శబరిమలను సందర్శించిన కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్.. 26వసారి అయ్యప్ప సన్నిధానానికి
కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ కేరళలోని ప్రఖ్యాత శబరిమల ఆలయాన్ని సందర్శించారు. తాను 26వ సారి శబరిమలను సందర్శిస్తున్నానని, కేంద్రమంత్రి అయ్యాక ఇదే తొలి శబరిమల దర్శనమని ట్విట్టర్లో పేర్కొన్నారు
కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ (rajeev chandrasekhar) కేరళలోని (kerala) ప్రఖ్యాత శబరిమల (sabarimala) ఆలయాన్ని సందర్శించారు. బుధవారం బెంగళూరులోని అయ్యప్ప ఆలయం నుంచి సాయంత్రం పతనంతిట్ట చేరుకున్న ఆయన ఈ ఉదయం పంపా నుంచి కాలినడకన కొండపైన వున్న సన్నిధానం చేరుకున్నారు. వేలాది మంది భక్తులతో కలిసి కొండపైకి చేరుకున్న రాజీవ్ చంద్రశేఖర్.. 18వ మెట్టు ఎక్కి సన్నిధానానికి చేరుకున్నారు.
అనంతరం ఆయన గురువారం మధ్యాహ్నం కాలినడకన పర్వతం కిందకి చేరుకున్నారు. తాను 26వ సారి శబరిమలను సందర్శిస్తున్నానని, కేంద్రమంత్రి అయ్యాక ఇదే తొలి శబరిమల దర్శనమని ట్విట్టర్లో పేర్కొన్నారు. ఇటీవల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నా అయ్యప్ప ఆశీస్సులతో పూర్తి దర్శనం చేసుకోగలిగినందుకు సంతోషంగా ఉందని రాజీవ్ చంద్రశేఖర్ ట్వీట్లో పేర్కొన్నారు. అనంతరం సాయంత్రం కొచ్చి చేరుకున్న కేంద్రమంత్రి నెడుంబస్సేరి విమానాశ్రయం నుంచి ఢిల్లీకి తిరుగు ప్రయాణమయ్యారు.
ఇకపోతే.. చిమగస పూజల కోసం శబరిమల ఆలయాన్ని నిన్న తెరిచారు. ఉదయం 5 గంటలకు సీనియర్ తంత్రి కాంతారావు రాజీవరావు ఆధ్వర్యంలో మేల్శాంతి ఎన్.పరమేశ్వరన్ నంబూద్రి ఆలయాన్ని తెరిచి దీపాలను వెలిగించారు. అనంతరం నిర్మాల్య దర్శనం, అభిషేకం నిర్వహించారు. ఈ క్రమంలో ఆలయం ఐదు రోజులు పాటు తెరిచే ఉంచుతామని దేవస్థాన అధికారులు తెలిపారు. పూజలు ముగించుకుని 21వ తేదీ రాత్రి 10 గంటలకు ఊరేగింపు ముగుస్తుంది. ఓనమ్ పూజల కోసం సెప్టెంబర్ 6న ఆలయాన్ని తెరుస్తామని.. అలాగే సెప్టెంబర్ 10వ తేదీన తిరునాడ కొలువుదీరనుందని ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డ్ తెలిపింది.