ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుంది. ఎర్లీ ట్రెండ్స్ చూస్తే.. ఉత్తరాఖండ్‌లో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతుంది. అయితే సీఎం పుష్కర్ సింగ్ ధామి మాత్రం వెనకంజలో ఉన్నారు.  

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుంది. ఎర్లీ ట్రెండ్స్ చూస్తే.. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపూర్‌లో బీజేపీ ఆధిక్యం కొనసాగిస్తుంది. పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ ఆధిక్యంలో కొనసాగుతుంది. గోవాలో ఎర్లీ ట్రెండ్స్ ప్రకారం బీజేపీ స్వల్ప ఆధిక్యంలో ఉన్నప్పటికీ.. కాంగ్రెస్, బీజేపీల మధ్య హోరా హోరి పోరు కొనసాగుతుంది. ఇక, ఉత్తరాఖండ్ విషయానికి వస్తే అక్కడ తాజా సమాచారం ప్రకారం బీజేపీ 41, కాంగ్రెస్ 24 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. 

ఉత్తరాఖండ్‌లో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతున్నప్పటికీ.. ఆ పార్టీ అభ్యర్థి, ప్రస్తుత సీఎం పుష్కర్ సింగ్ ధామి వెనకంజలో ఉన్నారు. Khatima constituency నుంచి బరిలో నిలిచిన పుష్కర్ సింగ్ ధామి ఎర్లీ ట్రెండ్స్‌లో వెనకంజలో ఉన్నారని సమాచారం. అక్కడ ప్రస్తుతం కాంగ్రెస్ అభ్యర్థి భువన్ కప్రి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అయితే ఉత్తరాఖండ్‌లో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతున్నందున.. తుది ఫలితం ఎలా ఉంటుందో వేచిచూడాల్సి ఉంది. 

ఇక, ఉత్తరాఖండ్‌ విషయానికి వస్తే.. ఫిబ్రవరి 14న ఇక్కడ ఎన్నికలు జరగ్గా.. 65.37 శాతం పోలింగ్ నమోదైంది. ఇక్కడ మొత్తం ఓటర్ల సంఖ్య 82,38,187. మొత్తం పోలింగ్ స్టేషన్ల సంఖ్య 11,647. ఉత్తరాఖండ్‌లో 70 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. వీటిలో 13 స్థానాలు షెడ్యూల్డ్ కులాలకు (ఎస్‌సి) రిజర్వ్ కాగా.. 2 సీట్లు షెడ్యూల్డ్ తెగలకు రిజర్వ్ అయ్యాయి. వివిధ పార్టీలకు చెందిన 632 మంది అభ్యర్ధులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ప్రస్తుతం పుష్కర్ సింగ్ ధామి నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది.

బీజేపీ తరపు నుంచి మంత్రులు సత్పాల్ మహరాజ్, సుబోధ్ ఉనియాల్, అరవింద్ పాండే, ధన్ సింగ్ రావత్, రేఖా ఆర్య, బీజేపీ ఉత్తరాఖండ్ రాష్ట్ర అధ్యక్షుడు మదన్ కౌశిక్ ఉన్నారు. ప్రముఖ కాంగ్రెస్ అభ్యర్థులలో మాజీ ముఖ్యమంత్రి హరీష్ రావత్, మాజీ మంత్రి యశ్పాల్ ఆర్య, కాంగ్రెస్ ఉత్తరాఖండ్ యూనిట్ అధ్యక్షుడు గణేష్ గోడియాల్, అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు ప్రీతమ్ సింగ్ ఉన్నారు. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 57, కాంగ్రెస్ 11, స్వతంత్ర అభ్యర్థులు రెండు స్థానాల్లో విజయం సాధించారు.

ప్ర‌ముఖ ద‌ళిత నేత ఆర్య‌, త‌న కుమారుడు సిట్టింగ్ ఎమ్మెల్యేతో క‌లిసి కాంగ్రెస్‌లోకి తిరిగి రావ‌డం హస్తం శ్రేణుల్లో జోష్ నింపింది. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పాల‌క బీజేపీని దీటుగా ఎదుర్కొని అధికారాన్ని చేప‌ట్టాల‌ని కాంగ్రెస్ ఉవ్విళ్లూరుతోంది. ఈసారి ఉత్తరాఖండ్ ఎన్నికల బరిలో నిలిచిన ఆమ్ ఆద్మీ పార్టీ, సమాజ్‌వాదీ పార్టీలు కూడా ముమ్మరంగానే ప్రచారం నిర్వహించాయి. గత కొన్నేళ్లుగా బీజేపీ, కాంగ్రెస్ మధ్యే ప్రధాన పోటీ వుంటోంది. ప్రజలు సైతం ప్రభుత్వాలను మారుస్తున్నారు. దీంతో బీజేపీ, కాంగ్రెస్‌లు ఐదేళ్లకొకసారి అధికారాన్ని అందుకుంటున్నాయి. ఇదే సమయంలో ఈసారి ఆప్ బరిలో నిలవడంతో ఈ రెండు పార్టీల విజయావకాశాలకు దెబ్బ కొట్టే పరిస్ధితులు కనిపిస్తున్నాయని విశ్లేషకులు అంటున్నారు.

రాష్ట్రంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, రైల్వే, రహదారుల నిర్మాణం, కేదార్‌నాథ్ ఆలయ పునర్నిర్మాణం వంటి వాటిని బీజేపీ విస్తృతంగా ప్రచారం చేసింది. అయితే నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, ముఖ్యమంత్రుల మార్పు వంటి అంశాలను అస్త్రాలుగా చేసుకుని కాంగ్రెస్ విమర్శలు చేసింది. అటు ఆప్ విషయానికి వస్తే.. 300 యూనిట్ల వరకు ఉచిత కరెంట్, 18 ఏళ్లు పైబడిన మహిళకు నెలకు రూ.1000 ఆర్ధిక సాయం, కుటుంబానికో ఉద్యోగం, రూ.5 వేల నిరుద్యోగ భృతి వంటి ప్రజాకర్షక హామీలను ప్రకటించింది.