షెడ్యూల్ కంటే ముందుగానే త్రిపుర పర్యటనకు కేంద్ర మంత్రి అమిత్ షా.. ఎన్నికలపై పార్టీనేతలో చర్చలు !
Agartala: త్రిపుర అసెంబ్లీ ఎన్నికలు త్వరలోనే జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే కేంద్ర అమిత్ షా బుధవారం నాడు త్రిపురకు వెళ్లారు. ఒక రోజు పర్యటనలో భాగంగా అమిత్ షా రాష్ట్రంలోని బీజేపీ రథ యాత్రను జెండా ఊపి ప్రారంభిస్తారు. అయితే, షా అనుకున్న షెడ్యూల్ కంటే ముందుగానే త్రిపురకు వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Union Home Minister Amit Shah: త్రిపుర అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలు ఎన్నికల కోసం సిద్ధమవుతున్నాయి. ప్రజల్లోకి వెళ్లడానికి ప్రచారాలను ముమ్మరం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే భారతీయ జనతా పార్టీ సైతం ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలతో ముందుకు సాగుతోంది. దీని కోసం ఆ పార్టీకి చెందిన అగ్ర నాయకులు త్రిపుర పర్యటనలు చేస్తున్నారు. త్రిపుర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా బుధవారం రాత్రి త్రిపురకు రానున్నారు. అమిత్ షా గురువారం రాష్ట్రానికి చేరుకోవాల్సి ఉండగా, ఆయన రాక ముందే జరిగిందని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. అమిత్ షా బుధవారం రాత్రి 10 గంటలకు వైమానిక దళ విమానంలో రాష్ట్రానికి చేరుకోనున్నారు. కట్టుదిట్టమైన భద్రత మధ్య ఆయన రాష్ట్ర అతిథి గృహంలో రాత్రి బస చేస్తారని ఆ అధికారి తెలిపారు.
ఈ పర్యటనలో భాగంగా అమిత్ షా రాష్ట్రంలో రెండు రథ రథయాత్రలను జెండా ఊపి ప్రారంభించనున్నారు. రాష్ట్ర రాజధాని అగర్తలాకు 190 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉత్తర త్రిపురలోని ధర్మానగర్ కు ఆయన మొదట వెళతారని పార్టీ నాయకులు తెలిపారు. అనంతరం బంగ్లాదేశ్ సరిహద్దుకు సమీపంలోని దక్షిణ త్రిపురలోని సబ్రూమ్లో రెండో రథయాత్రను జెండా ఊపి ప్రారంభించనున్నారు. ఆ తర్వాత ఆయన రాష్ట్ర పర్యటనను ముంగించుకుని వెళ్లనున్నారు. కాగా, అమిత్ షా గురువారం నాడు త్రిపురకు రావాల్సి ఉంది. కానీ ఆయన ముందుగానే రావడానికి రీషెడ్యూల్ చేయడం వెనుక ఉన్న కారణం ఎంటనేది తెలియరాలేదు.
ఫిబ్రవరిలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ముందు పార్టీ మెగా ప్రదర్శన కోసం ఏర్పాట్లను పరిశీలించడానికి ముఖ్యమంత్రి మాణిక్ సాహా సమాచార, సాంస్కృతిక వ్యవహారాల మంత్రి సుశాంత చౌదరితో కలిసి సోమవారం ధర్మనగర్, సబ్రూమ్లను సందర్శించారు. బీజేపీ రెండు రథ యాత్రల్లో భాగంగా పలు బహిరంగ సభలు, ర్యాలీలను ప్లాన్ చేసినట్లు పార్టీ నేతలు తెలిపారు. త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రజల్లోకి వెళ్లడానికి బీజేపీ ఈ రాష్ట్రవ్యాప్త రథ యాత్రను చేపడుతోంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కార్యక్రమం ముగింపు రోజు జనవరి 12న హాజరుకానున్నారు.
కాగా, 2003, 2008 ఎన్నికల్లో త్రిపుర ప్రజలు అప్పటి లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వాన్ని మార్చాలని కోరుకున్నారనీ, అయితే ప్రతిపక్ష కాంగ్రెస్ నాయకులు వారి ఆకాంక్షలను గౌరవించలేదని బీజేపీ సీనియర్ నాయకుడు బిప్లబ్ దేబ్ సోమవారం పేర్కొన్నారు. ఉనకోటి జిల్లాలోని ఫాటిక్రోయ్ ప్రాంతంలో జరిగిన బిజోయ్ సంకల్ప ర్యాలీలో ఆయన ప్రసంగిస్తూ, 2023 ఎన్నికల్లో బీజేపీని ఓడించాలని సీపీఎం, కాంగ్రెస్ ఇటీవల విడుదల చేసిన సంయుక్త ప్రకటన రెండు పార్టీల మధ్య ఉన్న సాన్నిహిత్యాన్ని వెల్లడిస్తోందన్నారు. "అప్పటి ప్రతిపక్ష పార్టీ (కాంగ్రెస్) అధికార పార్టీ (సీపీఐపిఐ (ఎం)) తో స్నేహం చేసింది. నేడు ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలని ప్రజలను కోరుతూ ఉమ్మడి ప్రకటన విడుదల చేయడంతో వారి అవగాహన తెరపైకి వచ్చింది" అని దేబ్ అన్నారు.
2018 ఎన్నికలకు ముందు 25 ఏళ్ల సీపీఐ(ఎం) నేతృత్వంలోని లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వాన్ని గద్దె దించినప్పుడు బీజేపీకి కేవలం 1.5 శాతం ఓట్లు మాత్రమే ఉన్నాయని ఆయన చెప్పారు. పార్టీ నేతల సమన్వయంతో కృషి చేయడం వల్లే ప్రజలు బీజేపీని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఆశీర్వదించారని, త్రిపురలో చరిత్ర సృష్టించారని అన్నారు. సీపీఐ(ఎం) మద్దతుదారులకు చేరువ కావాలనీ, రాష్ట్రంలో బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం చేస్తున్న కృషిపై వారికి అవగాహన కల్పించాలని ఆయన పార్టీ కార్యకర్తలను కోరారు.