దేశవ్యాప్తంగా ముసురుకున్న లౌడ్ స్పీకర్ల వివాదానికి తమ రాష్ట్రంలో చెక్ పెట్టేలా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ చర్యలు చేపట్టారు. దీనిలో భాగంగా గతంలో ఆయన జారీ చేసిన ఆదేశాలు మంచి ఫలితాలను ఇస్తున్నాయి.
హిజాబ్ వివాదం (hijab row) తర్వాత దేశవ్యాప్తంగా లౌడ్ స్పీకర్ల వివాదం రాజుకుంది. దీనిపై కొన్ని ప్రాంతాల్లో ఆందోళనలు, నేతల విమర్శలు వెలుగుచూస్తున్నాయి. ఇకపోతే.. ఉత్తరప్రదేశ్లో (uttar pradesh) యోగి ఆదిత్యనాథ్ (yogi adityanath) సర్కారు గత వారం తీసుకొచ్చిన నూతన ఆదేశాలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. ప్రార్థనా స్థలాల వద్ద అనుమతి లేకుండా లౌడ్ స్పీకర్లు (loud speaker) వాడుకోవడానికి కుదరదని యూపీ ప్రభుత్వం తేల్చి చెప్పింది. అనుమతి తీసుకుని ప్రార్థనా స్థలాల్లో (మసీదులు, చర్చిలు, ఆలయాలు) లౌడ్ స్పీకర్లను వాడుకోవచ్చని నాటి ఆదేశాల్లో పేర్కొంది. కానీ, వాటి నుంచి వెలువడే శబ్ధ తరంగాల స్థాయి (సౌండ్) ఆ ప్రదేశం దాటి బయటకు వినిపించకూడదు.
ప్రభుత్వ ఆదేశాలతో రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు అసౌకర్యాన్ని కలిగిస్తున్న 17,000 లౌడ్ స్పీకర్ల సౌండ్ దాదాపుగా తగ్గిపోయింది. 125 ప్రాంతాల్లోని లౌడ్ స్పీకర్లను స్వాధీనం చేసుకున్నట్టు యూపీ శాంతి, భద్రతల అదనపు డైరెక్టర్ జనరల్ (ఏడీజీ) ప్రశాంత్ కుమార్ వెల్లడించారు. నమాజ్ ప్రశాంత వాతావరణం మధ్య చేసుకునేందుకు వీలుగా భద్రతను కట్టుదిట్టం చేసినట్టు చెప్పారు. శ్రీకృష్ణ పరమాత్ముడి జన్మస్థలం మధురలోనూ లౌడ్ స్పీకర్లు మూగబోయాయి. ప్రతి రోజూ ఆలయం వద్ద గంటన్నర భక్తి గీతాలను పెట్టేవారు. అది ఇప్పుడు ఆగిపోయింది. గోరక్నాథ్ టెంపుల్ లౌడ్ స్పీకర్ల వ్యాల్యూమ్ను కూడా తగ్గించారు.
కాగా.. ఇటీవల శ్రీరామ నవమి సందర్భంగా పలు రాష్ట్రాల్లో చోటు చేసుకున్న మత ఘర్షణల నేపథ్యంలో యూపీ ప్రభుత్వం అలెర్ట్ అయ్యింది. అనుమతి లేకుండా ఎలాంటి మతపరమైన ర్యాలీలూ చేపట్టకూడదని తేల్చి చెప్పింది. ఊరేగింపులు నిర్వహించాలనుకునే వారు ఏవైనా ఘటనలు జరిగితే తామే పూర్తి స్థాయి బాధ్యత వహిస్తామని అఫిడివిట్ అందజేయాల్సి ఉంటుందని పేర్కొంది. ఈ నేపథ్యంలో తగిన అనుమతి లేకుండా రాష్ట్రంలో ఎలాంటి మతపరమైన ఊరేగింపులూ లేదా కవాతులు చేయకూడదని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆదేశించారు. లౌడ్ స్పీకర్ల వినియోగం వల్ల ఇతరులకు అసౌకర్యం కలగకూడదని అన్నారు.
ఈద్, అక్షయ తృతీయ పండుగ వచ్చే నెలలో ఒకే రోజున వచ్చే అవకాశం ఉన్నాయి. తరువాత కూడా అనేక పండగలు రానున్నాయి. ఈ సందర్భంగా యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ.. ప్రతీ ఒక్కరికి తన మత సిద్ధాంతాల ప్రకారం పూజా విధానాన్ని అనుసరించే స్వేచ్ఛ ఉందని అన్నారు. అయితే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలూ జరగకుండా పోలీసులు మరింత జాగ్రత్తగా ఉండాలని సీఎం ఆదేశించారు. ఈ పండగలకు అనుమతి ఇచ్చే ముందు శాంతి, సామరస్యాలను పరిరక్షిస్తామంటూ నిర్వాహకులందరూ అఫిడవిట్ సమర్పించాల్సి ఉంటుందని యోగి ఆదిత్యనాథ్ చెప్పారు. మైక్లు వాడవచ్చు గానీ, ఆ ప్రాంగణంలో నుంచి సౌండ్ బయటకు రాకుండా చూసుకోవాలని అన్నారు. ఇతరులకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదని, కొత్త ప్రదేశాల్లో లౌడ్ స్పీకర్లు ఏర్పాటు చేసేందుకు అనుమతులు ఇవ్వరాదని సూచించారు
