ఉచితంగానే యూపీఐ పేమెంట్స్.. ప్రతి నెలా 80 లక్షల లావాదేవీలు.. : ఎన్పీసీఐ
Mumbai: డిజిటల్ లావాదేవీల్లో భారత్ ను యూపీఐ ప్రపంచంలోనే నంబర్ వన్ గా నిలిపింది. దీని సాయంతో ప్రతి నెలా 80 లక్షల లావాదేవీలు సురక్షితంగా, సులభంగా జరుగుతున్నాయని ఎన్సీసీఐ తెలిపింది.
UPI payments free of cost: యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్) డిజిటల్ లావాదేవీల రంగంలో భారత్ ను ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిపింది. యూపీఐ సహాయంతో ప్రతి నెలా 80 లక్షల లావాదేవీలు జరుగుతున్నాయని ఎన్పీసీఐ (నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) తెలిపింది. పల్లెల నుంచి పట్టణాల వరకు సామాన్య ప్రజలు సైతం ఎలాంటి ఇబ్బందులు లేకుండా యూపీఐ సాయంతో సురక్షితంగా లావాదేవీలు జరుపుతున్నారు. యూపీఐ లావాదేవీల్లో 99.9 శాతం బ్యాంకు ఖాతాలే. దీనిపై ప్రజలు ఎలాంటి ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేదు. పీపీఐలను (ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్స్) యూపీఐ ఎకోసిస్టమ్ తో అనుసంధానం చేసేందుకు ఇటీవల మార్గదర్శకాలు జారీ చేసింది. అప్పటి నుంచి పీపీఐ వాలెట్ల నుంచి కూడా యూపీఐ లావాదేవీలు చేయడం సాధ్యమైంది.
ఉచితంగానే యూపీఐ సేవలు
యూపీఐ సేవలు ఉచితంగానే లభిస్తాయనీ, కస్టమర్ల నుంచి ఎలాంటి రుసుములు వసూలు చేయడంలేదని తాజాగా ఎన్పీసీఐ పేర్కొంది. పీపీఐ మర్చంట్ లావాదేవీలకు మాత్రమే ఇంటర్ఛేంజ్ ఛార్జీలు వర్తిస్తాయి. కస్టమర్ల నుంచి ఎలాంటి రుసుము వసూలు చేయరు. యూపీఐ ఆధారిత బ్యాంకు ఖాతా నుంచి బ్యాంకు ఖాతా లావాదేవీలకు ఎలాంటి ఛార్జీలు వసూలు చేయరు. ప్రజలు యూపీఐ లావాదేవీల కోసం ఏదైనా బ్యాంక్ ఖాతా, రూపే క్రెడిట్ కార్డు, ప్రీపెయిడ్ వాలెట్లను ఎంచుకోవచ్చునని తెలిపింది.
ఎన్పీసీఐ ఏం చేస్తుంది..?
భారతదేశంలో రిటైల్ పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్స్ కోసం ఏర్పాటు చేయబడిన సంస్థనే ఎన్పీసీఐ. దీనిని 2008 లో స్థాపించారు. ఎన్పీసీఐ దేశంలో గొప్ప పేమెంట్, సెటిల్ మెంట్ మౌలిక సదుపాయాలను సృష్టించింది. రూపే కార్డు, ఐఎంపీఎస్ (ఇమ్మిడియేట్ పేమెంట్ సర్వీస్), యూపీఐ, భీమ్ (భారత్ ఇంటర్ఫేస్ ఫర్ మనీ), భీమ్ ఆధార్, ఎన్ఈటీసీ ఫాస్టాగ్, భారత్ బిల్ పే వంటి సౌకర్యాలను ఎన్పీసీఐ ప్రవేశపెట్టింది. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి రిటైల్ చెల్లింపు వ్యవస్థల్లో నూతన ఆవిష్కరణలపై ఎన్పీసీఐ దృష్టి సారించింది. దీంతో డిజిటల్ ఎకానమీ పరంగా భారత్ పెద్ద శక్తిగా అవతరించింది.