రోడ్డు ప్రమాదం.. సీనియర్ థియేటర్ ఆర్టిస్ట్ బెళగల్లు వీరన్న దుర్మరణం..
సీనియర్ థియేటర్ ఆర్టిస్ట్, తోలుబొమ్మలాట కళాకారుడు నాడోజ బెళగల్లు వీరన్న రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు.
సీనియర్ థియేటర్ ఆర్టిస్ట్, తోలుబొమ్మలాట కళాకారుడు నాడోజ బెళగల్లు వీరన్న రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లా చల్లకెరె సమీపంలో ఆదివారం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వివరాలు.. బెళగల్లు వీరన్న ఆదివారం తన కుమారుడు హనుమంత్తో కలిసి బెంగళూరు బయలుదేరారు. అయితే వీరు ప్రయాణిస్తున్న కారు చిత్రదుర్గ జిల్లా చల్లకెరె సమీపంలో లారీని ఢికొట్టింది. ఆ తర్వాత కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బెళగల్లు వీరన్న, ఆయన కుమారుడు హనుమంత్ తీవ్రంగా గాయపడ్డారు. అయితే వీరన్నను చల్లకెరె ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లుగా వైద్యులు ప్రకటించారు.
వీరన్న కుమారుడు హనుమంత్ వీరన్నకు తీవ్ర గాయాలు కాగా పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. చల్లకెరె ప్రభుత్వ ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు.
ఇక, బళ్లారిలోని జానపద కళాకారుల కుటుంబంలో జన్మించిన వీరన్న తన తండ్రితో కలిసి వృత్తిపరమైన నాటకరంగంలో ప్రత్యక్ష ప్రదర్శనలు ఇచ్చారు. ఆయన రామాయణం, మహాభారతం, జానపద కథల నుంచి కథలను చెప్పడానికి తోలు, చెక్క బొమ్మలను ఉపయోగించే జానపద కళారూపమైన తోలుబొమ్మలాట కుటుంబ సంప్రదాయాన్ని కొనసాగించారు. చాలా నిర్లక్ష్యం చేయబడిన జానపద కళకు వీరన్న కొత్త టచ్ ఇచ్చారు.
వీరన్న.. ఎన్నో ప్రతిష్టాత్మక రాష్ట్ర, జాతీయ అవార్డులు అందుకున్నారు. రాజ్యోత్సవ ప్రశస్తి, కర్ణాటక నాటక అకాడమీ అవార్డు, జనపద, యక్షగాన అకాడమీ అవార్డు, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం నుంచి జానపద శ్రీ అవార్డు అందుకున్నారు. భారత ప్రభుత్వంచే 2011 సంవత్సరానికి గాను ఆయనకు కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు లభించింది. 2013లో కర్ణాటకలోని హంపి కన్నడ విశ్వవిద్యాలయం నుంచి ‘నాడోజ’ గౌరవ డాక్టరేట్ను అందుకున్నారు.