కొవాగ్జిన్కు ఆమోదంలో ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు లేవు.. ఆ మీడియా రిపోర్ట్స్ను ఖండించిన కేంద్రం..
రాజకీయ ఒత్తిళ్ల కారణంగా కొవాగ్జిన్కు అత్యవసర వినియోగానికి సంబంధించిన ఆమోదం హడావుడిగా జరిగిందన్న మీడియా నివేదికలను కేంద్ర ప్రభుత్వం తోసిపుచ్చింది. ఆ మీడియా నివేదికలు పూర్తిగా తప్పుదోవ పట్టించేవిగా, తప్పుడు సమాచారంతో కూడినవిగా పేర్కొంది.
రాజకీయ ఒత్తిళ్ల కారణంగా కొవాగ్జిన్కు అత్యవసర వినియోగానికి సంబంధించిన ఆమోదం హడావుడిగా జరిగిందన్న మీడియా నివేదికలను కేంద్ర ప్రభుత్వం తోసిపుచ్చింది. కోవిడ్-19ను ఎదుర్కొనేందుకు హైదరాబాద్ కేంద్రంగా ఉన్న భారత్ బయోటెక్ సంస్థ కొవాగ్జిన్కు అభివృద్ది చేసింది. అయితే రాజకీయ ఒత్తిళ్ల కారణంగా కొవాగ్జిన్ తయారీలో కొన్ని ప్రక్రియలను దాటవేయాల్సి వచ్చిందని, క్లినికల్ ట్రయల్స్ను వేగవంతం చేసిందని కొన్ని నివేదికలు పేర్కొన్నాయి. ఈ మీడియా నివేదికలపై స్పందించిన కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అందులో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టం చేసింది.
ఆ మీడియా నివేదికలు పూర్తిగా తప్పుదోవ పట్టించేవిగా, తప్పుడు సమాచారంతో కూడినవిగా ఉన్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. ‘‘భారత ప్రభుత్వం, నేషనల్ రెగ్యులేటర్ సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్సీవో) అత్యవసర వినియోగ అధికారం కోసం కోవిడ్ -19 వ్యాక్సిన్లను ఆమోదించడంలో శాస్త్రీయ విధానాన్ని, సూచించిన నిబంధనలను అనుసరించాయి’’ అని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
అత్యవసర పరిస్థితుల్లో పరిమితం చేయబడిన ఉపయోగం కోసం కోవిడ్ వ్యాక్సిన్లకు సీడీఎస్సీవో సబ్జెక్ట్ నిపుణుల కమిటీ సిఫార్సుల మేరకు మాత్రమే జాతీయ నియంత్రణ సంస్థ మంజూరు చేసింది తెలిపింది. సీడీఎస్సీవో సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ కమిటీ 2021 జనవరి 1-2 తేదీన సమావేశమై తగిన చర్చల తర్వాత..కొవాగ్జిన్కు పరిమితం చేయబడిన అత్యవసర ఆమోదం కోసం ప్రతిపాదనకు సంబంధించి సిఫార్సులు చేసిందని మంత్రిత్వ శాఖ పేర్కొంది.