సారాంశం

Coronavirus Updates: "మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, గుజరాత్ ల‌లో కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి.  ఢిల్లీలోనూ కేసులు పెరుగుతాయనే భయం ఉంది. అయితే, కేసుల పెరుగుద‌ల‌కు కార‌ణ‌మైన కొత్త వేరియంట్ తీవ్రంగా లేనందున ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు" అని ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సౌరభ్ భరద్వాజ్ తెలిపారు.
 

Delhi Health Minister Saurabh Bharadwaj: దేశంలోని చాలా ప్రాంతాల్లో మ‌ళ్లీ క‌రోనా వైర‌స్ కేసులు పెరుగుతున్నాయి. వైరస్ వ్యాప్తి క్రమంగా పెరుగుతున్న నేప‌థ్యంలో అప్ర‌మ‌త్త‌మైన కేంద్ర ప్ర‌భుత్వం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల‌ను అలర్ట్ చేసింది. ముఖ్యంగా పండుగ సీజన్ ప్రారంభం కావడంతో ఢిల్లీలో కోవిడ్ -19 కేసులు పెరగడం మరోసారి ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. అయితే, పరిస్థితిని ఎదుర్కోవడానికి అధికార యంత్రాంగం సిద్ధంగా ఉన్నందున ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఢిల్లీ ప్రభుత్వం భరోసా ఇచ్చింది. 

"మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, గుజరాత్ ల‌లో కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. ఢిల్లీలోనూ కేసులు పెరుగుతాయనే భయం ఉంది. అయితే, కేసుల పెరుగుద‌ల‌కు కార‌ణ‌మైన కొత్త వేరియంట్ తీవ్రంగా లేనందున ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు" అని ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సౌరభ్ భరద్వాజ్ తెలిపారు. కోవిడ్ వ్యాప్తిపట్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, పరిస్థితిని ఎదుర్కోవటానికి ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలను తీసుకుందని పేర్కొన్నారు. ఆక్సిజన్ సరఫరా, ఆసుపత్రి పడకల కోసం తగిన ఏర్పాట్లు చేయడంతో రోజుకు 30,000 కేసులను నిర్వహించడానికి ఢిల్లీ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన చెప్పారు.

కోవిడ్-మార్గదర్శకాలు పాటించండి.. 

క‌రోనా వైర‌స్ వేరియంట్లు, కేసుల పెరుగుద‌ల‌ను ఢిల్లీ ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తోందని, నగర ప్రజలు సురక్షితంగా ఉన్నారని నిర్ధారించడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటోందని భరద్వాజ్ తెలిపారు. ప్రజలు మాస్కులు ధరించడం, సామాజిక దూరం పాటించడం, వ్యాక్సిన్ వేయించుకోవడం వంటి కోవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు. కోవిడ్ నిబంధ‌న‌లు పాటించ‌డం కోవిడ్-19 వ్యాప్తిని త‌గ్గించ‌డంతో పాటు దాని బారిన‌ప‌డ‌కుండా ఉంటామ‌ని ప్ర‌జ‌లకు తెలిపారు.

భారత్ లో కొత్తగా 3,038 కోవిడ్-19 కేసులు

ఇదిలావుండ‌గా, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంగళవారం అప్డేట్ చేసిన డేటా ప్రకారం.. భారతదేశంలో గ‌త 24 గంట‌ల్లో 3,038 కొత్త కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. దీంతో యాక్టివ్ కేసులు 21,179 కు పెరిగాయి. తొమ్మిది కొత్త‌ మరణాలతో మొత్తం మరణాల సంఖ్య 5,30,901కి చేరింది. 24 గంటల వ్యవధిలో ఢిల్లీ, పంజాబ్ ల‌లో ఇద్దరు చొప్పున, జమ్మూకాశ్మీర్, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్ ల‌లో ఒక్కొక్కరు, కేరళలో ఇద్దరు మరణించారు.