Asianet News TeluguAsianet News Telugu

దంతేవాడలో మావోయిస్టుల ఘాతుకం.. 10మంది ఆర్మీ జవాన్లను చంపిన వీడియో వైరల్...

డ్రైవర్ తో పాటు పదిమంది పోలీసులను చంపేసిన మావోయిస్టుల ఘాతకానికి సంబంధించిన ఓ వీడియో వెలుగు చూసింది. 

Video of Maoist attack in Dantewada goes viral - bsb
Author
First Published Apr 27, 2023, 2:39 PM IST

రాయ్‌పూర్ : ఛత్తీస్‌గఢ్‌లోని దంతేవాడలో మావోయిస్టులు జరిపిన పేలుడులో 10 మంది పోలీసు సిబ్బంది మరణించిన ఘటన కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ దాడి జరిగిన ఒక రోజు తర్వాత, పేలుడుకు సంబంధించిన ఓ వీడియో వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో ఓ డ్రైవర్ సహా పదిమంది పోలీసులు మృతి చెందారు. 

తన సహోద్యోగులను చంపిన తిరుగుబాటుదారులపై కాల్పులు జరపడానికి ముందు ఒక పోలీసు పొజిషన్‌లోకి క్రాల్ చేస్తున్నట్లు ఈ వీడియోలో చూపిస్తుంది. పేలుడు తర్వాత ఓ వాహనం కింద దాక్కున్న మరో పోలీసు చిత్రీకరించిన చిన్న వీడియో ఇది. ఇందులో పేలుడు జరిగిన ప్రదేశాన్ని చూపిస్తుంది. వీడియోలో, తుపాకీ కాల్పుల మధ్య "ఉడ్ గయా, పురా ఉడ్ గయా" - అంటున్న మాటలు వినిపిస్తాయి. అంటే వాహనంలోని అందరూ పోయారు అంటూ చెబుతున్నాడు. 

ఈ వీడియోలో... పేలుడు ధాటికి ఏర్పడిన సుమారు 10 అడుగుల లోతులో ఉన్న గొయ్యి అంచులను కూడా కనిపిస్తున్నాయి. క్లిప్ చివరిలో, తుపాకీ శబ్దాలు వినబడతాయి. ఈ వీడియో చిత్రీకరించిన పోలీసు సిబ్బంది మీడియాతో మాట్లాడుతూ.. మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్ కోసం మంగళవారం నుంచి పనిచేస్తున్నాం. బుధవారం మధ్యాహ్నం తిరిగి వస్తుండగా మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో పేలుడు సంభవించింది. లక్ష్యంగా చేసుకున్న వాహనానికి మా వాహనం 100నుంచి 150 మీటర్ల దూరంలో ఉంది. మా వాహనంలో ఏడుగురం ఉన్నాం. పేలుడు జరిగిన వాహనంలో ఎవ్వరూ ప్రాణాలతో మిగలలేదు. అందరూ చనిపోయారు" అని ఫోన్‌లో చెప్పాడు.

కాన్వాయ్ లో ఏడు వాహనాలు ఉన్నాయి. వీటిలో మొత్తం 70మంది సిబ్బంది ఉన్నారు. భద్రతా అధికారుల ప్రకారం, ఇటువంటి దాడులకు వెళ్లినప్పుడు భారీ ప్రాణనష్టాన్ని నివారించడానికి సున్నితమైన ప్రాంతాలలో భద్రతా కాన్వాయ్‌లలోని వాహనాల మధ్య దూరాన్ని పాటిస్తారని తెలుస్తోంది.  పేలుడు జరిగిన తర్వాత.. "మేము వారి వైపు కాల్పులు జరిపినప్పుడు, వారి వైపు నుండి ఒకటి లేదా రెండు రౌండ్లు కాల్పులు జరిగాయి. ఆపై కాల్పులు ఆగిపోయాయి" అని పోలీసులు తెలిపారు.

ఐఈడీ వల్ల సంభవించిన పేలుడులో 10 మంది జిల్లా రిజర్వ్ గార్డ్ సిబ్బంది, ఒక డ్రైవర్ మరణించారు. జిల్లా రిజర్వ్ గార్డ్‌లో మావోయిస్టులను ఎదుర్కోవడానికి శిక్షణ పొందిన స్థానిక గిరిజన పురుషులు ఉంటారు. వాహనం, మినీ గూడ్స్ వ్యాన్, సెక్యూరిటీ సిబ్బంది అద్దెకు తీసుకున్నారు. రాష్ట్ర రాజధాని రాయ్‌పూర్‌కు 450 కిలోమీటర్ల దూరంలో జరిగిన ఈ పేలుడు గత రెండేళ్లలో ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన అతిపెద్ద మావోయిస్టుల దాడి.

మావోయిస్టులపై పోరాటం చివరి దశలో ఉందని, తిరుగుబాటుదారులను విడిచిపెట్టబోమని ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ అన్నారు. పోలీసుల త్యాగం వృథా కాదంటూ సంతాపం వ్యక్తం చేశారు. "ఇందులో పాల్గొన్న నక్సల్స్‌పై చర్యలు తీసుకోబడతాయి. లొంగిపోవాలనుకునే వారు లొంగిపోవాలి. మా జవాన్లు నిరంతరం నక్సల్స్‌తో పోరాడుతున్నారు" అని బఘేల్  చెప్పారు.

కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ దాడిని "పిరికిపంద" చర్యగా అభివర్ణించారు. రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని విధాలుగా సహాయం చేస్తామని హామీ ఇచ్చారు. "దంతెవాడలో ఛత్తీస్‌గఢ్ పోలీసులపై జరిగిన పిరికిపంద దాడికి వేదన చెందాను. ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రితో మాట్లాడి రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని విధాలా సాయం అందిస్తానని హామీ ఇచ్చాను. వీరమరణం పొందిన జవాన్ల కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి" అని ట్వీట్ చేశారు.
 

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios