కరోనాతో మరణించిన వ్యక్తి మృతదేహాన్ని వేల నదిలో వేసిన వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. నదిలో కోవిడ్ రోగి డెడ్బాడీ వేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
లక్నో: కరోనాతో మరణించిన వ్యక్తి మృతదేహాన్ని వేల నదిలో వేసిన వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. నదిలో కోవిడ్ రోగి డెడ్బాడీ వేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రాష్ట్రంలోని బలరాంపూర్ జిల్లాలోని రప్తి నదిపై ఉన్న బ్రిడ్జిపై ఇద్దరు వ్యక్తులు ఓ మృతదేహంతో కన్పించారు. పీపీఈ కిట్ వేసుకొన్న వ్యక్తితో పాటు మరో వ్యక్తి నదిలో డెడ్బాడీని వేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ డెడ్ బాడీని నదిలో వేస్తున్నసమయంలో అదే దారిలో కారులో వెళ్తున్న వ్యక్తులు ఈ ఫోన్ లో రికార్డు చేశారు. ఆ తర్వాత సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
సోషల్ మీడియాలో ఈ వీడియో విషయం అధికారుల దృష్టికి వచ్చింది. దీంతో ఈ విషయమై అధికారులు దర్యాప్తు చేశారు. కరోనాతో మరణించిన వ్యక్తి డెడ్ బాడీని నదిలో వేశారని గుర్తించారు. కరోనా సోకిన వ్యక్తి ఈ నెల 25న ఆసుపత్రిలో చేరాడు. మూడు రోజుల తర్వాత ఆయన మరణించాడు. డెడ్బాడీని మృతుల కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ బాడీని కుటుంబసభ్యులు నదిలో వేశారు. ఈ ఘటనపై నిందితులపై కేసు నమోదు చేశామని బలరాంపూర్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ తెలిపారు. గంగా నదితో పాటు మరో నదిలో కూడ కరోనా మృతదేహాలుగా అనుమానిస్తున్న డెడ్ బాడీలు ఇటీవల కాలంలో బయటపడ్డాయి. బీహార్, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాల్లో నదుల్లో డెడ్బాడీలు బయటపడడం కలకలం సృష్టించిన విషయం తెలిసిందే.
అయితే కరోనాతో మరణించిన వారి మృతదేహాలను నదుల్లో వేయవద్దని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు హెచ్చరించాయి. అయినా కూడ ఈ ఘటనతో మరోసారి నదుల్లో కోవిడ్ మృతదేహాలను వేస్తున్నవిషయమ మరోసారి చర్చకు తెరతీసింది. గంగా నదిలో కరోనా మృతుల శవాలను తాము తీవ్రంగా పరిగణిస్తున్నామని గతంలో కేంద్ర జల్ శక్తి మంత్రి గజేంద్ర షెకావత్ ప్రకటించారు. కరోనా ప్రోటోకాల్ ప్రకారంగా మృతదేహాలను పూడ్చిపెట్టాలని ఆయన ఆదేశించారు.
