్నాకే గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశామన్నారు.2016 సెప్టెంబర్ మాసంలో అపెక్స్ కౌన్సిల్ తొలి సమావేశం జరిగిందని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఈ సమావేశంలో సరైన నిర్ణయం తీసుకోలేదన్నారు.2020 అక్టోబర్ 6న మరోసారి అపెక్స్ కౌన్సిల్ సమావేశమైన విషయాన్ని ఆయన తెలిపారు.