సారాంశం
కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మరోసారి నిజ్జర్ హత్యను పేర్కొంటూ భారత్ పై వ్యాఖ్యలు చేశారు. తాము భారత్ను రెచ్చగొట్టడం లేదని, కేవలం తమకు సమాధానాలు కావాలని అన్నారు.
ఒట్టావా: ఖలిస్తానీ టెర్రరిస్టు హత్య కేసులో భారత ఏజెంట్ల ప్రమేయం ఉన్నదనే విశ్వసనీయ సమాచారం అందిందని తాము భారత్ను రెచ్చగొట్టాలని భావించడం లేదని కెనడా ప్రభుత్వం తెలిపింది. అయితే, భారత ప్రభుత్వం ఈ సమస్యను సరైన తీరులో చూడాలని కోరుకుంటున్నామని వివరించింది. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.
‘భారత ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోవాలని మేం కోరుకుంటున్నాం. మేం కూడా అదే పని చేస్తున్నాం. అంతేకానీ, భారత్ను రెచ్చగొట్టాలనో, సమస్యను పెద్దది చేయాలనో మేం చూడటం లేదు. మాకు కేవలం సమాధానాలు కావాలి’ కెనడా పీఎం జస్టిన్ ట్రూడో ఈ రోజు విలేకరులకు తెలిపారు.
Also Read : ఖలిస్తానీ తీవ్రవాదుల పై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోకు ఉదాసీనత ఎందుకు?
జూన్లో జరిగిన నిజ్జర్ హత్య కేసులో భారత ఏజెన్సీల లింక్ ఉన్నదనే విశ్వసనీయ సమాచారం వచ్చిందని, కెనడా ఆ వైపుగా దర్యాప్తు చేస్తుందని కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో నిన్న చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఆ తర్వాత కెనడా ఆ దేశంలోని భారత రాయబారిని బహిష్కరించింది. దీంతో ఇండియా సీరియస్గా రియాక్ట్ అయింది. కెనడా ఆరోపణలు ఖండించింది. కేంద్ర విదేశాంగ శాఖ ఘాటుగా సమాధానం ఇచ్చింది. కెనడా రాయబారిని కూడా బహిష్కరించింది. ఇక్కడి నుంచి వెళ్లిపోవడానికి ఐదు రోజుల గడువు పెట్టింది. ఈ ఉదంతంతో ఉభయ దేశాల మధ్య సంబంధాలు దారుణంగా దిగజారాయి.