వ్యాక్సిన్ ఇవ్వకుంటే.. మేం ఉరేసుకోవాలా: సదానందగౌడ సంచలన వ్యాఖ్యలు
కేంద్రమంత్రి డీవీ సదానంద గౌడ సంచలన వ్యాఖ్యలు చేశారు. న్యాయస్థానం తీర్పులపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. కోర్టు ఆదేశించిన విధంగా వ్యాక్సిన్లను ఉత్పత్తి చేయడంలో విఫలమైనందుకు ప్రభుత్వంలోని వారంతా ఉరి వేసుకోవాలా అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు
భారతదేశంలో కోవిడ్ సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో వైరస్ను కట్టడి చేయాలంటే వ్యాక్సిన్ ఒక్కటే మార్గమని నిపుణులు చెబుతున్నారు. అయితే వ్యాక్సిన్ కొరత రాష్ట్ర ప్రభుత్వాలను వేధిస్తోంది. దీంతో తమకు టీకాల డోసులు పెంచాలని ముఖ్యమంత్రులు ప్రధాని మోడీకి పదే పదే లేఖలు రాస్తున్నారు.
మరోవైపు వ్యాక్సిన్ కొరతను తీర్చాలంటూ కోర్టులు సైతం కేంద్రాన్ని ఆదేశిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి డీవీ సదానంద గౌడ సంచలన వ్యాఖ్యలు చేశారు. న్యాయస్థానం తీర్పులపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.
కోర్టు ఆదేశించిన విధంగా వ్యాక్సిన్లను ఉత్పత్తి చేయడంలో విఫలమైనందుకు ప్రభుత్వంలోని వారంతా ఉరి వేసుకోవాలా అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దేశంలోని ప్రతి ఒక్కరికి టీకా వేయాలి అని కోర్టు సూచించడం మంచి పరిణామమేనని ఆయన అన్నారు.
Also Read:ఇండియాలో కరోనా జోరు: మొత్తం 23,703,665కి చేరిక
ఒకవేళ మీరు రేపటిలోగా దేశ ప్రజలందరికి వ్యాక్సిన్ వేయాలని సూచిస్తే.. అందుకు సరిపడా వ్యాక్సిన్లు ఉత్పత్తి చేయనందుకు తామంతా ఉరి వేసుకుని చావాలా అంటూ సదానందగౌడ అసహనం వ్యక్తం చేశారు.
ప్రభుత్వ నిర్ణయం ప్రకారమే కార్యక్రమాలు కొనసాగుతాయి తప్ప.. ఇందులో రాజకీయ, ఇతర ప్రయోజనాలు లేవని ఆయన స్పష్టం చేశారు. వ్యాక్సినేషన్ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎంతో నిజాయతీగా, నిబద్దతగా ఉందన్నారు.
అయితే కొన్ని ఇబ్బందులు తలెత్తుతాయని.. కొన్ని అంశాలు మన నియంత్రణలో ఉండవని సదానంద వ్యాఖ్యానించారు. రెండు, మూడు రోజుల్లో పరిస్ధితులు చక్కబడతాయని.. దేశ ప్రజలందరికి వ్యాక్సిన్ ఇచ్చేందుకు ప్రభుత్వం తన వంతు కృషి చేస్తుందని కేంద్రమంత్రి తెలిపారు.