అలీగఢ్ ముస్లిం వర్సిటీ, మదర్సాలను పేల్చేయాలంటూ పిలుపు.. యతి నర్సింహానంద్ పై కేసు నమోదు
Aligarh: మదర్సాలు, అలీఘర్ ముస్లిం యూనివర్సిటీని కూల్చివేయాలని పిలుపునిచ్చినందుకు వివాదాస్పద బోధకుడు యతి నర్సింహానంద సరస్వతిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఇప్పటికే ఆయన పలు ద్వేషపూరిత ప్రసంగాల కేసుల్లో నిందితుడుగా ఉన్నారు.
Yati Narsinghanand Saraswati: వివాదాస్పద బోధకుడు యతి నర్సింహానంద సరస్వతి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గన్పౌడర్ ఉపయోగించి మదర్సాలను, అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయాన్ని కూల్చివేయాలంటూ పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే ఆయన పై మరో ఎఫ్ఐఆర్ నమోదైంది. ఇప్పటికే ఆయన పలు విద్వేషపూరిత ప్రసంగాల కేసుల్లో నిందితుడిగా ఉన్నారు.
వివరాల్లోకెళ్తే.. వివాదాస్పద బోధకుడు యతి నర్సింహానంద సరస్వతి ఆదివారం ఉత్తరప్రదేశ్ లోని అలీఘర్లో హిందూ మహాసభ నిర్వహించిన ఒక కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ.. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం గుర్తింపు లేని మదర్సాలపై కొనసాగుతున్న సర్వే ప్రస్తావన తీసుకువచ్చారు. గన్పౌడర్ ఉపయోగించి మదర్సాలను, అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయాన్ని కూల్చివేయాలంటూ పిలుపునిచ్చారు. ఆలాంటి సంస్థలు ఒక్కటి క కూడా ఉండకూడదని పేర్కొన్నారు. "చైనా మాదిరిగానే అన్ని మదర్సాలను గన్పౌడర్తో పేల్చివేయాలి. మదర్సాల విద్యార్థులందరినీ క్యాంపులకు పంపాలి. తద్వారా వారి మెదడుల్లోంచి ఖురాన్ అనే వైరస్ తొలగించబడాలి" అని యతి నర్సింహానంద్ సరస్వతి చెబుతున్న వీడియోలో వైరల్ అయ్యాయి.
మదర్సాల మాదిరిగానే అలీఘర్ ముస్లిం యూనివర్శిటీ (ఏఎంయూ)ని కూడా పేల్చివేయాలనీ, విద్యార్థులను నిర్బంధ కేంద్రాలకు తరలించి వారి మెదడుకు చికిత్స చేయాలని యతి నర్సింహానంద్ అన్నారు. మదర్సాలతో పాటు అలీఘర్ ముస్లిం యూనివర్సీటిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు గాంధీపార్క్ పోలీస్ స్టేషన్లో యతి నర్సింహానంద్పై కేసు నమోదు చేసినట్లు పోలీసు సూపరింటెండెంట్ కుల్దీప్ సింగ్ గుణవత్ తెలిపారు. ద్వేషపూరిత ప్రసంగాల కేసులో యతి నర్సింహానంద్పై కేసు నమోదు కావడం ఇదే మొదటిసారి కాదు. హరిద్వార్ ద్వేషపూరిత ప్రసంగం కేసులో గతేడాది అరెస్టయ్యాడు. అయితే, బెయిల్ లభించడంతో ఆయన ఆ తర్వాత విడుదల అయ్యారు.
మహాత్మా గాంధీపై కూడా..
భారత జాతిపిత మహాత్మా గాంధీపై కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు యతి నర్సింహానంద్పై ఇటీవల కేసు నమోదైంది . వైరల్ అయిన ఒక వీడియోలో, యతి నర్సింహానంద్ “కోటి మంది హిందువుల హత్యకు మహాత్మా గాంధీ కారణమని ఆరోపించడంతో పాటు పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఆరోపణలతో ఆయనపై కేసు నమోదైంది.
కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ పై విమర్శలు
అలీఘర్లో జరిగిన కార్యక్రమంలో యతి నర్సింహానంద్ రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ పై కూడా విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ చేపట్టిన భారత్ జోడో యాత్రపై మాట్లాడుతూ.. భారత్ జోడో యాత్ర ఒక జోక్ అంటూ విమర్శించారు. రాహుల్ గాంధీ జిహాదీలతో ఉన్నారనీ, ఉత్తరప్రదేశ్లో గెలవలేక కేరళ వెళ్లి వయనాడ్ నుంచి పోటీ చేశారని యతి నర్సింహానంద్ అన్నారు. "రాహుల్ గాంధీ భారతదేశాన్ని ఏకం చేయాలనుకుంటే, అతను మహాత్మా గాంధీ నిర్మించిన పాకిస్తాన్, బంగ్లాదేశ్కు వెళ్లాలి. ముందుగా పాకిస్తాన్, బంగ్లాదేశ్లను భారతదేశంతో కనెక్ట్ చేయండి. ఇలా చేయడం ద్వారా, మిగతా అందరూ అతనితో కలిసిపోతారని" అన్నారు. కాగా, యతి నర్సింహానంద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇదే మొదటి సారి కాదు. ఇప్పటికే ఆయనపై పలు కేసులు నమోదయ్యాయి.