కేంద్రమంత్రి వర్గ విస్తరణ మరో రెండు, మూడు రోజుల్లో ఉంటుందని కొన్ని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఈ మంత్రివర్గ విస్తరణ ద్వారా కొత్తగా సుమారు 20 మందికి క్యాబినెట్‌లో చోటు కల్పించనున్నట్టు తెలిపాయి. ప్రధాని మోడీ ఈ నెల 14వ తేదీన ఫ్రాన్స్ పర్యటనకు బయల్దేరడానికి ముందే ఈ విస్తరణ ఉంటుందని పేర్కొన్నాయి. 

న్యూఢిల్లీ: కేంద్రమంత్రి వర్గ విస్తరణ మరో రెండు మూడు రోజుల్లో జరిగే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తున్నది. వర్షాకాల పార్లమెంటు సమావేశాల్లో నూతన మంత్రులు పాల్గొనేలే నిర్ణయాలు తీసుకోవాలని బీజేపీ హైకమాండ్ భావించినట్టు సమాచారం. పార్లమెంటు సమావేశాలు ఈ నెల 20వ తేదీన ప్రారంభం కానున్నాయి. అయతే, ఈ సమావేశాలకు ముందే ప్రధాని మోడీ యూరప్ కంట్రీ ఫ్రాన్స్‌లో పర్యటించనున్నారు. ఈ నెల 14 నుంచి 16వ తేదీల మధ్య ఆయన ఫ్రాన్స్ పర్యటిస్తారు. అయితే.. ప్రధాని మోడీ పర్యటనకు ముందే ఈ విస్తరణ ఉంటుందని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. బుధవారం ఈ విస్తరణ ఉంటుందనీ ఇంకొన్ని వర్గాలు వెల్లడించాయి.

ప్రధాని మోడీ మొదటి హయాంలో మూడు సార్లు కేంద్ర మంత్రివర్గాన్ని విస్తరించారు. రెండో హయాంలో ఇప్పటికి రెండు సార్లు ఈ విస్తరణ జరిగింది. వచ్చే ఏడాది లోక్ సభ ఎన్నికలు జరగనున్న సందర్భంలో త్వరలో చివరి సారి మంత్రివర్గ విస్తరణ చేపట్టే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తున్నది.

Also Read: ఆ తెలుగు నేతకు రాజ్యసభ సీటు.. బీజేపీ ప్లాన్ ఇదే!

లోక్ సభ ఎన్నికలకు తోడు పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో అన్ని వర్గాలకు ప్రాధాన్యత ఇస్తూ.. ఎన్నికల రాష్ట్రాలనూ దృష్టిలో పెట్టుకుని మంత్రివర్గంలో మార్పులు చేర్పులు చేపట్టాలని బీజేపీ యోచిస్తున్నది. అందుకే ఈ సారి మంత్రివర్గ విస్తరణలో కొత్తగా 20 మందికి చోటు దక్కే అవకాశాలు ఉన్నాయని తెలుస్తున్నది. మంత్రివర్గం నుంచి కొందరికి ఎన్నికల రాష్ట్రాల బాధ్యతలు అప్పగించాలని ఆలోచిస్తున్నట్టు సమాచారం.