Unnao murder: ఉత్తరప్రదేశ్ రోజురోజుకు మహిళలపై నేరాలు పెరుగుతున్నాయనీ, ఈ క్రమంలో యోగి ఆదిత్యానత్ నేతృత్వంలోని బీజేపీ సర్కారు తప్పుడు వాగ్దానాలు చేస్తున్నదని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ విమర్శించారు. ఉన్నావో దళిత మహిళ కేసులో ముందుగానే ఎందుకు చర్యలు తీసుకోలేదు.. ఇకనైన మీ ఉచిత వాగ్దానాలు ఆపండి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Unnao murder: ఉత్తరప్రదేశ్లోని ఉన్నావ్లో దళిత మహిళ మిస్సింగ్.. ఆపై మృత దేహం లభ్యమైన అంశం రాష్ట్రంలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికార బీజేపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ కేసులో ముందుగానే ఎందుకు చర్యలు తీసుకోలేదని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ ను ప్రశ్నించారు. "మహిళల రక్షణలో రాజకీయాలు చేస్తున్న బీజేపీ ముందుగానే దళిత మహిళ మిస్సింగ్ కేసు విషయంలో చర్యలు ఎందుకు తీసుకోలేదు. మీ పాలనలో న్యాయం కోసం మహిళలు పోరాడవలసి వస్తోంది. వారిని హింసించి, చంపినపుడు, వారి మాటలను ఎవరూ వినడం లేదు. ఉన్నావ్లో ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం ఉత్తరప్రదేశ్కు కొత్త కాదు. ఎందుకు ముందుగానే దళిత మహిళ తల్లి ఆవేదనను వినలేదు. దీనికి యోగి సర్కారు సమాధానం చెప్పి తీరాలి" అంటూ ప్రియాంక గాంధీ ట్వీట్ చేశారు.
అలాగే, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్పై తీవ్ర విమర్శలతో విరుచుకుపడిన ప్రియాంక గాంధీ.. “యోగీ జీ, మీరు మీ ప్రసంగాలలో శాంతిభద్రతల గురించి మాట్లాడటం మానేయండి, మీ పరిపాలనలో, మహిళలు న్యాయం కోసం పోరాడవలసి వస్తుంది. హింసించబడి చంపబడినప్పుడు ఎవరూ మాట వినరు. మహిళలను హింసిస్తున్నారు, ఈ సమయంలో మీరు మీ తప్పుడు వాగ్దానాలు చేయడంలో బిజీగా ఉన్నారు" అని ప్రియాంక పేర్కొన్నారు.
కాగా, రెండు నెలల క్రితం ఉన్నావోలో 22 సంవత్సరాల ఓ దళిత యువతి కనిపించకుండా పోయింది. అయితే, తమ కుమార్తెను సమాజ్ వాదీ నేత, మాజీ మంత్రి ఫతే బహదూర్ సింగ్ కుమారుడు రాజోల్ సింగ్ కు బలవంతంగా తీసుకెళ్లాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ క్రమంలోనే పోలీసులు నిందితుడికి చెందిన ఆశ్రమం సమీపంలోని కనిపించకుండా పోయిన యువతి మృత దేహాన్ని వెలికితీశారు. యువతి మృత దేహాన్ని పాతిపెట్టిన స్థలం నిందితుడికి చెందినదని సమాచారం. దీనిపై పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు కొనసాగిస్తున్నారు. భూమిలో పాతిపెట్టిన యువతి మృత దేహాన్ని బయటకు తీసిన పోలీసులు.. పోస్టుమార్టం కోసం పంపారు.
కాగా, దళిత యువతి కనిపించకుండా పోయిన ఘటనకు సంబంధించి దర్యాప్తు విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మొదటి నుంచి ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా కావాలనే స్థానిక పోలీసులు మిస్సింగ్ కేసు దర్యాప్తును ముందుకు సాగించకుండా.. నిందితులకు సహకరిస్తున్నారని బాధిత కుటుంబం ఆరోపిస్తున్నది. ఈ క్రమంలోనే విచారణలో అలసత్వం వహించినందుకు ఆ ప్రాంతానికి చెందిన స్టేషన్ హౌస్ ఆఫీసర్ (SHO)ను ఉన్నతాధికారులు సస్పెండ్ కూడా చేశారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాలు ఇలా ఉన్నాయి.. కనిపించకుండా పోయిన దళిత యువతిని కిడ్నాప్ చేశారన్న ఆరోపణలపై సమాజ్ వాదీ పార్టీ నేత, మాజీ మంత్రి ఫతే బహదూర్ సింగ్ కుమారుడు రాజోల్ సింగ్ను జనవరి 24న పోలీసులు అరెస్టు చేశారు.
ఉన్నావ్లోని అదనపు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శశి శేఖర్ సింగ్ మాట్లాడుతూ.. "డిసెంబర్ 8న, యువతి మిస్సింగ్ ఫిర్యాదు నమోదైంది. ఆ తర్వాత నిబంధనల ప్రకారం జనవరి 10న ఎఫ్ఐఆర్ నమోదుచేశాం. దర్యాప్తులో భాగంగా నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒకరిని అరెస్టు చేశాము. ఈ కేసుకు సంబంధించిన దర్యాప్తు పురోగతిలో ఉంది. దీని ఆధారంగా దర్యాప్తు ఫలితాలు, మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నాము. మేము పోస్ట్మార్టం కోసం మృత దేహాన్ని పంపాము. రిపోర్టు వచ్చిన తర్వాత మరింత లోతుగా విచారణ జరిపి.. తదనుగుణంగా తదుపరి చర్యలు తీసుకుంటాము" అని వెల్లడించారు.
