AIADMK: ఏఐఏడీఎంకేలో ఆధిపత్య పోరు.. చెన్నైలో యాత్ర చేపడుతున్న శశికళ
తమిళనాడులో ప్రతిపక్ష పార్టీలో అంతర్గతంగా అనేక మార్పులు జరుగుతున్నట్టు తెలుస్తున్నది. ఈపీఎస్, ఓపీఎస్ల మధ్య వైరుధ్యాలు రచ్చకెక్కిన తరుణంలో జయలలిత నెచ్చెలి వీకే శశికళ చెన్నైలో ఓ టూర్కు ప్లాన్ చేయడం చర్చనీయాంశం అయింది.
చెన్నై: తమిళనాడు ప్రతిపక్ష పార్టీ ఏఐఏడీఎంకేలో అంతర్గత వైరుధ్యాలు తీవ్రం అవుతున్నాయి. ఇప్పుడు అవి రహస్య తెరలు దాటుకుని రచ్చకెక్కుతున్నాయి. ఇదే తరుణంలో పార్టీ పగ్గాల కోసం ప్రయత్నిస్తున్న చిన్నమ్మ శశికళ చెన్నైలో రివల్యూషనరీ టూర్ చేపడుతున్నారు. ఈ నెల 26వ తేదీ నుంచి ఆమె ఈ యాత్ర చేపట్టనున్నారు.
ఈ నెల 26వ తేదీ నుంచి ఆమె టీ నగర్లోని తన నివాసం నుంచి ఆమె ఈ యాత్ర చేపడుతున్నారు. చెన్నైలోని పలు ప్రాంతాల్లో ఈ బహిరంగ సమావేశాలకు ప్లాన్ చేశారు. తమిళ గడ్డ హక్కులు, మహిళల డిగ్నిటీలను డిఫెండ్ చేస్తూ ఆమె ఈ రివల్యూషనరీ టూర్ చేపట్టనున్నట్టు శశికళ ఓ స్టేట్మెంట్లో ప్రకటించారు.
జూన్ 26న మధ్యాహ్నం 12.30 గంటలకు ఆమె టీ నగర్ నుంచి కోయంబేడు, పూనమల్లీ, తిరుతని, కోరమంగళ, కేజీ సందిగాయిమ్ ఎస్వీజీ పురం, క్రిష్ణకుప్పం, ఆర్ కే పెట్టాయలను పర్యటించనున్నారు. అనంతరం ఆమె తిరిగి తన నివాసానికి రానున్నారు. పార్టీ సుప్రీమ్ నేతలు ఎంజీ రామచంద్రన్, జే జయలలితల సందేశాన్ని మరింత విస్తృతం చేయడానికి ఈ యాత్ర చేపడుతున్నట్టు ఆమె వెల్లడించారు.
మే నెల 25న ఆమె ఓ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, తాను మళ్లీ క్రియా శీలక రాజకీయాల్లోకి రాబోతున్నట్టు సంకేతాలు ఇచ్చారు. అంతేకాదు, రాష్ట్రంలో ప్రతిపక్షంలోని ఏఐఏడీఎంకే పార్టీ సమర్థంగా పని చేయడం లేదని ఆరోపించారు. ఏఐఏడీఎంకేలో త్వరలోనే అమ్మ పాలన వస్తుందని అన్నారు.
గురువారం జరిగిన పార్టీ సర్వసభ్య సమావేశంలో మాజీ సీఎంలు పన్నీర్సెల్వం (panneerselvam), ఎడప్పాడి పళనిస్వామి (palaniswami) వర్గాల మధ్య వివాదం చెలరేగింది. పార్టీలో ఏక నాయకత్వాన్ని కోరుకుంటోన్న పళనిస్వామికి సీనియర్ నేతలు మద్దతు తెలపడాన్ని పన్నీర్సెల్వం వర్గం వ్యతిరేకించింది. ఇదే సమయంలో వేదికపైకి చేరుకున్న పన్నీర్సెల్వంపైకి పళని మద్దతుదారులు వాటర్ బాటిళ్లతో దాడికి యత్నించడంతో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. దీంతో భద్రతా సిబ్బందిని ఆయనను బయటకు తీసుకెళ్లారు. అయితే, పళనిస్వామి తిపాదించిన ఏక నాయకత్వంపై జనరల్ కౌన్సిల్ ఎటువంటి నిర్ణయం తీసుకోకూడదని.. కేవలం ముందస్తుగా నిర్ణయించిన తీర్మానాలనే ఆమోదించాలంటూ మద్రాస్ హైకోర్టు ఆదేశించిన కొన్ని గంటలకే పార్టీ సమావేశంలో గొడవ జరగడం గమనార్హం.
గతంలో ప్రతిపాదించిన తీర్మానాలను ఆమోదించేందుకు అన్నాడీఎంకే పార్టీ సర్వసభ్య సమావేశం గురువారం భేటీ అయ్యింది. ఇదే సమయంలో పళని, పన్వీర్ సెల్వంలు తమ మద్దతుదారులతో అక్కడికి చేరుకున్నారు. ఇరువర్గాల నినాదాలు, కేకల మధ్యే తీర్మానాలను చదవడం మొదలుపెట్టారు. అయితే, ఈ తీర్మానాలన్నింటినీ జనరల్ కౌన్సిల్ తోసిపుచ్చుతోందంటూ అన్నాడీఎంకే సీనియర్ నేత షణ్ముగం ప్రకటించారు. మరో సీనియర్ కేపీ మునుస్వామి మాట్లాడుతూ.. తీర్మానాలన్నింటినీ సభ్యులు తిరస్కరించారని.. ఏక నాయకత్వమే వారి ప్రధాన డిమాండ్ అని ప్రకటించారు.