కర్ణాటకకు కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, ధర్మేంద్ర ప్రధాన్: కొత్త సీఎం ఎంపికకు ఎమ్మెల్యేలతో భేటీ
కర్ణాటక కొత్త సీఎం ఎంపిక కోసం ధర్మేంద్ర ప్రధాన్, కిషన్ రెడ్డి లు మంగళవారం నాడు బెంగుళూరుకు చేరుకోనున్నారు. బీజేపీ ఎమ్మెల్యేలతో కేంద్ర మంత్రులు సమావేశం కానున్నారు. కొత్త సీఎం ఎంపిక విషయమై పార్టీ ఎమ్మెల్యేలతో చర్చించనున్నారు. యడియూరప్ప రాజీనామాతో పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించనున్నారు పరిశీలకులు
బెంగుళూరు: కర్ణాటక కొత్త సీఎం ఎంపిక కోసం బీజేపీ అధినాయకత్వం ఇద్దరు కేంద్ర మంత్రులను పరిశీలకులుగా పంపనుంది. కేంద్ర మంత్రులు ధర్మేంద్రప్రధాన్, జి. కిషన్ రెడ్డిలు మంగళవారం నాడు సాయంత్రం బెంగుళూరుకు చేరుకోనున్నారు. కర్ణాటక సీఎం పదవికి యడియూరప్ప సోమవారం నాడు రాజీనామా చేశారు. కొత్త సీఎం బాధ్యతలు చేపట్టేవరకు యడియూరప్ప అపధ్దర్మ సీఎంగా కొనసాగనున్నారు.
also read:నాపై ఏ ఒత్తిడీ లేదు.. రెండురోజుల ముందే రాజీనామాకు సిద్ధమయ్యాను.. : యడియూరప్ప
కర్ణాటక సీఎంగా ఎవరిని ఎంపిక చేయాలనే విషయమై బీజేపీ ఎమ్మెల్యేలతో కేంద్ర మంత్రులు ధర్మేంద్రప్రధాన్, జి.కిషన్ రెడ్డిలు సమావేశం కానున్నారు.ఆర్ఎస్ఎస్ నేపథ్యంతో పాటు స్థానికంగా ఉన్న సామాజికవర్గాల ప్రాతిపదికన సీఎం పదవికి నేతను ఎంపిక చేయనున్నారు.ప్రహ్లద్ జోషీ, బీఎల్. సంతోష్, విశ్వేశ్వరహెగ్డే కాగేరి, తేజస్వి సూర్యలకు ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉంది. బసవరాజ బొమ్మై లింగాయత్ సామాజిక వర్గానికి చెందినవాడు. అయితే ఆయనకు ఆర్ఎస్ఎస్ పేపథ్యం లేదు.
అరవింద బెల్లర్, మురుగేష్ నిరాణిల పేర్లు కూడ సీఎం రేసులో విన్పిస్తున్నాయి. కర్ణాటకలో బలమైన లింగాయత్ సామాజిక వర్గానికి చెందిన యడియూరప్పను బీజేపీ నాయకత్వం సీఎం పదవి నుండి తప్పించింది. పార్టీ ఆదేశాల మేరకు రాజీనామా చేస్తున్నానని యడియూరప్ప ప్రకటించారు. అయితే లింగాయత్ వర్గాన్ని దూరం చేసుకోకుండా ఉండేందుకు గాను కొత్త సీఎం ఎంపికలో కూడ కమలదళం ఆ వర్గానికి ప్రాధాన్యత ఇచ్చే అవకాశాన్ని కొట్టిపారేయలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.