సాగు చట్టాలపై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని ఆరోపించారు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్. 

సాగు చట్టాలపై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని ఆరోపించారు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్. రాజ్యసభలో వ్యవసాయ చట్టాలపై చర్చ సందర్భంగా శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. ఇటు ప్రతిపక్షాలు, అటు రైతు సంఘాలు.. సాగు చట్టాల్లో ఒక్క లోపాన్నీ ఎత్తి చూపలేకపోయాయని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

వ్యవసాయానికి నీళ్లు కావాలని ప్రతి ఒక్కరికీ తెలుసునని.. ఆ వ్యవసాయాన్ని కాంగ్రెస్ నాశనం చేసిందని తోమర్ ఎద్దేవా చేశారు. కానీ బీజేపీ ఎప్పుడూ అలా చేయదని ఆయన స్పష్టం చేశారు. సాగు చట్టాలను సమర్థించారు.

ఆందోళన చేస్తున్న రైతులతో చర్చలు జరిపేందుకు ప్రభుత్వం సదా సిద్ధంగానే ఉందని తోమర్ తేల్చి చెప్పారు. చట్టాల్లో సవరణలు చేసేందుకూ సిద్ధమేనని, అలాగని ఆ మూడు చట్టాల్లో లోపాలున్నట్టు కాదని ఆయన వ్యాఖ్యానించారు.

కేవలం ఒక రాష్ట్రానికి చెందిన రైతులే ఆందోళనలు చేస్తున్నారని, వారికి కావాలనే తప్పుడు సమాచారమిచ్చి రెచ్చగొడుతున్నారని తోమర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

కార్పొరేట్లు రైతుల భూములను లాక్కుంటారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. ఒప్పంద వ్యవసాయంలో రైతు భూమిని లాక్కునేలా చట్టంలో ఎక్కడైనా నిబంధనలున్నాయేమో చూపించాలని కేంద్ర వ్యవసాయ మంత్రి విసిరారు.

చట్టాలతో రైతులకు లాభం తప్ప ఎలాంటి నష్టం జరగదని తోమర్ హామీ ఇచ్చారు. రైతుల బాగు కోసం నరేంద్ర మోదీ ప్రభుత్వం పనిచేస్తోందని స్పష్టం చేశారు. కొత్త చట్టాలతో రైతుల ఆదాయం పెరుగుతుందని చెప్పారు.