వైద్యులతో సమావేశం... కన్నీళ్లు పెట్టుకున్న ప్రధాని మోదీ
ఈ సమావేశంలో వారితో మాట్లాడుతూ ఆయన ఒక్కసారిగా భావోద్వేగానికి లోనయ్యారు. కోవిడ్ మహమ్మారి సమయంలో వారు చేస్తున్న ధైర్యసాహసాలను కృషిని అభినందించారు. కోవిడ్ మహమ్మారికి ఎంతో మంది బలయ్యారని కన్నీళ్లు పెట్టుకున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ వైద్యులు చేస్తున్న సాహాసానికి ఆయన సలాం చేశారు. వైద్యులు, కార్మికుల కృషిని అభినందించారు. ఈ క్రమంలోనే ఆయన తీవ్ర భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇంతకీ మ్యాటరేంటంటే..
ఉత్తరప్రదేశ్లోని వారణాసికి చెందిన వైద్యులు సహా మొదటి శ్రేణి కార్మికులతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ వర్చువల్ సాంకేతిక పరిజ్ణానం ద్వారా సమావేశం అయ్యారు. కాగా, ఈ సమావేశంలో వారితో మాట్లాడుతూ ఆయన ఒక్కసారిగా భావోద్వేగానికి లోనయ్యారు. కోవిడ్ మహమ్మారి సమయంలో వారు చేస్తున్న ధైర్యసాహసాలను కృషిని అభినందించారు. కోవిడ్ మహమ్మారికి ఎంతో మంది బలయ్యారని కన్నీళ్లు పెట్టుకున్నారు.
‘‘నిన్నమొన్నటి వరకు మన చుట్టు పక్కనే ఉన్న చాలా మందిని కోవిడ్ బలి తీసుకుంది. వారి కుటుంబాలకు నా సంతాపం వ్యక్తం చేస్తున్నాను. డాక్టర్లు, ఇతర మొదటి శ్రేణి కార్మికులు ప్రాణాలను పణంగా పెట్టి కోవిడ్పై పోరాటం చేస్తున్నారు’’ అని మోదీ అన్నారు.
కాగా, గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,59,591 కరోనా కేసులు నమోదు కాగా, 4,209 మంది కరోనాతో మృతి చెందారు. దేశంలో మొత్తం 2 కోట్ల 60 లక్షల 31 వేలకు కరోనా కేసులు చేరుకున్నాయి. ప్రస్తుతం దేశంలో 30,27,925 యాక్టివ్ కేసులు ఉండగా, కరోనాతో 2,91,331 మరణాలు సంభవించాయి. దేశ వ్యాప్తంగా 14,82,754 మందికి వ్యాక్సిన్ తీసుకున్నారని, భారతదేశంలో యాక్టివ్ కేసులు 11.63 శాతం, మరణాల రేటు 1.12 శాతం ఉన్నట్లు శుక్రవారం కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ తెలిపారు.