పొగమంచు కారణంగా ట్రాక్టర్ను ఢీకొట్టిన బొలెరో.. ముగ్గురు మృతి
Hathras: ఉత్తరప్రదేశ్ లోని హత్రాస్ లో బొలెరో ట్రాక్టర్ ను ఢీకొన్న ఘటనలో ముగ్గురు మృతి చెందారు. బంకే బిహారీ ఆలయాన్ని సందర్శించి బృందావన్ నుండి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
Road Accident: ఉత్తర భారతంలోని చాలా ప్రాంతాల్లో ప్రస్తుతం ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. ఇదే సమయంలో చలి తీవ్రత పెరిగి.. పొగమంచు కారణంగా రాకపోకలకు అంతరాయం ఏర్పడటంతో పాటు పలు చోట్ల రోడ్డు ప్రమాదాలకు కారణమవుతోంది. ఈ నేపథ్యంలోనే పొగమంచు కారణంగా ఉత్తరప్రదేశ్ లో ఒక రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. పొగమంచు కారణంగా ఎదురుగా ఉన్న వాహనం కనిపించకపోవడంతో ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమిక విచారణలో వెల్లడైంది.
ఈ ప్రమాదం గురించి వివరాలు ఇలా ఉన్నాయి.. ఉత్తరప్రదేశ్లోని హత్రాస్లో ఆదివారం మారుతీ బొలెరో ట్రాక్టర్ను ఢీకొనడంతో ముగ్గురు వ్యక్తులు మరణించారు. మరో ముగ్గురు గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే చికిత్స నిమిత్తం అలీగఢ్ మెడికల్ కాలేజీకి తరలించారు. ముర్సాన్లోని హత్రాస్లోని మధుర-బరేలీ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. బాంకే బిహారీ ఆలయాన్ని దర్శించుకుని బృందావన్ నుంచి తిరిగి వస్తున్న ఆరుగురు వ్యక్తులు బొలెరోలో ఉండగా ముర్సాన్లో ట్రాక్టర్ను కారు ఢీకొట్టింది. మృతులను హర్ష్ చౌదరి (20), దీపక్ (18), కృష్ణ (22)గా గుర్తించారు.
మారుతీ బొలెరో కారు, ట్రాక్టర్ ఢీకొనడంతో ముగ్గురు మృతి చెందగా, ముగ్గురు గాయపడ్డారు. గాయపడిన వారిని అలీగఢ్ మెడికల్ కాలేజీకి తరలించారు. మృతులను గుర్తించి వారి కుటుంబాలకు సమాచారం అందించారు. పొగమంచు కారణంగా ప్రమాదం జరిగి ఉండవచ్చు" అని హత్రాస్ డీఎం అర్చనా వర్మ తెలిపారు.
హత్రాస్లో జరిగిన రోడ్డు ప్రమాదంపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించి వారికి సరైన వైద్యం అందించాలనీ, వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ జిల్లా యంత్రాంగం అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.
దీంతో పాటు ఘటనాస్థలంలో సహాయక చర్యలు చేపట్టాలని జిల్లా మేజిస్ట్రేట్, పోలీసు ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ ప్రమాదంలో గాయపడ్డవారికి మెరుగైన చికిత్స అందించడానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.