ఉక్రెయిన్లో మరణించిన భారత విద్యార్థి నవీన్ శేఖరప్ప మృతదేహాన్ని ఎన్నో సవాళ్లు, సమస్యల మధ్య స్వగ్రామానికి చేర్చిన ప్రధాని నరేంద్ర మోడీకి కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ కృతజ్ఞతలు చెప్పారు. నవీన్ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, రాష్ట్ర ప్రజలు, ప్రభుత్వం తరఫున తాను ధన్యవాదాలు తెలుపుతున్నట్టు ట్వీట్ చేశారు.
న్యూఢిల్లీ: రష్యా దాడిలో ఉక్రెయిన్లో మరణించిన భారతీయ విద్యార్థి నవీన్ శేఖరప్ప మృతదేహం ఇల్లు చేరింది. సోమవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో నవీన్ డెడ్ బాడీ బెంగళూరు చేరింది. అక్కడి నుంచి నవీన్ స్వగ్రామం హవేరీకి అంబులెన్స్లో తరలించారు. ఉదయం 9 గంటల ప్రాంతంతో స్వగ్రామానికి నవీన్ శేఖరప్ప మృతదేహం చేరుకుంది. మార్చి 1వ తేదీన రష్యా దాడిలో ఉక్రెయిన్ ఖార్కివ్ నగరంలో నవీన్ శేఖరప్ప దుర్మరణం చెందాడు. ఆయన డెడ్ బాడీని ఉక్రెయిన్ నుంచి స్వగ్రామానికి తీసుకురావడం ఆ కఠోర పరిస్థితులు సాహసంగా మారింది. సవాళ్లతో కూడుకున్న ఆ పనిని కేంద్ర ప్రభుత్వం పూర్తి చేసింది. దీనిపై కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ట్విట్టర్లో రియాక్ట్ అయ్యారు.
నవీన్ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, కర్ణాటక ప్రజలు, ప్రభుత్వం తరఫున తాను ప్రధాని నరేంద్ర మోడీకి ఈ విషయమై హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు ట్వీట్ చేశారు. అనేక సవాళ్లు, సమస్యలతో కూడుకున్న వాతావరణంలోనూ నవీన్ శేఖరప్ప మృతదేహాన్ని స్వగ్రామానికి తెచ్చే పనిని ప్రధాని మోడీ పూర్తి చేశారని పేర్కొన్నారు.
నవీన్ శేఖరప్ప మృతదేహానికి హిందూ వీరశైవ లింగాయత్ సాంప్రదాయంలో అంతిమ క్రియలు నిర్వహించనున్నారు. ఆ తర్వాత స్వగ్రామంలో ఊరేగింపు చేపడతారు. నవీన్ శేఖరప్ప అంత్యక్రియలకు సీఎం బసవరాజ్ బొమ్మై కూడా హాజరై నివాళులు అర్పించే అవకాశాలు ఉన్నాయి. అంతిమ సంస్కారాలు ముగిసిన తర్వాత నవీన్ శేఖరప్ప మృతదేహాన్ని ఆయన కుటుంబం.. దేవనాగరిలోని ఎస్ఎస్ మెడికల్ కాలేజీకి పరిశోధనల కోసం అందించనున్నారు.
ఉక్రెయిన్లో మరణించిన నవీన్ శేఖరప్ప జ్ఞానగౌడర్ 21 ఏళ్ల ఎంబీబీఎస్ విద్యార్థి. ఆయన కర్ణాటకలోని హవేరీ జిల్లా నివాసి. ఖార్కివ్ నేషనల్ మెడికల్ యూనివర్శిటీకి లో వైద్య విద్యను అభ్యసిస్తున్నారు. అయితే రష్యా ఉక్రెయిన్ పై భీకర దాడులు చేస్తున్న సమయంలో నవీన్ ఆహారం కొనుక్కోవడానికి క్యూలో నిలబడి ఉన్నారు. అయితే ఆ కాల్పుల్లో స్టూడెంట్ మృతి చెందాడు. ఆయన మృతి పట్ల భారత్ మొత్తం ఒక్కసారిగా ద్రిగ్భాంతికి గురయ్యింది. అక్కడ చిక్కుకున్న విద్యార్థులు కూడా తీవ్ర ఆందోళన చెందారు. కాగా కర్ణాటక సీఎం నవీన్ శేఖరప్ప కుటుంబానికి సీఎం బసవరాజ్ బొమ్మై రూ.25 లక్షల చెక్కును అందజేశారు. బాధిత కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు.
అయితే నవీన్ శేఖరప్ప జ్ఞానగౌడర్ మృతదేహాన్ని రాష్ట్రంలోని వైద్య కళాశాలకు దానం చేయాలని ఆయన కుటుంబం నిర్ణయించింది. ఈ మేరకు మృతుడి తండ్రి శేఖరప్ప శుక్రవారం మాట్లాడుతూ.. తన కుమారుడి మృతదేహాన్ని తీసుకొచ్చే ప్రక్రియ ఆలస్యమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు ఆయన దేహాన్ని చివరిసారిగా చూడగలమని తెలియగానే ఆ దుఃఖం తొలగిపోయిందని అన్నారు. అంత్యక్రియలు నిర్వహించిన అనంతరం మృతదేహాన్ని దావణగెరెలోని ఎస్ఎస్ మెడికల్ కాలేజీకి దానం చేయాలని కుటుంబసభ్యులు నిర్ణయించినట్లు తెలిపారు.
ఇదిలా ఉండగా ఉక్రెయిన్ పై రష్యా దాడి చేస్తూనే ఉంది. ఉక్రెయిన్ పై విచక్షణ రహితంగా బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. ఇప్పటికే పలు ప్రధాన పట్టణాలు స్మశానదిబ్బలుగా మారాయి. తమ నగరాలను కాపాడుకోవడాని ఉక్రెయిన్ సైన్యం కూడా వీరోచితంగా పోరాటం సాగిస్తున్నాయి.
