Farm Laws: ప్రధాని మోడీ గీసిన హద్దు దాటిన మంత్రి వీకే సింగ్.. రైతులపై విమర్శలు
సాగు చట్టాలను రద్దు చేస్తూ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దేశ ప్రజలకు క్షమాపణలు చెబుతూ ఎవరినీ నిందించాలని అనుకోవడం లేదని స్పష్టం చేశారు. తాము రైతుల ప్రయోజనాల కోసం ఎన్నో సంస్కరణలు చేశామని పేర్కొన్నారు. ఆ ప్రసంగమంతా సామరస్య పూర్వకంగా సాగింది. కానీ, తాజాగా, ఆయన మంత్రివర్గ సభ్యుడు వీకే సింగ్ మాత్రం ఈ సహనాన్ని పాటించలేదు. రైతు ఆందోళనలపై విమర్శళు గుప్పించారు.
లక్నో: మూడు వివాదాస్పద సాగు చట్టాల(Farm Laws)ను వెనక్కి(Repeal) తీసుకుంటున్నట్టు ప్రధాన మంత్రి Narendra Modi నిన్న ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పారు. అంతేకాదు, ఎవరినీ నిందించాలనుకోవడం లేదని తెలిపారు. ఆందోళన చేస్తున్న రైతులపై ఎలాంటి విమర్శలు చేయలేదు. అభ్యంతరం తెలుపలేదు. తన ప్రసంగం అంతా సామరస్యపూర్వకంగా సాగింది. ఏడాది పాటు BJPకి తీవ్ర నిరసన ఎదురైనా.. కేంద్ర ప్రభుత్వానికి సవాల్ విసిరిన రైతులను ఒక్క చోట కూడా తప్పుతీయలేదు. తాము ఎవరినీ నిందించాలని భావించడం లేదని స్పష్టం చేశారు. కానీ, ఈ హద్దును ఆయన మంత్రివర్గ సభ్యుడు VK Singh దాటారు. ఆయన రైతులపై విమర్శలు కురిపించారు.
కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి వీకే సింగ్ రైతు ఆందోళనలపై మండిపడ్డారు.‘కొన్ని సార్లు మనం విషయాలను చాలా చక్కగా అర్థం చేసుకుంటాం. కానీ, అప్పుడూ ఇతరులను గుడ్డిగా అనుసరిస్తాం. మీరంతా నల్ల చట్టాలు అని పిలుస్తున్నా.. ఆ చట్టాల్లో నలుపు ఏమిటి అని ఓ రైతు నాయకుడిని నేను ఓ సారి అడిగాను. కేవలం ఆ చట్టాలను రాసిన నల్లరంగు ఇంక్ను మినహాయించి అందులో నలుపు ఏమున్నదని ప్రశ్నించాను. అందుకు ఆయన ఆశ్చర్యకరంగా సంతృప్తికర సమాధానమివ్వలేదు. ఆయన ఏమన్నాడంటే.. ఔను నేను అంగీకరిస్తాను.. కానీ, అయినా అవి నల్లచట్టాలే అని అన్నాడు. ఇలాంటి పిచ్చికి మందు ఉంటుందా? దీనికి మందే లేదు. రైతు సంఘాల్లోనే ఆధిపత్య పోరు ఉన్నది. కొన్ని కారణాల వల్ల అవి చిన్నకారు, సన్నకారు రైతుల ప్రయోజనాలను పట్టించుకోవడం లేదు. అందుకే ప్రధానమంత్రి చట్టాలను వెనక్కి తీసుకున్నారు’ అని పేర్కొన్నారు.
Also Read: Farm Laws: ఔను.. మేం విఫలమయ్యాం.. ప్రధాని నిర్ణయాన్ని స్వాగతిస్తున్నా: యూపీ సీఎం యోగి
పంజాబ్, ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈ కీలక ప్రకటన చేశారు. ఈ దేశ ప్రజలకు క్షమాపణలు చెబుతున్నారని ఆ ప్రకటనలో ప్రధాని తెలిపారు. స్వచ్ఛమైన హృదయంతో తాను ఈ విషయం చెబుతున్నానని పేర్కొంటూ.. ఈ చట్టాల్లోని సత్యాలను వారికి సమగ్రంగా అర్థమయ్యేట్టు చెప్పడంలో వెనుకబడ్డామని అన్నారు. తాము ఆ మూడు సాగు చట్టాలను వెనక్కి తీసుకుంటామని నిర్ణయించుకున్నట్టు వివరించారు.
Also Read: Farm Laws: చట్టాల రద్దుపై ఆర్ఎస్ఎస్ అనుబంధ రైతు విభాగం ఏమన్నదంటే?
మూడు సాగు చట్టాలపై బీజేపీ నేతలూ కఠిన వైఖరి తీసుకున్నారు. రైతుల ధర్నాను విరమించుకోవాలని మాత్రమే చెప్పారు. పలుమార్లు చర్చలు జరిగినా కేంద్ర ప్రభుత్వం, రైతులు పట్టువిడువ లేదు. కానీ, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆశ్చర్యకరంగా ఈ ప్రకటన చేశారు. దీనిపై కొందరు బీజేపీ నేతలు అసంతృప్తితో ఉన్నారు. అయితే, ప్రధాన మంత్రి మాత్రం ఎవరినీ నిందించాలని అనుకోవడం లేదని, క్షమాపణలు చెప్పారు. దీంతో చాలా వరకు పార్టీ శ్రేణులు సాగు చట్టాలపై పార్టీ నేతలు ఆచితూచీ మాట్లాడుతున్నారు. యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ కూడా మోడీ ప్రకటనను స్వాగతించి ఆ చట్టాలను ఆ రైతులకు వివరించడంలో విఫలమయ్యామని పేర్కొన్నారు. కానీ, తాజాగా కేంద్ర మంత్రి మాత్రం ఇందుకు విరుద్ధమైన వైఖరి వెల్లడించారు.