Mulayam Singh: లైఫ్ సేవింగ్ మందులపై ములాయం సింగ్ యాదవ్.. ఆరోగ్యం మరింత విషమం
Mulayam Singh Yadav: సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) పితామహుడు, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ అక్టోబర్ 2 న ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం ఐసీయూలో ఉన్న ఆయన ఆరోగ్యం ఆందోళనకరంగానే ఉందని వైద్యులు వెల్లడించారు.
Mulayam Singh Yadav: సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపకుడు, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ పరిస్థితి ఇంకా విషమంగానే ఉందనీ, ఆయన ప్రాణాలను రక్షించే (లైఫ్ సేవింగ్) మందులను వాడుతున్నారని మేదాంత ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ఆయన గురుగ్రామ్లోని మేదాంత హాస్పిటల్లోని ఐసీయూలో సమగ్ర నిపుణుల బృందంచే చికిత్స పొందుతున్నారని ఎస్పీ వర్గాలు వెల్లడించాయి.
కాగా, ములాయం సింగ్ యాదవ్ అక్టోబర్ 2 న ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం ఐసీయూలో ఉన్న ఆయన ఆరోగ్యం ఆందోళనకరంగానే ఉందని వైద్యులు వెల్లడించారు. తన సాధారణ వైద్య పరీక్షలు కోసం ఆగస్టు 22 నుండి చికిత్స పొందుతున్నారు. ఆదివారం అకస్మాత్తుగా ఆయన ఆరోగ్యం క్షీణించడంతో మేదాంత ఆస్పత్రిలోని ఐసీయూకు తరలించారు. ప్రస్తుతం ఆయన వయస్సు 82 ఏండ్లు. ఆసుపత్రి జారీ చేసిన తాజా అధికారిక హెల్త్ బులెటిన్ ను ఎస్పీ కూడా ట్వీట్ చేసింది. “ములాయం సింగ్ యాదవ్ జీ పరిస్థితి ఇంకా విషమంగా ఉంది. ఆయన ప్రాణాలను రక్షించే మందులతో ఉన్నారు. ఆయన గురుగ్రామ్లోని మెదాంత హాస్పిటల్లోని ఐసీయూలో స్పెషలిస్ట్ డాక్టర్ల సమగ్ర బృందంచే చికిత్స పొందుతున్నారని" పేర్కొంది.
ములాయం సింగ్ యాదవ్ ఆరోగ్యం ఆందోళనకరంగా ఉండటంతో ఆస్పత్రికి పలువురు ప్రముఖ రాజకీయ నాయకులు క్యూ కట్టారు. మాజీ ముఖ్యమంత్రి, ఆయన కుమారుడు అఖిలేష్ యాదవ్ సహా ఆయన కుటుంబ సభ్యులతో సమావేశమైన నేతలు ములాయం సింగ్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ సైతం గురుగ్రామ్ మేదాంత ఆస్పత్రిని సందర్శించారు. ట్విట్టర్ వేదికగా.. "ఈ రోజు గురుగ్రామ్ లోని మేదాంత ఆసుపత్రిని సందర్శించి, ఉత్తరప్ర దేశ్ మాజీ ముఖ్య మంత్రి శ్రీ ములాయం సింగ్ యాదవ్ గారి ఆరోగ్యం, బాగోగుల గురించి వైద్యుల నుండి అడిగి తెలుసుకున్నాను. అతను వీలైనంత త్వరగా కోలుకోవాలని నేను దేవుడిని ప్రార్థిస్తున్నాను" అని ట్వీట్ చేశారు.
అంతకుముందు, హర్యానా ముఖ్యమంత్రి మనోహర్లాల్ ఖట్టర్, రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ గురుగ్రామ్లోని మేదాంత ఆసుపత్రిని సందర్శించి ములాయం సింగ్ యాదవ్ ఆరోగ్యాన్ని పరిశీలించారు. “యాదవ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ కుటుంబ సభ్యులను కలిశాను. కొంత మెరుగుదల ఉందని వైద్యులు చెబుతున్నారు, అయితే పూర్తిగా కోలుకోవడానికి సమయం పడుతుందన్నారని" ఖట్టర్ పేర్కొన్నారు. ఆసుపత్రి నుండి బయలుదేరుతున్నప్పుడు, లాలూ ప్రసాద్ యాదవ్ మాట్లాడుతూ“ఆయన పరిస్థితి మెరుగుపడుతోంది, అతని ఆరోగ్యం మెరుగుపడాలని ప్రార్థిస్తున్నాను" అని అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు కూడా ములాయం సింగ్ యాదవ్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ములాయం సింగ్ కుమారుడు సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్కు ఫోన్ చేశారు. దసరా తర్వాత ములాయం సింగ్ను కలుస్తానని తెలంగాణ సీఎం కూడా ఎస్పీ చీఫ్తో చెప్పారు.
అంతకుముందు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ) అధినేత అఖిలేష్ యాదవ్తో మాట్లాడి తన తండ్రి ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. “సమాజ్వాదీ పార్టీ నాయకుడు ములాయం సింగ్ యాదవ్ ఆరోగ్యం క్షీణించిందని సమాచారం అందుకున్న ముఖ్యమంత్రి నితీష్ కుమార్, అతని కుమారుడు, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్తో టెలిఫోన్లో మాట్లాడి ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. ములాయం సింగ్ యాదవ్ త్వరగా కోలుకోవాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు” అని బీహార్ ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. అంతకుముందు ఆదివారం, ప్రధాని నరేంద్ర మోడీ అఖిలేష్ యాదవ్తో మాట్లాడి, అతని తండ్రి ములాయం సింగ్ యాదవ్ ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు.