మహారాష్ట్రలో మూడు పులుల మృతి: వీడిన మిస్టరీ, విషం వల్లనే
మహారాష్ట్రలోని చంద్రపూర్ ప్రాంతంలో సోమవారం చనిపోయిన మూడు పులుల మిస్టరీ వీడింది
మహారాష్ట్రలోని చంద్రపూర్ ప్రాంతంలో సోమవారం చనిపోయిన మూడు పులుల మిస్టరీ వీడింది. మెట్పార్ గ్రామంలోని పాండురంగ అనే రైతు కుక్కలను చంపేందుకు వీలుగా చనిపోయిన ఆవుదూడపై విషం చల్లాడని.. అది తినడం వల్లనే పులులు మృతిచెందాయని అటవీశాఖ దర్యాప్తులో తేలింది.
వివరాల్లోకి వెళితే... పాండురంగ తన వ్యవసాయ భూమిలో ఆవులను పెంచుకుంటున్నాడు. ఆ పొలంలోకి గ్రామానికి చెందిన కొన్ని పెంపుడు కుక్కులు వచ్చి ఆవుదూడపై దాడిచేసి చంపేశాయి.
దీనిపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన అతను .. కుక్కల పనిపట్టాలనుకున్నాడు. దీనిలో భాగంగా చనిపోయిన ఆవుదూడపై విషం పోసి వచ్చాడు. అయితే ఈ గ్రామం తాడోబా అభయారణ్యాలకు సమీపంలో ఉండటంతో పులి తన ఎనిమిది, తొమ్మిది నెలల పిల్లలతో ఆహారం కోసం సంచరిస్తూ వచ్చింది.
ఆకలితో ఉన్న అది తన పిల్లలలో పాటు ఆవుదూడ మాంసాన్ని తింది. విష ప్రభావంతోనే అవి మూడు మృతి చెందాయని అధికారులు తేల్చారు. దీంతో నిందితుడు పాండురంగను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతనిని కోర్టులో ప్రవేశపెట్టారు. అతడికి న్యాయస్థానం ఈ నెల 12 వరకు రిమాండ్ విధించింది.