Violence in JNU: జేఎన్యూలో విద్యార్థుల మధ్య ఘర్షణ.. పలువురికి తీవ్ర గాయాలు.. అసలేం జరిగిందంటే?!
Violence in JNU: ఢిల్లీలో జవహర్లాల్నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్యూ)లో ఆదివారం రెండు గ్రూపుల విద్యార్థులు ఘర్షణకు దిగారు. శ్రీరామ నవమి సందర్భంగా హాస్టల్ నాన్వెజ్ కర్రీ వడ్డించడాన్ని ఒక గ్రూప్ అడ్డుకోగా.. మరో గ్రూప్ ప్రశ్నించడంతో ఇరు వర్గాల మధ్య ఉద్రికత్త వాతావరణం నెలకొంది. ఒక్కరిపై ఒక్కరూ దాడికి పాల్పడ్డారు.
Violence in JNU: దేశ రాజధాని ఢిల్లీలో జవహర్లాల్నెహ్రూ యూనివర్సిటీ (JNU)లో ఆదివారం రెండు గ్రూపుల విద్యార్థులు ఘర్షణకు దిగారు. రామ నవమి సందర్భంగా హాస్టల్ క్యాంటీన్లో మాంసాహారం వడ్డిస్తున్నారని ఒక గ్రూప్ అడ్డుకోగా.. మరో గ్రూప్ ప్రశ్నించడంతో ఈ ఘటన జరిగింది. మధ్యాహ్నం 3.30 గంటలకు కావేరి హాస్టల్లో ఈ ఘటన చోటు చేసుకుంది.
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP) సభ్యులు మెస్ సెక్రటరీపై దాడి చేశారని, హాస్టల్లో మాంసం వంటకాలు వడ్డించకుండా సిబ్బందిని అడ్డుకున్నారని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ (JNUSU) ఆరోపించింది.
జేఎన్యూఎస్యూ ఆరోపణను బీజేపీ మాతృసంస్థ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అనుబంధ ఏబీవీపీ (ABVP) ఖండించింది. హాస్టల్లో శ్రీరామ నవమి సందర్భంగా పూజా కార్యక్రమాన్ని నిర్వహించకుండా వామపక్ష సంఘాల సభ్యులు అడ్డుకోవడానికి ప్రయత్నించారని పేర్కొంది. ఈ సందర్భంగా ఇరు పక్షాలు రాళ్లు రువ్వుకున్నాయి. దీంతో వారికి గాయాలయ్యాయి.
యూనివర్సిటీ అధికారులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు క్యాంపస్లోకి ప్రవేశించారు. ఢిల్లీ డీసీపీ (నైరుతి) మనోజ్ సీ ఆధ్వర్యంలో పోలీసు బలగాలు క్యాంపస్లోకి ప్రవేశించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (నైరుతి) మనోజ్ సి మీడియాతో మాట్లాడుతూ.. "ప్రస్తుతం ఎలాంటి హింసాకాండ జరగలేదు. నిరసన ముగిసింది. మేమంతా మా బృందంతో ఇక్కడే ఉన్నాము. యూనివర్సిటీ అభ్యర్థన మేరకు మేం ఇక్కడికి వచ్చాం. శాంతిభద్రతలను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నాం" అని తెలిపారు.
ABVP అధికార బలంతో గూండాయిజానికి పాల్పడుతున్నదని JNUSU ఆరోపించింది. వారు బలవంతంగా మెస్ కమిటీ సభ్యులపై దాడి చేశారని తెలిపింది. డిన్నర్ మెనూని మార్చాలని, విద్యార్థులందరికీ మాంసాహార పదార్థాలను మినహాయించాలని మెస్ కమిటీ సభ్యులపై దాడి చేశారని" అని విద్యార్థి సంఘం ఒక ప్రకటనలో తెలిపింది. జేఎన్యూ, యూనివర్సిటీ హాస్టళ్లు ఏ ఒక్క సెక్షన్కు మాత్రమే చెందింది కాదని, అన్ని వర్గాలకు చోటు ఉంటుందని స్పష్టం చేసింది. జేఎన్యూఎస్యూ ఆరోపణలను ఏబీవీపీ తోసిపుచ్చింది.
శ్రీరామ నవమి సందర్భంగా కొందరు విద్యార్థులు కావేరి హాస్టల్లో 3.30 గంటలకు పూజ కార్యక్రమం చేపట్టారని తెలిపింది. భారీ సంఖ్యలో విద్యార్థులు పూజలో పాల్గొన్నారని, అయితే.. వామపక్ష విద్యార్థి సంఘాల సభ్యులు అభ్యంతరం తెలిపారని, పూజ జరగకుండా అడ్డుకున్నారనీ, వారు విద్యార్థులపై ఎదురు దాడికి దిగారని పేర్కొంది. కానీ వారు రైట్ టు ఫుడ్ (నాన్ వెజిటేరియన్ ఫుడ్) అంశాన్ని కావాలని లేవనెత్తుతున్నారని ఆరోపించింది. ఇరు వర్గాల మధ్య జరిగిన సంఘర్షణలో అనేక మంది విద్యార్థి నిరసనకారులు గాయపడ్డారని, వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించారని నివేదికలు చెబుతున్నాయి. క్యాంపస్ పరిసరాల్లో ఇంకా కొంతమంది విద్యార్థులు నిరసనలు చేస్తున్నట్టు సమాచారం.
మరోవైపు.. ఏబీవీపీ విద్యార్థులే తమపై దాడి చేశారని వామపక్ష విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఈ ఘర్షణలో చాలా మంది విద్యార్థులు గాయపడినట్టు తెలుస్తోంది. ABVP సభ్యులు దారుణంగా దాడి చేసి గాయపరిచారని పలువురు JNU స్టూడెంట్స్ యూనియన్ సభ్యులు ట్విట్టర్లో పేర్కొన్నారు. హింసాకాండకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట్లో ప్రత్యేక్షమయ్యాయి. ఇరు వర్గాల మధ్య రాళ్లదాడికి జరిగినట్టు సమాచారం. కొంతమంది విద్యార్థుల పరిస్థితి అత్యంత విషయంగా ఉన్నట్టు తెలుస్తోంది.
ఈ దాడిపై CPIML పొలిట్బ్యూరో సభ్యురాలు కవితా కృష్ణన్ ట్విట్టర్లో మాట్లాడుతూ.. దాడిలో ముగ్గురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారనీ, వారికి తీవ్ర రక్తస్రావం అవుతుందని తెలిపారు. రాత్రి భోజనానికి నాన్ వెజ్ ఫుడ్ తీసుకోకుండా ఏబీవీపీ సభ్యులు అడ్డుకోవడంతో పాటు మెస్ సెక్రటరీపై దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. యూనివర్శిటీలో మాంసాహారంపై నిషేధం విధించడాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థులు ఆందోళనకు దిగారని, దీంతో హింస చెలరేగిందని విద్యార్థి నాయకురాలు కవల్ప్రీత్ కౌర్ ఆరోపించారు.