UP Assembly Election 2022 : యాదవులు, ముస్లింల కోసమే ఎస్పీ పని చేస్తోంది - యూపీ మంత్రి సిద్ధార్థ్ నాథ్
ఉత్తర్ ప్రదేశ్ లో కేవలం ముస్లిం, యాదవుల కోసం మాత్రమే సమాజ్ వాదీ పార్టీ పని చేస్తోందని మంత్రి సిద్ధార్థ్ నాథ్ సింగ్ ఆరోపించారు. తమ స్వార్థ ప్రయోజనాల కోసం పలువురు నాయకులు బీజేపీని వీడుతున్నారని అన్నారు.
ఉత్తరప్రదేశ్ లో (uthar pradhesh) యాదవులు, ముస్లింల కోసం మాత్రమే సమాజ్ వాదీ పార్టీ (samajwadi party) పని చేస్తోందని మంత్రి సిద్ధార్థ్ నాథ్ సింగ్ (minister sidharthnadh singh) ఆరోపించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎస్పీపై తీవ్ర ఆరోపణలు చేశారు. బీజేపీ (bjp) నుంచి ఎమ్మెల్యేలు, మంత్రులు, బీజేపీని వీడటానికి గల కారణాలు చెప్పారు.
యూపీ ఎన్నికలకు ముందు కొందరు ఎమ్మెల్యేలు వారి స్వార్థ ప్రయోజనాల కోసం బీజేపీని విడిచివెళ్లిపోతున్నారని మంత్రి సిద్ధార్థ్ నాథ్ సింగ్ అన్నారు. మరి కొందరు మాత్రం తమకు నచ్చిన నియోజకవర్గం నుంచి బీజేపీ ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వదని బయపడి పార్టీని వీడుతున్నారని తెలిపారు. ఓబీసీ (obc) నేతలు వలసలు వెళ్తూ రాష్ట్రంలో ఓబీసీలు, దళితులను తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు.
ఉత్తరప్రదేశలో ఓబీసీలు, దళితుల కోసం సమాజ్వాదీ పార్టీ చేపట్టే 10 సంక్షేమ పథకాల లిస్ట్ తయారు చేయాలని ఇటీవలే బీజేపీ నుంచి ఎస్పీలోకి దూకిన ఎమ్మెల్యేలకు మంత్రి సిద్ధార్థ్ నాథ్ సింగ్ సవాల్ విసిరారు. సమాజ్ వాదీ పార్టీ కేవలం ముస్లిం, యాదవుల కోసమే పని చేస్తుందని, ఇతర ఓబీసీ వర్గాలు ఎప్పటికీ ముస్లిం, యాదవ వర్గాలతో కలవబోవని తాను చెప్పాలనుకుంటాన్నని అన్నారు.
2024 దేశ పార్లమెంట్ ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపే యూపీ అసెంబ్లీ ఎన్నికలకు ఒక నెల రోజుల ముందు రాష్ట్రంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ పరిణామాలు యాదవేతర ఓబీసీ వర్గాలు సమాజ్ వాదీ పార్టీకి ఊతం ఇచ్చేలా కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి బీజేపీ నుంచి ఇద్దరు మంత్రులు, నలుగురు ఎమ్మెల్యేలు, ఆరుగురు ఇతర నాయకులు సమాజ్ వాదీలో చేరారు. కేబినేట్ మినిస్టర్ గా ఉన్న స్వామి ప్రసాద్ మౌర్య బీజేపీని విడిచిపెట్టి ఎస్పీలో చేరుతున్నట్టు ప్రకటించిన తరువాత అధికంగా వలసలు ప్రారంభమయ్యాయి. మౌర్య రాజీనామా చేసిన గంటల తర్వాత, బ్రిజేష్ కుమార్ ప్రజాపతి, భగవతి సాగర్, వినయ్ షాక్యా కూడా పార్టీకి రాజీనామా చేశారు. ఆ తర్వాత రోషన్ లాల్ వర్మ, దారా సింగ్ చౌహాన్, ధరమ్ సింగ్ సైనీ కాషాయ పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు.
ఇదిలా ఉండగా పార్టీ నుండి ప్రముఖ ఓబీసీ నాయకుల వలసను ఎదుర్కొవడానికి, దాని ప్రభావాన్ని తగ్గించి ఓబీసీ వర్గాలకు దగ్గరయ్యేందుకు బీజేపీ ‘సమాజిక్ సమర్క్ అభియాన్’ ప్రారంభించింది. అందులో భాగంగా జనవరి 14వ తేదీ నుంచి యూపీలోని మొత్తం 403 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఇందులో ఏడేళ్లలో కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఓబీసీ కోసం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను, పథకాలను ప్రజలకు తెలియజేస్తారు.
ఇటీవల కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రకటించిన ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యుల్ లో భాగంగా యూపీలో కూడా ఎన్నికలు జరగనున్నాయి. దేశంలోనే అత్యధిక అసెంబ్లీ స్థానాలు ఉన్నయూపీలో ఫిబ్రవరి 10వ తేది నుంచి ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం ఏడుదశల్లో ఈ ఎన్నికలు జరుగుతాయి. మార్చి 10వ తేదీన ఓట్లు లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు