జనాభా నియంత్రణ చట్టాన్ని విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్
జనాభా నియంత్రణ కోసం ఉద్దేశించిన చట్టాన్ని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్ విడుదల చేశారు. పెరుగుతున్న జనాభాతో రాష్ట్రంతో పాటు దేశాభివృద్ధికి అవరోధం ఏర్పడుతుందని యోగి ఆదిత్యనాథ్ అన్నారు.
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం చెప్పినట్లుగానే జనాభా నియంత్రణ చట్టాన్ని విడుదల చేసింది. ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా ఆదివారం రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ 2021–2030కిగానూ ఆ చట్టాన్ని విడుదల చేశారు.
ప్రస్తుతం రాష్ట్రంలో సంతాన రేటు 2.7 శాతం ఉండగా 2030 నాటికి సంతాన రేటును 1.9కి తీసుకురావాలన్న లక్ష్యాన్ని అందులో నిర్దేశించారు. 2026 నాటికి 2.1 శాతానికి తీసుకురావాలని తలపెట్టారు. పెరుగుతున్న జనాభాతో రాష్ట్రంతో పాటు దేశాభివృద్ధికి అవరోధం ఏర్పడుతుందని యోగి ఆదిత్యనాథ్ అన్నారు. పెరుగుతున్న పేదరికానికి జనాభా పెరుగుదలే కారణమని.. ప్రతి ఒక్కరూ, ప్రతి వర్గమూ కొత్త జనాభా చట్టాన్ని దృష్టిలో పెట్టుకోవాలని సీఎం సూచించారు. ఈ చట్టంపై 2018 నుంచి కసరత్తులు చేస్తున్నామని ఆదిత్యనాథ్ వివరించారు. ఇప్పటికే ఈ చట్టానికి సంబంధించిన ముసాయిదా ప్రతిని రాష్ట్ర న్యాయశాఖ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అందులో మార్పుచేర్పుల కోసం సలహాలు, సూచనలకు ఈ నెల 19 వరకు గడువిచ్చింది.
ఈ చట్టం వల్ల ఇద్దరి కన్నా ఎక్కువ మంది పిల్లల్ని కన్నవారు ప్రభుత్వ ఉద్యోగానికి అర్హత కోల్పోనున్నారు. అలాంటి తల్లితండ్రులకు ప్రభుత్వ సబ్సిడీ కూడా ఉండదు. ప్రభుత్వం చేపట్టే ఎటువంటి సంక్షేమ సౌకర్యం కూడా అందదు. ప్రభుత్వ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే వీలు ఇవ్వరు. అంతేకాదు స్థానిక ఎన్నికల్లోనూ వాళ్లు పోటీపడే ఛాన్సు లేదు.