అయోధ్యలో  రామ మందిర నిర్మాణం కోరుతూ  విహెచ్‌పీ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్మసభకు భారీగా  హిందూ ధార్మిక సంస్థలు హాజరయ్యాయి


న్యూఢిల్లీ: అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోరుతూ విహెచ్‌పీ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్మసభకు భారీగా హిందూ ధార్మిక సంస్థలు హాజరయ్యాయి.
ఆదివారం నాడు న్యూఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో వీహెచ్ ‌పీ ఈ సదస్సును నిర్వహించింది.

పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో అయోధ్యలో రామ మందిర నిర్మాణాన్ని చేపట్టాలని వీహెచ్‌పీ డిమాండ్ చేస్తోంది. పార్లమెంటులో బిల్లు ప్రవేశపెడితే రామ మందిర నిర్మాణం గురించి ఇక ఏ శక్తులూ అడ్డుకోలేవని తెలియచెప్పేందుకే ఈ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు వీహెచ్‌పీ జనరల్‌ సెక్రటరీ సురేంద్ర జైన్‌ వివరించారు.

అలహాబాద్‌లో రెండు రోజుల పాటు తర్వాత సభను నిర్వహిస్తామని వీహెచ్ పీ ప్రకటించింది. వచ్చే ఏడాది జనవరి 31 వ తేదీన రెండు రోజుల పాటు ఈ సమావేశాలు నిర్వహించనున్నట్టు వీహెచ్‌పీ తెలిపింది.

రామ మందిర నిర్మాణానికి సంబంధించిన కేసు సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉంది. వచ్చే ఏడాది జనవరిలో దీని విచారణకు సంబంధించి షెడ్యూల్‌ను ఖరారు చేసే అవకాశాలున్నాయి. ఈ వ్యవహారం 25 ఏళ్ల నుంచి కోర్టులోనే ఉండడంతో.. రామ మందిర నిర్మాణం చేపట్టేందుకు ముందుకెళ్లాల్సిందేనని హిందుత్వ సంస్థలు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నాయి.