మరోసారి ఆడపిల్ల పుట్టిందనీ.. రెండు రోజుల పసికందును గొంతు నులిమి హత్య చేసిన కన్నతల్లి
మహారాష్ట్రలోని లాతూర్లో దారుణ ఘటన వెలుగుచూసింది. రెండో ప్రసవంలోనూ ఆడపిల్ల పుట్టిందని రెండు రోజుల పసిపాపను కన్నతల్లే చంపేసింది.
ఆధునిక సమాజంలో ఆడవారు అన్ని రంగాల్లో దూసుకెళ్తున్నారు. అయినా.. ఆడా మగా అనే వివక్ష నేటీకి కొనసాగుతూనే ఉంది. మారుతున్న కాలంతో పాటు ఇలాంటి భావన మన మనస్సుల నుంచి పోకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఆడపిల్ల అనగానే చాలు ఏదో వివక్ష.. ఎక్కడో ఓ చోట భారమనే ఉంది. ఇలాంటి మనసత్వం ఉన్నవారు పురిట్లోనే కాటికి పంపిస్తున్నారు. పోషించలేమనో, ఆర్థికంగా భారమని భావిస్తున్నారో తెలియడం లేదు గానీ.. ఆడపిల్లల పట్ల కర్కశంగా ప్రవర్తిస్తున్నారు.
కన్నపేగు అనే కనికరం లేకుండా దారుణంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా.. మహారాష్ట్రలోని లాతూర్లో దారుణ ఘటన వెలుగుచూసింది. రెండో ప్రసవంలోనూ ఆడపిల్ల పుట్టిందని.. నవమాసాలు మోసిన పేగు బంధాన్ని మరిచి రెండు రోజుల పసిపాపను కన్నతల్లే చంపేసింది. ఆడపిల్ల పుట్టిందని రేఖా కిసాన్ చవాన్ అనే మహిళ ఈ దారుణానికి ఒడిగట్టింది. బిడ్డను చంపేసి తర్వాత.. ఆరోగ్యం బాగాలేదంటూ ఆస్పత్రికి తీసుకెళ్లింది. వైద్య సిబ్బంది నిలదీయడంతో హత్య విషయం వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకెళ్లే.. ఉస్మానాబత్ జిల్లా హోలీకి చెందిన రేఖా కిసాన్ చవాన్ డెలివరీ కోసం కట్గావ్ తండాకు వచ్చింది. డిసెంబరు 27న ప్రసవం కోసం నైభా సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చేరిన మహిళ ఓ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది.కానీ.. రెండో ప్రసవంలో కూడా ఆడపిల్ల పుట్టిందని మనస్తాపానికి గురయ్యారు. అదే ఆవేశంతో మూడు రోజుల పసికందును గొంతు నులిమి హతమార్చింది.
పాప ఆరోగ్యం బాగాలేదంటూ ఆస్పత్రికి తీసుకెళ్లింది. వైద్య సిబ్బంది నిలదీయడంతో ఆ దారుణం వెలుగులోకి వచ్చింది. పోలీసులు జరిపిన విచారణలో పసికందును మహిళే హత్య చేసినట్లు తేలింది. దీని ప్రకారం గేట్గావ్ పోలీస్ స్టేషన్లో హత్య కేసు నమోదైంది. వారి మొదటి కుమార్తె తర్వాత, దంపతులు బిడ్డ కోసం మళ్లీ ప్రయత్నించారు. అయితే రెండోసారి కూడా ఆడపిల్ల పుట్టింది. అబ్బాయి వంశాన్ని నిలబెడుతాడు. ఆడపిల్ల భారంగా భావించినని రోజులు సమాజంలో ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉంటాయి.