UP election 2022: అధికార పార్టీ హామీలన్నీ అబద్దాలే..! :అఖిలేశ్ యాదవ్
UP election 2022: గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఇచ్చిన హామీలన్నీ అబద్ధాలేనని తేలాయని సమాజ్వాదీ అధినేత అఖిలేశ్ యాదవ్ ఆరోపించారు. ఈ ఎన్నికల్లో బీజేపీకి ఓటమి తప్పదని జోస్యం చెప్పారు.
UP election 2022: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు రోజురోజుకు రసవత్తరంగా మారుతున్నాయి. అధికార, ప్రతి పక్షాల మధ్య మాటల తూటాలు పేలడంతో పొలిటికల్ హీట్ మరింత పెరుగుతోంది. తాజాగా సమాజ్వాదీ పార్టీ (ఎస్పి) అధినేత అఖిలేష్ యాదవ్ అధికార భారతీయ జనతా పార్టీ (బిజెపి)పై విరుచుకుపడ్డారు. 2017 అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బీజేపీ చేసిన వాగ్దానాలూ నెరవేర్చలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పార్టీ ఇచ్చిన హామీలన్నీ అబద్ధాలేనని తేలాయని అఖిలేశ్ యాదవ్ ఆరోపించారు. ఈ సారి అధికార బీజేపీకి ఓటమి తప్పదని జోస్యం చెప్పారు.
అఖిలేశ్ యాదవ్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, “ గత ఎన్నికల సమయంలో బీజేపీ ఇచ్చిన మేనిఫెస్టోను.. ఆ పార్టీ నాయకులు ఇచ్చిన హామీలను నెరవేర్చారా? ప్రతి వాగ్దానమూ (‘జుమ్లా’) అబద్దమేనని, ఇప్పుడు కూడా తప్పడు గణాంకాలతో ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో తమ కూటమి బీజేపీని ఓడిస్తుందని అఖిలేశ్ యాదవ్ నమ్మకం వ్యక్తం చేశారు.
ఈ క్రమంలో సమాజ్ వాదీ పార్టీ హామీలను ప్రకటించారు. తాము అధికారంలోకి వస్తే ప్రజలకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తామని అఖిలేశ్ ప్రకటించారు. అలాగే వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇస్తామని, రైతుల పంటను MSPకి విక్రయించడానికి ఏర్పాట్లు చేస్తామనీ, రైతులు చెల్లింపుల కోసం వేచి ఉండాల్సిన అవసరం లేకుండా వ్యవసాయదారుల కార్పస్ ఫండ్ ఏర్పాటు చేస్తామని తెలిపారు.
సమాజ్వాదీ పెన్షన్లను తిరిగి ప్రవేశపెడతాం. గతంలో మాదిరిగానే ల్యాప్టాప్లు పంచిపెడతామని హామీలు ప్రకటించారు. ఆర్ఎల్డీ కోసం ఎన్డీఏ తలుపులు తెరిచే ఉన్నాయన్న భాజపా వ్యాఖ్యలను తిప్పికొట్టారు. పశ్చిమ యూపీలో భాజపాకు జయంత్ సింగ్ తలుపులు మూసేశారని వ్యాఖ్యానించారు. బిజెపి, రాష్ట్రీయ లోక్ దళ్ లకు మధ్య అనంతర పొత్తుకు అవకాశం లేదని యాదవ్ అన్నారు. జయంత్ సింగ్ కూడా బీజేపీ ఆహ్వానాన్ని తిరస్కరించారు. ఇతర పార్టీలకు ఆహ్వానం పలుకుతోందంటే రాష్ట్రంలో భాజపా పరిస్థితి దిగజారిందని అర్థమవుతోందని అన్నారు