పెళ్లికాని ఆడ, మగ ఒకే గదిలో ఉంటే తప్పేమి కాదు.. హైకోర్టు తీర్పు
శరవణబాబుకు మహిళా కానిస్టేబుల్కు అక్రమ సంబంధం ఉన్నట్టు పరిగణించి ఆయనను డిస్మిస్ చేశారు. ఈ ఉత్తర్వును సవాలు చేస్తూ శరవణబాబు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
పెళ్లికాని ఆడ, మగ ఒకే గదిలో గడియపెట్టుకొని ఉన్నా తప్పేమి కాదని మద్రాసు హైకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పు పలువురిని విస్మయానికి గురిచేసింది. చెన్నైలో 1998లో సాయుధదళంలో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న శరవణబాబు ఇంటిలో అదే ప్రాంతానికి చెందిన మహిళా కానిస్టేబుల్ ఉన్నప్పుడు స్థానికులు ఆ ఇరువురూ ఏదో తప్పిదాలకు పాల్పడుతున్నారనే అనుమానంతో ఇంటికి తాళం వేశారు.
ఆ తర్వాత ఆ విషయాన్ని పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న పోలీసు అధికారులు అక్కడికి వెళ్లి ఇంటి తలుపు తాళాలు తీసి లోపలికి వెళ్లి పరిశీలించినప్పుడు శరవణబాబు, మహిళా కానిస్టేబుల్ ఉన్నారు.
ఈ సంఘటనపై విచారణ జరిపిన మీదట శరవణబాబుకు మహిళా కానిస్టేబుల్కు అక్రమ సంబంధం ఉన్నట్టు పరిగణించి ఆయనను డిస్మిస్ చేశారు. ఈ ఉత్తర్వును సవాలు చేస్తూ శరవణబాబు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్పై 23 ఏళ్ల పాటు విచారణ జరిగింది. హైకోర్టు న్యాయమూర్తి సురే్షకుమార్ ఇరుపక్షాల వాదప్రతివాదనల తర్వాత శుక్రవారం తీర్పు వెలువరించారు.
మహిళా కానిస్టేబుల్ తప్పుచేయాలనే ఉద్దేశంతో కానిస్టేబుల్ శరవణబాబు ఇంటి లోపలకు వెళ్ళినట్టు ఎలాంటి సాక్ష్యాధారాలు లేవంటూ... అవివాహితులైన ఆడ, మగ ఓ గదిలో ఉంటే తప్పిదంగా భావించే అవకాశం లేదని చెప్పారు. డిస్మిస్ చేసిన శరవణబాబును మళ్లి విధులలోకి తీసుకోవాలని ఉత్తర్వు జారీ చేశారు. తాళం వేసిన గదిలో ఓ ఆడ, మగ ఉంటే ఆ చోట వ్యభిచారం జరిగినట్లు భావించలేమని, సమాజంలో పలు అభిప్రాయాలు ఉన్నంతమాత్రాన వాటి ఆధారంగా క్రమశిక్షణా రాహిత్య చర్యలు తీసుకోవడమో, శిక్షించడమో భావ్యం కాదని న్యాయమూర్తి ఆ సందర్భంగా పేర్కొన్నారు.