సారాంశం

ఖలిస్తానీ సమస్య భారత్, కెనడాల మధ్య అగ్గిరాజేసింది. ఉభయ దేశాల మధ్య సంబంధాలు దారుణంగా దిగజారిపోయాయి. ఇరు దేశాలు తమ రాయబారులను బహిష్కరించుకున్నాయి. అయితే.. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఎందుకు ఖలిస్తానీల పట్ల ఉదాసీనత వహిస్తున్నారు. ఎందుకు మెతక వైఖరి అవలంభిస్తున్నారు? అనే విషయంపై చర్చిద్దాం.
 

న్యూఢిల్లీ: భారత్, కెనడాలు ఉభయ దేశాల రాయబారులను బహిష్కరించుకోవడంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు పతన స్థాయికి వెళ్లాయి. ఖలిస్తాన్ వేర్పాటువాద అనుకూల నాయకుడు హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు సంబంధించిన దర్యాప్తులో భారత ఏజెంట్ల పాత్రనూ పరిశీలిస్తామని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన వ్యాఖ్యలు రెండు దేశాల మధ్య అగ్గిరాజేసింది. కొంతకాలంగా ఈ రెండు దేశాల మధ్య ఆశాజనక వాతావరణమేమీ లేదు. కానీ, తాజా ఉదంతం సంబంధాలను మరింత క్షీణింపజేసింది.

జస్టిన్ ట్రూడో వ్యాఖ్యలకు భారత విదేశాంగ శాఖ ఘాటుగా బదులిచ్చింది. కెనడా వ్యాఖ్యలను ఖండించి భారత సార్వభౌమత్వానికి, భౌగోళిక సమగ్రతకు ముప్పుగా ఉన్న ఖలిస్తానీ టెర్రరిస్టులు, ఎక్స్‌ట్రీమిస్టులకు ఆశ్రయం కల్పిస్తున్నదని మండిపడింది. కెనడా ఈ వైఖరిని దీర్ఘకాలంగా అవలంభిస్తున్నదని, ఇది భారత్‌కు నిత్యం ఆందోళనకరంగానే ఉన్నదని పేర్కొంది. అలాంటి శక్తులకు కెనడా రాజకీయ నేతలు బహిరంగంగా మద్దతు ప్రకటిస్తున్నారని, ఇది కెనడాకు కొత్తేమీకాదని ఘాటుగా కామెంట్ చేసింది.

ఖలిస్తానీ సమస్యపై ట్రూడో ప్రభుత్వం అవసరమైన స్థాయిలో చర్యలు తీసుకోవడం లేదని భారత ప్రభుత్వం ఆరోపించడం ఇదే తొలిసారి కాదు. కానీ, కెనడాలో భారత వ్యతిరేక సెంటిమెంట్లను ప్రచారం చేస్తున్న ఖలిస్తానీ వేర్పాటువాదులపై జస్టిన్ ట్రూడో ఎందుకు ఉదాసీనంగా ఉంటున్నాడు? ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం.

భారత ప్రవాసుల జనాభ

భారత ప్రవాసుల సంఖ్య భారీగా ఉన్న దేశాల్లో కెనడా ఒకటి. ఆ దేశ జనాభా 40 మిలియన్లు ఉంటే అందులో 1.4 మిలియన్లు(14 లక్షలు) భారత ప్రవాసులే. ఇందులో 770,000 సిక్కుల జనాభా ఉన్నది(2021 జనాభా లెక్కలను రాయిటర్స్ పేర్కొంటూ రిపోర్ట్ చేసింది). ఇంకా చెప్పాలంటే భారత్ తర్వాత అత్యధిక సిక్కుల జనాభా గల దేశం కెనడానే. వీళ్లు అక్కడ బలమైన ఓటర్ల సముదాయంగా ఉన్నది. 

కెనడా ప్రభుత్వంలో సిక్కులు అన్ని స్థాయిలో ఉన్నారు. కెనడాలోని సిక్కులు అందరూ ఖలీస్తానీ డిమాండ్‌ను బలపరచరు. లేదా వారికి ఇదే ముఖ్యమైన విషయం కూడా కాదు. కెనడా నేతలు సిక్కుల ఓట్లను కోల్పోవాలని అనుకోరు. కానీ, వారు వీరిని తప్పుగా అర్థం చేసుకుంటున్నారని ఖలిస్తానీలపై పుస్తకం రాసిన టెర్రీ మెలి‌వ్స్కీ డీడబ్ల్యూకు 2022లో చెప్పారు. ఖలిస్తానీ డిమాండ్ బలంగా వినిపించే మైనార్టీ గళాన్నే కెనడాలోని అందరి డిమాండ్ అని తప్పుగా అర్థం చేసుకుంటున్నారని వివరించారు.

ఖలిస్తానీ తీవ్రవాదంతో కెనడా స్వయంగా ముప్పును ఎదుర్కొంది. మొంట్రియల్ నుంచి లండన్‌కు వెళ్లే విమానంపై బాంబులు వేశారు. ఈ దాడి వెనుక మాస్టర్ మైండ్‌గా కెనడాలోనే ఉండే ఖలిస్తానీ అనుకూల నేత తల్విందర్ సింగ్ పర్మార్ అని చెబుతారు.

Also Read: భారత్, కెనడాల మధ్య విభేదాలు.. అమెరికా ఏమన్నదంటే?

ట్రూడో రాజకీయ అవసరం

కెనడాలో ట్రూడో లిబరల్ పార్టీ ఒక మైనార్టీ ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తున్నది. 2021లో లిబరల్ పార్టీ కేవంల 159 సీట్లతో అధికారంలోకి వచ్చింది. మూడోసారి జస్టిన్ ట్రూడో ప్రధాని అయ్యారు. గత మార్చి నెలలో ట్రూడో ప్రభుత్వం న్యూ డెమోక్రటిక్ పార్టీతో ఓ డీల్ చేసుకుంది. 2025 వరకు అధికారంలో ఉండటానికి మద్దతు సుస్థిరం చేసుకుంది. ఈ ఎన్‌డీపీ జగ్మీత్ సింగ్ సారథ్యంలో ఉన్నది. ఈయనను ఖలిస్తానీ మద్దతుదారుడిగా చూస్తారు. ఓ ఖలిస్తానీ వేర్పాటువాద ర్యాలీలోనూ సింగ్ ఒకసారి పాల్గొన్నట్టు స్క్రోల్ రిపోర్ట్ చేసింది.

కీలకమైన జగ్మీత్ సింగ్ మద్దతుతో ట్రూడో తన రాజకీయ మనుగడ కోసం కత్తి మీద సాము చేస్తున్నాడు. 2019 ఎన్నికల్లోనే జగ్మీత్‌తో డీల్‌ కుదిరినా.. ఇప్పుడు ట్రూడోకు ఆయన నమ్మకమైన మద్దతుదారు. విపక్షాల దాడులను తిప్పికొట్టే సమర్థమైన భాగస్వామి.

ఈ ఏడాది మార్చిలో పంజాబ్ పోలీసులు ఖలిస్తాన్ మద్దతుదారు అమృత్ పాల్ సింగ్ పై విరుచుకుపడ్డప్పుడు కూడా జగ్మీత్ సింగ్ ట్రూడో జోక్యాన్ని కోరారు. భారత్‌తో జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

1984లో బ్లూ స్టార్ ఆపరేషన్ కంటే ముందు నుంచే భారత్, కెనడాల మధ్య ఈ రకమైన విభేదాలు ఉన్నాయి. 1982లో అప్పటి భారత ప్రధాని ఇందిరా గాంధీ అప్పటి కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తండ్రి పియర్ ట్రూడో ముందుకు ఈ విషయాన్ని తీసుకెళ్లినట్టు టెర్రీ మిలెవ్‌స్క్రీ తన పుస్తకంలో రాశారు. ఇప్పుడు జస్టిన్ ట్రూడోకు రాజకీయ అవసరం కోసం ఖలిస్తానీ వేర్పాటువాదులపై మెతక వైఖరి అవలంభిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.