UP minister Rakesh Sachan: అక్ర‌మ ఆయుధాల కేసులో దోషిగా తేలిన అనంతరం కోర్టు నుంచి పారిపోయిన ఉత్తరప్రదేశ్‌లో యోగి కేబినేట్ మంత్రి రాకేశ్‌ సచన్‌ సోమవారం స్థానిక కోర్టులో లొంగిపోయారు. ఈ క్ర‌మంలో ఆయనకు ఏడాది జైలు శిక్షతో పాటు రూ.1,500 జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది. అనంతరం రూ.50 వేల పూచీకత్తుపై రాకేశ్‌ సచన్‌ బెయిల్‌ పొందారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

UP minister Rakesh Sachan: ఉత్తరప్రదేశ్ లోని యోగి కేబినెట్ మంత్రి రాకేష్ సచన్ కు కాన్పూర్ కోర్టు శిక్ష విధించింది. 31 ఏళ్ల నాటి కేసులో ఆయ‌న‌కు ఏడాది జైలు శిక్షతో పాటు రూ.1500 జరిమానా కూడా విధించింది. తొలుత‌ ఈ కేసులో రాకేశ్‌సచన్ ను కాన్పూర్‌ కోర్టు శనివారం దోషిగా తేల్చింది. అయితే.. ఉత్తర్వుల కాపీతో రాకేశ్‌ సచన్‌ అక్కడి నుంచి ప‌రార్ అయ్యారు. మంత్రి పరారీపై కోర్టు అధికారులు పొలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో మంత్రిపై అరెస్టు వారెంట్ విడుద‌ల కావ‌డంతో ఆయ‌న సోమవారం కోర్టులో లొంగిపోయాడు. అనంత‌రం 50 వేల పూచీక‌త్తుపై కోర్టు అతనికి బెయిల్ మంజూరు చేసింది. అక్రమంగా ఆయుధాలు కలిగివున్నాడని రాకేశ్‌ సచన్‌పై 1991 లో కేసు నమోదైంది. రాకేశ్‌ సచన్‌ ప్రసుత్తం యోగి క్యాబినెట్‌లో ఎంఎస్‌ఎంఈ, ఖాదీ శాఖల మంత్రిగా ఉన్నారు.

ఆయుధ చట్టం సమస్య ఏమిటి? 

1991 ఆగస్టు 13న కాన్పూర్‌లోని నౌబస్తాలో అప్పటి ఎస్‌ఓ బ్రిజ్‌మోహన్ ఉద్నియా.. రాకేశ్ సచన్‌పై ఫిర్యాదు చేశారు. అతని వద్ద నుంచి రైఫిల్ స్వాధీనం చేసుకున్నారని, దానికి లైసెన్స్ చూపించలేకపోయారని ఆరోపించారు. అదే సమయంలో నౌబస్తాలో విద్యార్థి నాయకుడు నృపేంద్ర సచన్ హత్యలో కూడా అదే రైఫిల్‌ను ఉపయోగించడం చర్చనీయాంశమైంది.

ఈ కేసులో అందరి వాంగ్మూలం పూర్తయింది. శనివారం తీర్పు వెలువడాల్సి ఉంది. మంత్రి రాకేష్ సచన్ ఉదయమే కోర్టుకు చేరుకున్నారు. తుది వాదనలు విన్న కోర్టు ఆయుధాల చట్టం కింద రాకేష్ సచన్‌ను దోషిగా నిర్ధారించిందని ప్రాసిక్యూషన్ అధికారి రిచా గుప్తా తెలిపారు. శిక్ష అనే అంశంపై విచారణ కొనసాగుతోంది. చట్టం ప్రకారం గరిష్టంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. అదే సమయంలో, స్వాధీనం చేసుకున్న రైఫిల్ రాకేష్ తల్లితండ్రులకు చెందినదని రాకేష్ సచన్ తరపు న్యాయవాది అవినాష్ కతియార్ వాదించారు.

మంత్రిపై మరో మూడు కేసులు 

మంత్రి రాకేష్ సచన్‌పై ఆయుధ చట్టంతో పాటు, మరో మూడు కేసులు కూడా కోర్టులో పెండింగ్‌లో ఉన్నాయి. అందిన సమాచారం ప్రకారం ఈ మూడు కేసులు కూడా దాదాపు 1990-91 నాటివే. మొదటి కేసు ఐపిసిలోని సెక్షన్ 323, 353, 506కి సంబంధించినది, ఇందులో రాకేశ్ సచన్ విద్యుత్ శాఖ ఇంజనీర్‌తో విభేదించారు, ఈ కేసులో అతడు ప్రభుత్వ పనిని అడ్డుకున్నాడని ఆరోపించారు.

రెండవ కేసు పర్మత్ హిందీ భవన్‌లో విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పుడు జరిగిన వివాదానికి సంబంధించినది. మూడో కేసు కొత్వాలికి సంబంధించినది. 1992 సంవత్సరంలో నామినేషన్ సమయంలో, ఎన్నికల కమిషన్ నుండి అనుమతి తీసుకోని రాకేష్ సచన్ వద్ద ఒక ఆయుధం దొరికింది. ఈ మూడు కేసులు కోర్టులోనే పెండింగ్‌లో ఉన్నాయి.