కూరగాయల మార్కెట్లో విజృంభించిన కరోనా... 18మందికి పాజిటివ్
అయితే వీరిదగ్గర కూరగాయలు కొనేందుకు వచ్చనవారు ఎంతమంది ఉంటారు? వారు ఎవరనేది అధికారులకు అంతుచిక్కని ప్రశ్నగా మారింది.
కరోనా వైరస్ రోజు రోజుకీ విజృంభిస్తోంది. ఇంట్లో నుంచి బయటకు అడుగుపెడితే చాలు.. వైరస్ ఎలా సోకుతుందో అర్థం కావడం లేదు. రాజస్థాన్ రాష్ట్రంలోనూ దీని బీభత్సం కొనసాగుతోంది. దౌసాలోని సబ్జీ మండిలో కూరగాయలు విక్రయించే 18 మంది కరోనా పాజిటివ్గా తేలారు. దీంతో అధికారుల్లో ఆందోళన మరింతగా పెరిగిపోయింది.
18 మంది కూరగాయల విక్రేతలకు కరోనా సోకిన నేపధ్యంలోవారి కుటుంబాలతో పాటు వారి పరిచయస్తుల జాబితాను అధికారులు సేకరించారు. వీరందరికీ కరోనా వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. అయితే వీరిదగ్గర కూరగాయలు కొనేందుకు వచ్చనవారు ఎంతమంది ఉంటారు? వారు ఎవరనేది అధికారులకు అంతుచిక్కని ప్రశ్నగా మారింది.
కూరగాయల వ్యాపారులకు కరోనా సోకిందని తెలుసుకున్న స్థానికులు ఆందోళనకు లోనవుతున్నారు. దౌసాలో కొత్తగా 20 కరోనా కేసులు నమోదవడంతో, మొత్తం రోగుల సంఖ్య 261కు చేరుకుంది. కరోనా బాధితుల్లో 219 మంది రోగులు కోలుకున్నారు. కరోనా వైరస్ను నివారించడానికి ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను ప్రజలంతా పాటించాల్సిన అవసరం ఉందని చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పిఎం వర్మ తెలిపారు.