అస్సాంలోని యూనివర్సిటీలో ర్యాంగింగ్.. జూనియర్ కు 80 చెంపదెబ్బలు.. రెండో అంతస్తు నుంచి దూకి...
అస్సాంలోని ఓ యూనివర్సిటీ విద్యార్థులు పైశాచికంగా వ్యవహరించారు. ర్యాగింగ్ పేరుతో ఓ విద్యార్థిని 80 చెంపదెబ్బలు కొట్టారు. దీంతో అతను బిల్డింగ్ మీదినుంచి కిందికి దూకాడు.

అస్సాం : ర్యాగింగ్ పైశాచిక క్రీడ అని.. దానికి దూరంగా ఉండాలని విద్యార్థులకు ఎంతగా చెప్పినా.. అక్కడక్కడా అది జడలు విప్పుతూనే ఉంది. తాజాగా గా అస్సాం లోని డిబ్రూగఢ్ యూనివర్సిటీలో జరిగిన ర్యాగింగ్ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. సీనియర్లు ర్యాగింగ్ పేరుతో పెడుతున్న టార్చర్ భరించలేక.. ఓ విద్యార్థి నిస్సహాయ పరిస్థితుల్లో దారుణమైన ఘటనకు తెగించాడు. బ్యాగ్ ను తప్పించుకునే క్రమంలో రెండో అంతస్తు మీది నుంచి దూకేసాడు. దీంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. ఇది గమనించిన సిబ్బంది, మిగతా విద్యార్థులు వెంటనే అతడిని ఆసుపత్రికి తీసుకువెళ్లారు.
గాయపడిన విద్యార్థిని ఆనంద్ శర్మ గుర్తించారు. శివసాగర్ జిల్లా అమ్గూరి వాసి అని తేలింది. ఆనంద్ శర్మ డిబ్రూగఢ్ యూనివర్సిటీలో ఎంకాం ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. గత వారం రోజులుగా సీనియర్లు ర్యాగింగ్ పేరుతో తన కొడుకును వేధిస్తున్నారని ఆనంద్ శర్మ తల్లి చెప్పుకొచ్చింది. ఈ క్రమంలోనే శనివారం రాత్రి కూడా వారంతా కలిసి తన కొడుకును 80 చెంపదెబ్బలు కొట్టారని తెలిపింది. చంప దెబ్బలతో ఆగకుండా బాటిల్స్, కర్రలతో కొడుతూ టార్చర్ చేశారని చెప్పింది. దాన్ని తన కొడుకు భరించలేకపోయాడు.. దాని నుండి తప్పించుకోవడానికి బిల్డింగ్ మీద నుంచి దూకే అని.. ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.
అయితే ఈ విషయం తమకు ముందే తెలిసి హాస్టల్ వార్డెన్ కి ఫిర్యాదు చేశామని.. అయితే ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదని.. అప్పుడే పట్టించుకుంటే ఇంత పరిస్థితి రాకపోయేది అని ఆనందశర్మ తల్లి ఆవేదన వ్యక్తం చేసింది. ఈ ఘటన మీద విచారణ చేపట్టారు. ఈ మేరకు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ జితెన్ హజారికా తెలిపారు. ఈ దారుణానికి కారణమైన వారి మీద కఠిన చర్యలు తీసుకుంటామని తల్లిదండ్రులకు హామీ ఇచ్చారు.
ఎరక్కపోయి ఇరుక్కుపోయాడు.. రాత్రంత ఉక్కిరిబిక్కిరి.. తెల్లవారే సరికి ..
ఇదిలా ఉండగా, నవంబర్ 18న ఇలాంటి ఘటనే ఒడిశాలోని బరంపురంలో వెలుగులోకి వచ్చింది. ర్యాంగింగ్ వికృతక్రీడను బ్యాన్ చేసినప్పటికీ.. కొన్ని కాలేజీల్లో ఇప్పటికీ కొనసాగుతోంది. దీని బారిన పడిన విద్యార్థులు, శారీరకంగా, మానసికంగా ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి ఓ దారుణమైన ఘటన ఒడిశాలో వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే పలువురు విద్యార్థులు ర్యాగింగ్కు బానిసలైన సంగతి తెలిసిందే. ఇటీవల ర్యాగింగ్లో భాగంగా కొందరు విద్యార్థులు హింసకు పాల్పడ్డారు. ఓ విద్యార్థిని పట్ల అనుచితంగా ప్రవర్తించాడు. ఈ షాకింగ్ ఘటన ఒడిశాలో చోటుచేసుకుంది.
ర్యాగింగ్కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.వివరాల ప్రకారం.. బరంపురం నగరంలోని సుకుంద ప్రాంతంలోని బినాయక్ ఆచార్య డిగ్రీ కళాశాలలో జరిగిన ర్యాగింగ్ ఘటనకు సంబంధించి ఐదుగురు విద్యార్థులను అరెస్టు చేసినట్లు బరంపురం ఎస్పీ శరవణ్ వివేక్ వెల్లడించారు. బుధవారం ఓ కాలేజీ విద్యార్థిని ర్యాగింగ్కు పాల్పడిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. విషయం తెలుసుకున్న ఎస్పీ వెంటనే విచారణ చేయాలని పెద్దబజార్ పోలీసులను ఆదేశించారు.
ఈ మేరకు కళాశాలలో ఐఐసీ అధికారి భూపతి మహంతి, సిబ్బంది విచారణ చేపట్టారు. ఐదుగురు విద్యార్థులను నిందితులుగా గుర్తించి అరెస్టు చేశారు. వీరిలో అభిషేక్ నాయక్, బాబులా పాండాతోపాటు డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న మరో ముగ్గురు మైనర్లు కూడా ఉన్నారని ఐఐసీ వివరించింది.