UPSC: యూపీఎస్సీ ఫలితాల్లో జామియా ఆర్సీఏ హవా.. 23 మంది సెలక్ట్.. వారిలో 12 మంది బాలికలు
UPSC’s Civil Services Exam 2022: జామియా మిలియా ఇస్లామియా (జేఎంఐ) రెసిడెన్షియల్ కోచింగ్ అకాడమీ (ఆర్సీఏ)లో కోచింగ్, శిక్షణ పొందిన 23 మంది అభ్యర్థులు యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ 2022కు ఎంపికయ్యారు. మొత్తం 933 మంది అభ్యర్థులను వివిధ సర్వీసుల్లో నియామకాలకు సిఫారసు చేశారు. వీరిలో జమియా ఆర్సీఏకు చెందిన వారు 23 మంది అభ్యర్థులు కాగా, వీరిలో జమ్మూకాశ్మీర్ కు చెందిన ఇద్దరు, ఒక మహిళ సహా నలుగురు టాప్ 100 జాబితాలో వివిధ ర్యాంకులు, స్థానాలను దక్కించుకున్నారు.
Jamia Millia Islamia RCA : జామియా మిలియా ఇస్లామియా (జేఎంఐ) రెసిడెన్షియల్ కోచింగ్ అకాడమీ (ఆర్సీఏ)లో కోచింగ్, శిక్షణ పొందిన 23 మంది అభ్యర్థులు యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ 2022కు ఎంపికయ్యారు. ఎంపికైన 23 మంది అభ్యర్థుల్లో కొందరికి ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, ఇండియన్ పోలీస్ సర్వీస్, మిగిలిన అభ్యర్థులకు వారి ర్యాంకులు, ఎంపికలను బట్టి ఐఆర్ఎస్, ఆడిట్ అండ్ అకౌంట్ సర్వీస్, ఐఆర్టీఎస్, గ్రూప్-ఏలోని ఇతర అనుబంధ సేవలు లభించే అవకాశం ఉంది. 35వ ర్యాంకు సాధించిన అజ్మీరా సంకేత్ కుమార్ ఈ ఏడాది ఆర్సీఏలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన అభ్యర్థిగా నిలిచారు. ఎంపికైన 23 మందిలో 12 మంది బాలికలు వుండటం విశేషం.
జేఎంఐ వైస్ చాన్స్ లర్ ప్రొఫెసర్ నజ్మా అక్తర్ మాట్లాడుతూ.. సివిల్ సర్వీసెస్ పరీక్షల కోసం విద్యార్థులకు శిక్షణ ఇవ్వడంలో జామియా ఆర్ సీఏ నిలకడైన పనితీరు కనబరచడం వర్సిటీకి గర్వకారణమని అన్నారు. రాబోయే సంవత్సరాల్లో మెరుగైన ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నామని తెలిపారు. ఈ నేపథ్యంలోనే జామియా ఆర్సీఏను సందర్శించి యూపీఎస్సీ ఫలితాల్లో సత్తాచాటిన విద్యార్థులను అభినందించారు. ప్రొఫెసర్ అక్తర్ వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తూ, మార్గనిర్దేశం చేస్తూ, ఆర్సీఏకు అన్ని విధాలా సహకరిస్తున్నారని తెలిపారు. విజయం సాధించిన విద్యార్థులు, వారి కుటుంబ సభ్యులను అభినందించారు. ఆర్ సీఏ ఇన్ చార్జి ప్రొఫెసర్ అబిద్ హలీం.. జామియా ఆర్సీఏ కోసం అంకితభావంతో పనిచేస్తూ అందిస్తున్న సేవలను కొనియాడారు.
ఇటీవల ఆవాజ్ ది వాయిస్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రొఫెసర్ అక్తర్ మాట్లాడుతూ.. గత ఏడాది యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్షలో టాపర్ గా నిలిచిన శ్రుతి శర్మ.. ఆర్సీఏ-జేఎంఐ నుంచి నుంచి స్టార్ పెర్ఫార్మర్ అని పేర్కొన్నారు. కాగా, 2010-11 నుంచి 2023 వరకు ఆర్సీఏ 270 మందికి పైగా సివిల్ సర్వెంట్లను తయారు చేసింది. సీఏపీఎఫ్, ఐబీ, ఆర్బీఐ (గ్రేడ్బీ), ఏపీఎఫ్, బ్యాంక్ పీవో, పీసీఎస్ తదితర కేంద్ర, రాష్ట్ర సర్వీసుల్లో 300 మందికి పైగా జామియా ఆర్సీఏ విద్యార్థులు ఎంపికయ్యారు. ఎస్సీ, ఎస్టీ, మహిళలు, మైనార్టీ విద్యార్థులకు సివిల్ సర్వీసెస్, ఇతర పోటీ పరీక్షలకు ఉచిత కోచింగ్, రెసిడెన్షియల్ సౌకర్యాలు కల్పించేందుకు సెంటర్ ఫర్ కోచింగ్ అండ్ కెరీర్ ప్లానింగ్ (సీసీ అండ్ సీపీ), జేఎంఐ ఆధ్వర్యంలో యూజీసీ 2010లో ఆర్సీఏను ఏర్పాటు చేసింది. ఆలిండియా రాతపరీక్ష, ఆ తర్వాత వ్యక్తిగత ఇంటర్వ్యూల ద్వారా సమగ్ర కోచింగ్ కు విద్యార్థులను ఎంపిక చేస్తారు.
జామియా ఆర్సీఏ చక్కటి నిర్మాణాత్మక బహుముఖ కోచింగ్-వ్యక్తిత్వ వికాస కార్యక్రమాన్ని అందిస్తుంది. ఇందులో ప్రిలిమ్స్, మెయిన్, ఇంటర్వ్యూతో 500 గంటలకు పైగా తరగతులు, ప్రముఖ పండితులు, సీనియర్ సివిల్ సర్వెంట్ల ప్రత్యేక ఉపన్యాసాలు, గ్రూప్ డిస్కషన్లు, టెస్ట్ సిరీస్లు, మాక్ ఇంటర్వ్యూలు ఉంటాయి. అకాడమీ 24×7 ఎయిర్ కండిషన్డ్ లైబ్రరీ, ఉచిత వైఫైని అందిస్తుంది. అకాడమీ సురక్షితమైన-సౌకర్యవంతమైన హాస్టల్ సౌకర్యాలను కూడా అందిస్తుంది.