up assembly election 2022 : కాంగ్రెస్ సీటు ఇవ్వలేదని బోరున ఏడ్చిన మహిళ.. యూపీలో ఘటన..
కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదని నామినేషన్ సెంటర్ లో ఓ మహిళ బోరున విలపించారు. ఉత్తప్రదేశ్ లో జరిగింది ఈ ఘటన. ఆమె చాలా కాలం నుంచి బులంద్ షహర్ సదర్ టికెట్ ఆశిస్తున్నా.. పార్టీ అవకాశం ఇవ్వడంతో ఆమె ఉద్వేగభరితమయ్యారు.
యూపీలో (up) అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. ఈ క్రమంలో గురువారం కాంగ్రెస్ పార్టీ (congress party) తమ అభ్యర్థుల రెండో జాబితాను విడుదల చేసింది.ఇందులో 41 మంది పేర్లు ఉండగా.. 16 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు. యూపీలో తమ పార్టీ 40 శాతం మహిళలకు సీట్లు కేటాయిస్తుందని కాంగ్రెస్ గతంలోనే ప్రకటించింది. అందులో భాగంగానే మొదటి విడతలో 16 మంది మహిళా అభ్యర్థులకు చోటు కల్పించింది.
ఈ రెండో విడత జాబితాలో విభిన్న నేపథ్యాలకు చెందిన మహిళలకు కాంగ్రెస్ అవకాశం ఇచ్చింది. ఇందులో ఉన్నావ్ అత్యాచార బాధితురాలి తల్లి, ఆశా వర్కర్ పూనమ్ పాండే (punam pande), జర్నలిస్ట్ నిదా అహ్మద్ (journlist nidha ahmad), సీఏఏ (CAA) వ్యతిరేక నిరసనల్లో ముందంజలో ఉన్న లక్నో(lacnow)కు చెందిన సామాజిక కార్యకర్త సదాఫ్ జాఫర్ (sadhaf jhafar)ఉన్నారు. అయితే ఇందులో యూపీలోని బులంద్షహర్ సదర్ సీటుపై తీవ్ర రచ్చ జరిగింది. ఈ స్థానం నుంచి పోటీ చేసేందుకు కాంగ్రెస్ కార్యకర్త అయిన గీతారాణి (geetha rani) చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నారు. కానీ బులంద్షహర్ సదర్ స్థానానికి సుశీల్ చౌదరిని కాంగ్రెస్ ఎంపిక చేయడంతో ఆమె తీవ్ర నిరాశకు గురయ్యారు.
బులంద్ షహర్ సదర్ (bulandhshar sadhar) స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసేందుకు నామినేషన్ సెంటర్ కు వచ్చిన సందర్భంలో గీతారాణి బోరున విలపించారు. కాంగ్రెస్ తనని మోసం చేసిందని ఆరోపించారు. 1990 నుంచి తన కుటుంబం కాంగ్రెస్ కోసమే పని చేస్తుందని చెప్పారు. తాను బులంద్ షహర్ స్థానం నుంచి పోటీ చేసేందుకు చాలా కాలం నుంచి సిద్ధమవుతున్నాని అన్నారు. ప్రియాంక గాంధీ సూచించిన ‘లడ్కీ హూన్, లడ్ సక్తి హూన్’ (ladki hun, lad sakti hun) నినాదంపై తాను ఆశలు పెట్టుకున్నానని చెప్పారు. కానీ కాంగ్రెస్ తనకు టికెట్ ఇవ్వలేదని వాపోయారు. తన కుటుంబ త్యాగాలను కాంగ్రెస్ గుర్తించలేదని వాపోయారు. సర్వే ఆధారంగా పార్టీ టికెట్ కేటాయించాల్సి ఉందని, కానీ ఇక్కడ అలాంటిదేమీ చేయలేదని చెప్పారు. తాను ఏపార్టీలోకి వెళ్లబోనని, సతంత్రంగా రంగంలోకి దిగుతానని రోదిస్తూ చెప్పారు.
రాజకీయాల కోసం పోలీసు ఉద్యోగాన్ని వదిలి..
గీత రాణి చాలా కాలంగా బులంద్షహర్ రాజకీయాల్లో చురుకుగా ఉంటున్నారు. అంతే కాదు రాజకీయాల కోసం పోలీసు ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలి లా చదవాలని నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం ఆమె ఎల్ఎల్బీ (llb) స్టూడెంట్. వీరి కుటుంబం మొత్తం కాంగ్రెస్ మద్దతు దారులే. అందుకే ఆమె చిన్నప్పటి నుంచి కాంగ్రెస్ లో యాక్టివ్ గా ఉన్నారు.
66 మంది మహిళల టికెట్ ఇచ్చిన కాంగ్రెస్..
యూపీ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు రెండు జాబితాలు విడుదల చేసింది. గురువారం విడుదల చేసిన రెండో జాబితాలో మొత్తం 41 మంది అభ్యర్థులు ఉంటే ఇందులో 16 మంది మహిళలు ఉన్నారు. మొదటి జాబితాలో 125 మంది అభ్యర్థులుంటే అందులో 50 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు. రెండు జాబితాలతో కలిపి ఇప్పటి వరకు కాంగ్రెస్ 66 మంది మహిళలను రంగంలోకి దింపింది.