మేం ప్రత్యర్థులం కాదు.. మాది ఫ్రెండ్లీ పోటీ: సమావేశమైన శశిథరూర్, దిగ్విజయ్ సింగ్
కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రేపు నామినేషన్ వేయబోతున్న శశిథరూర్, దిగ్విజయ్ సింగ్లు ఈ రోజు ఢిల్లీలో సమావేశం అయ్యారు. అనంతరం శశిథరూర్ ఓ ట్వీట్ చేశారు. తాము ప్రత్యర్థులం కాదని, ఇద్దరు సహచరుల మధ్య ఫ్రెండ్లీ పోటీ అని పేర్కొన్నారు. శశితో ఏకీభవిస్తూ తమది మత విద్వేషాలు సృష్టిస్తున్న శక్తులపై పోరాటం అని డిగ్గీ రీట్వీట్ చేశారు.
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల కోసం రేపు నామినేషన్లు వేయనున్న తరుణంలో దిగ్విజయ్ సింగ్, శశిథరూర్లు ఈ రోజు ఢిల్లీలో సమావేశం అయ్యారు. ఈ భేటీ తర్వాత శశిథరూర్ ఓ ట్వీట్ చేశారు. తాము ప్రత్యర్థులం కాదని పేర్కొన్నారు. తమది ఫ్రెండ్లీ పోటీ మాత్రమేనని చెప్పుకొచ్చారు.
కాంగ్రెస్ అధ్యక్ష పోటీకి ఇది వరకు ఎవరూ నామినేషన్ దాఖలు చేయలేదు. రేపు శశిథరూర్, దిగ్విజయ్ సింగ్లు నామినేషన్ వేయనున్నట్టు ప్రకటించారు. ఇది వరకు రేసు లో ఉన్న బలమైన అభ్యర్థిగా భావించిన అశోక్ గెహ్లాట్ పోటీ నుంచి వైదొలిగారు. దీంతో ఇప్పటి వరకు తెలిసిన అభ్యర్థులు మాత్రం శశిథరూర్, దిగ్విజయ్ సింగ్లు మాత్రమే.
వీరిద్దరూ ఢిల్లీలో సమావేశం అయిన తర్వాత శశిథరూర్ ట్వీట్ చేశారు. దిగ్విజయ్ సింగ్ ఆ ట్వీట్ను రీట్వీట్ చేశారు. తాను ఈ రోజు మధ్యాహ్నం దిగ్విజయ్ సింగ్తో భేటీ అయినట్టు శశిథరూర్ పేర్కొన్నారు. తమ పార్టీ అధ్యక్షుడి బరిలో ఆయన అభ్యర్థిత్వాన్ని తాను స్వాగతిస్తున్నట్టు వివరించారు. కానీ, తమ మధ్య ప్రత్యర్థుల పోరు లేదని, తమది కేవలం సహచరుల మధ్య ఫ్రెండ్లీ పోటీ మాత్రమే అని వివరించారు. తమ ఇద్దరిలో ఎవరు గెలిచినా అది పార్టీ గెలుపుగానే తీసుకుంటామని తెలిపారు.
కాగా, శశిథరూర్ ట్వీట్ ను రీట్వీట్ చేస్తూ.. దిగ్విజయ్ సింగ్ స్పందించారు. శశిథరూర్ తో తాను ఏకీభవిస్తున్నానని వివరించారు. తాము దేశంలోని మత విద్వేషాలను సృష్టిస్తున్న శక్తులతో పోరాడుతున్నామని తెలిపారు. తాము ఇద్దరూ గాంధీ, నెహ్రూ భావజాలంలో విశ్వాసం ఉన్నవాళ్లమని పేర్కొన్నారు. ఏది ఎదురు వచ్చినా వెనుక అడుగు వేయకుండా పోరాడుతామని ట్వీట్ చేశారు. బెస్ట్ విషెస్ అంటూ ట్వీట్ చేశారు.
ఈ ఇద్దరి పోటీ కూడా ఆసక్తి కరంగానే సాగనుంది. ఎందుకంటే.. దిగ్విజయ్ సింగ్ గాంధీ కుటుంబాని కి అత్యంత విశ్వాసపాత్రుడు. అదే శశిథరూర్ కాంగ్రెస్లో సమూల మార్పులు రావాలని అధ్యక్షురాలు సోనియా గాంధీ పై తిరుగుబాటు చేస్తూ బహిరంగ లేఖ రాసిన 23 మందిలో శశిథరూర్ కూడా ఉన్నారు.