సొరంగంలో చిక్కుకొన్న 12 మంది కార్మికులు: ఫోన్ కాల్ కాపాడింది
సొరంగంలో చిక్కుకొన్న కార్మికులను ఒక్క ఫోన్ కాల్ ద్వారా రక్షించారు. ఉత్తరాఖండ్ లో ఆదివారం నాడు అలకానంద, ధౌనిగంగా నదులకు మెరుపు వరదలు వచ్చాయి.
డెహ్రాడూన్: సొరంగంలో చిక్కుకొన్న కార్మికులను ఒక్క ఫోన్ కాల్ ద్వారా రక్షించారు. ఉత్తరాఖండ్ లో ఆదివారం నాడు అలకానంద, ధౌనిగంగా నదులకు మెరుపు వరదలు వచ్చాయి.
ఎన్టీపీసీ పవర్ ప్లాంట్ వద్ద సొరంగంలో వందల సంఖ్యలో కార్మికులు పనిచేస్తున్నారు. ఈ నదులకు భారీ ఎత్తున వరదలు వచ్చాయి.ఈ విషయాన్ని గమనించిన కొందరు స్థానికులు సొరంగం నుండి బయటకు రావాలని కార్మికులను పిలిచారు.
also read:ఉత్తరాఖండ్లో వరదలు: 18 మంది మృతి, 200 ఆచూకీ గల్లంతు
అయితే కార్మికులు బయటకు వచ్చేలోపుగా బురద, నీరు వచ్చి చేరింది. దీంతో చమోలీలోని తపోవన్ సొరంగంలో చిక్కుకున్నారు.సొరంగంలో చిక్కుకొన్న ఓ కార్మికుడి ఫోన్ కు సెల్ ఫోన్ సిగ్నల్ వచ్చింది. వెంటనే ఆయన పవర్ ప్లాంట్ మేనేజర్ కు సొరంగంలో తాము చిక్కుకొన్నట్టుగా సమాచారం ఇచ్చాడు.
వెంటనే ఆయన ఐటీబీపీ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఈ సమాచారం అందుకొన్న పోలీసులు ఈ సొరంగం వద్ద సహాయక చర్యలు ప్రారంభించారు.300 మీటర్లలోతులో ఉన్న తమకు ఓ వైపు నుండి గాలి, వెలుతురు రావడంతో తమకు కొంత ధైర్యం ఇచ్చిందని ఆయన తెలిపారు. ఏడు గంటల పాటు శ్రమించి సొరంగంలో చిక్కుకొన్న కార్మికులను బయటకు వెలికి తీశారు.
సొరంగం నుండి బయటకు వచ్చిన 12 మంది కార్మికులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.