12ఏళ్ల వయసులో అత్యాచారం... 27ఏళ్ళ తర్వాత కొడుకుతో కలిసి ఫిర్యాదు
ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 27ఏళ్ళ తర్వాత ఓ మహిళ తనపై చిన్నపుడు జరిగిన అత్యాచారాన్ని బయటపెట్టింది.
లక్నో: అభం శుభం తెలియని వయసులో తనపై జరిగిన అఘాయిత్యంపై ఇప్పుడు పోలీసులను ఆశ్రయించింది ఓ మహిళ. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 27ఏళ్ళ తర్వాత బాధిత మహిళ తనపై చిన్నపుడు జరిగిన అత్యాచారాన్ని బయటపెట్టింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే... ఉత్తరప్రదేశ్ షాజహాన్ పూర్ జిల్లాలోని సదర్ ప్రాంతంలో 1994 సమయంలో ఓ బాలిక బంధువుల వద్ద వుంటూ చదువుకునేది. అయితే ఈ బాలికపై కన్నేసిన ఇద్దరు యువకులు ఇంట్లో ఒంటరిగా వున్న సమయంలో పలుమార్లు బలత్కారానికి పాల్పడ్డారు. దీంతో 12ఏళ్ల వయసులోనే ఆ బాలిక గర్భం దాల్చి మగబిడ్డకు జన్మనిచ్చింది.
read more బాలుడిపై మైనర్ బాలుర అత్యాచారం.. ఆ తర్వాత
అయితే బాలిక కుటుంబసభ్యులు గుట్టుచప్పుడు కాకుండా ఆ పసికందును పెంచుకుంటామంటే వేరేవారికి ఇచ్చేశారు. ఆ తర్వాత బాధిత యువతికి పెళ్లి చేశారు. అయితే కొద్దిరోజుల తర్వాత ఈ విషయం తెలిసి కట్టుకున్నవాడు వదిలేశాడు. ఇలా చిన్న వయసులోనే కష్టాలను ఎదురవయినా సదరు యువతి ధైర్యంగా జీవితాన్ని కొనసాగించింది.
ఈ ఘటన జరిగి 27ఏళ్లు కావస్తోంది. పెద్దవాడయిన సదరు మహిళ కొడుకు పెంచిన తల్లిదండ్రుల ద్వారా అసలు నిజం తెలుసుకుని తల్లి వద్దకు చేరుకున్నాడు. ఈ క్రమంలోనే చిన్నపుడు తనపై జరిగిన అఘాయిత్యం గురించి సదరు మహిళ కొడుకుకు తెలిపింది. దీంతో తన తండ్రి ఎవరో తెలియజెప్పేందుకు వివరాలు వెలికితీయాలంటూ సదరు యువకుడు న్యాయస్థానాన్ని, పోలీసుస్టేషన్ను ఆశ్రయించారు. కోర్టు ఆదేశాల మేరకు డీఎన్ఏ పరీక్షలు చేస్తామని పోలీసులు చెప్పారు.