పొరపాటున కూడా మద్యానికి బానిసైన వాడికి పిల్లను ఇవ్వొద్దు
మద్యానికి బానిసైన వ్యక్తితో కూతురు పెండ్లి చేయవద్దని కేంద్రమంత్రి కౌశల్ కిశోర్ సూచించారు. ఉత్తరప్రదేశ్లోని లాంబువా అసెంబ్లీ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన డీ అడిక్షన్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పొరపాటున కూడా తాగుబోతుకు పిల్లను ఇవ్వొద్దని సూచించారు.
మద్యానికి బానిసైన వాడి కంటే.. తొక్కేవాడికో లేదా దినసరి కార్మికుడికో పిల్లను ఇస్తే బాగా చూసుకుంటాడని, పొరపాటున కూడా మద్యానికి బానిసైన వాడికి పిల్లను ఇవ్వొద్దని కేంద్ర గృహనిర్మాణ , పట్టణ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి కౌశల్ కిషోర్ సూచించారు. తాగుబోతు వ్యక్తితో కూతురు పెండ్లి చేయవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఉత్తరప్రదేశ్లోని లాంబువా అసెంబ్లీ నియోజకవర్గంలో శనివారం నాడు ఏర్పాటు చేసిన డి-అడిక్షన్పై ఒక కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ.. "పొరపాటున కూడా మద్యానికి బానిసైన వాడికి పిల్లను ఇవ్వొద్దు" అని మంత్రి కిషోర్ వాదించారు.
తన వ్యక్తిగత అనుభవాన్ని వివరిస్తూ.. ‘‘నేను ఎంపీగా, నా భార్య ఎమ్మెల్యే.. కానీ ఏం లాభం? మా కుమారుడి ప్రాణాలను కాపాడలేకపోయాం.. సామాన్య ప్రజానీకం ఎలా చేస్తానన్నారు. ‘‘నా కొడుకు (ఆకాష్ కిషోర్) తన స్నేహితులతో కలిసి మద్యం సేవించడం అలవాటు చేసుకున్నాడని.. డీ అడిక్షన్ సెంటర్లో చేర్పించాం. ఆ చెడు అలవాటు మానేశాడని భావించి.. ఆరు నెలలకే పెళ్లి చేశాం.. కానీ, పెండ్లి అయినా కొద్దిరోజులకే మళ్లీ మద్యం తాగడం మొదలుపెట్టాడు. చివరికి ఆ మద్యానికి బలైపోయాడు. రెండేళ్ల క్రితం.. అక్టోబర్ 19న, ఆకాష్ మరణించాడు. నా కోడలు రెండేండ్ల వయసున్న కుమారుడిని ఎత్తుకొని మా ముందు వితంతువుగా తిరుగుతుంటే చూసి తట్టుకోలేకపోతున్నాం."అని కేంద్ర మంత్రి చెప్పారు.
మీరు మీ కుమార్తెలు, సోదరీమణులను దీని నుండి రక్షించాలని అన్నారు. "స్వాతంత్ర్య ఉద్యమంలో, 90 సంవత్సరాల వ్యవధిలో 6.32 లక్షల మంది బ్రిటిష్ వారితో పోరాడి తమ ప్రాణాలను త్యాగం చేశారని, వ్యసనం కారణంగా ప్రతి సంవత్సరం 20 లక్షల మంది మరణిస్తున్నారని మంత్రి పేర్కొన్నారు.
ఉత్తరప్రదేశ్లోని మోహన్లాల్గంజ్ లోక్సభ నియోజకవర్గానికి చెందిన ఎంపీ కూడా 80 శాతం క్యాన్సర్ మరణాలు పొగాకు, సిగరెట్లు మరియు 'బీడీ'ల వ్యసనానికి కారణమని చెప్పారు. డి-అడిక్షన్ కార్యక్రమంలో ప్రేక్షకులు, ఇతర సంస్థలు భాగస్వాములు కావాలని, వారి కుటుంబాలను రక్షించాలని ఆయన కోరారు. జిల్లాను వ్యసనా రహితంగా మార్చేందుకు డీ అడిక్షన్ క్యాంపెయిన్ను అన్ని పాఠశాలలకు తీసుకెళ్లాలని, ఉదయం ప్రార్థన సమయంలోనే పిల్లలకు దీనిపై సలహాలు ఇవ్వాలని మంత్రి సూచించారు.