యూనిఫాం సివిల్ కోడ్ను అమలు చేస్తాం : మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ చౌహాన్
Bhopal: మధ్యప్రదేశ్ లో యూనిఫామ్ సివిల్ కోడ్ (యూసీసీ)ను అమలు చేస్తామని బీజేపీ సీనియర్ నాయకుడు, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. బర్వాని జిల్లాలో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. గిరిజన బాలికను పెళ్లి చేసుకుని గిరిజనుల భూమిని లాక్కునే వ్యక్తులు ఉన్నారనీ, అలాంటి పద్ధతులపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు తాను ఈరోజు ఇక్కడికి వచ్చానని చెప్పారు.
Uniform Civil Code (UCC): గిరిజన బాలికను పెళ్లి చేసుకుని గిరిజనుల భూమిని లాక్కునే వ్యక్తులు ఉన్నారనీ, అలాంటి పద్ధతులపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు తాను ఈరోజు బర్వానీకి వచ్చానని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) సీనియర్ నాయకుడు, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. అలాగే, మధ్యప్రదేశ్ లో యూనిఫామ్ సివిల్ కోడ్ (యూసీసీ) ను అమలు చేస్తామని కూడా ఆయన వెల్లడించారు.
వివరాల్లోకెళ్తే.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా రాజకీయ నాయకులు ఓటుబ్యాంకు పెంచుకోవడాని యూనిఫామ్ సివిల్ కోడ్ (యూసీసీ) ను అస్త్రంగా చేసుకునీ, ప్రత్యర్థి పార్టీలే టార్గెట్ గా వ్యాఖ్యలు చేస్తున్నారు. దాదాపు అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు యూసీసీకి సంబంధించి గురించి వివిధ రాష్ట్రాల్లో కొత్త చర్చకు తెరమీదకు తెస్తున్నాయి. ఈ క్రమంలోనే బీజేపీ తాను అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో యూసీసీని అమలు చేస్తామని ఆయా రాష్ట్రాల నాయకులు ప్రకటిస్తున్నారు. ఇటీవల గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ లో యూసీసీని అమలు చేస్తామని ప్రకటించిన బీజేపీ.. తాజాగా మధ్యప్రదేశ్ లో కూడా యూనిఫామ్ సివిల్ కోడ్ ను అమలు చేస్తామని ప్రకటించింది. ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే బీజేపీ ఇలాంటి ప్రకటనలు చేస్తోందనీ, దానిని యూసీసీని అమలు చేసే ఉద్దేశం లేదని ప్రత్యర్థి పార్టీలు ఘాటుగానే విమర్శలు గుప్పిస్తున్నాయి.
రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం యూనిఫాం సివిల్ కోడ్ (యూసీసీ)ను అమలు చేస్తుందనీ, ఇందుకోసం ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గురువారం తెలిపారు. బర్వానీ జిల్లాలోని చాచార్య పాటి గ్రామంలో గురువారం జరిగిన పెసా అవగాహన సదస్సులో సీఎం ప్రసంగిస్తూ ఈ విషయాన్ని వెల్లడించారు. అలాగే, గిరిజన బాలికను పెళ్లి చేసుకుని గిరిజనుల భూమిని లాక్కునే వ్యక్తులు ఉన్నారనీ, అలాంటి పద్ధతులపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు తాను ఈరోజు ఇక్కడకు వచ్చానని కూడా పేర్కొన్నారు. "దేశంలో యూనిఫాం సివిల్ కోడ్ అమలుకు నేను అనుకూలంగా ఉన్నాను. ఒక దేశంలో రెండు చట్టాలు ఎందుకు ఉండాలి? ఒక వ్యక్తికి ఒక భార్య అని చట్టం చేస్తే, అది అందరికీ వర్తించాలి.. యూనిఫామ్ సివిల్ కోడ్ (యూసీసీ) కోసం మేము ఒక కమిటీని ఏర్పాటు చేసే ప్రక్రియలో ఉన్నాము.." అని శివరాజ్ సింగ్ చౌహాన్ వెల్లడించారు.
అలాగే, "ఈ రోజు నేను పెసా చట్టం గురించి చెప్పడానికి ఇక్కడకు (బర్వానీ జిల్లా) వచ్చాను.. ప్రసంగాలు చేయడానికి కాదు.. పెసా (పౌర ప్రాంతాలకు పంచాయితీ పొడిగింపు) చట్టం ఎవరికీ వ్యతిరేకం కాదు.. రాష్ట్రంలోని 89 బ్లాకులలో ఇది అమలు చేయబడుతుంది. నది, గాలి, నీరు, చెట్లు అందరికీ చెందుతాయి.. కానీ మన గిరిజన సంఘాలు అభివృద్ధి పథంలో వెనుకబడి ఉన్నాయి, మన గిరిజన సోదరులు-సోదరీమణులకు వారి హక్కులు ఇవ్వడానికి నేను ఇక్కడకు వచ్చాను అని శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. కాగా, నవంబర్ 15న జనజాతీయ గౌరవ్ దివస్ సందర్భంగా మధ్యప్రదేశ్ తన పెసా చట్టాన్ని నోటిఫై చేసింది. రాష్ట్రంలో మద్యం అమ్మకాలపై శాశ్వత నిషేధానికి సంబంధించి వీలైనంత త్వరగా ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.అయితే ప్రజల్లో దీనిపై అవగాహన పెంపొందించడం చాలా ముఖ్యమని అన్నారు.
పెసా చట్టం (షెడ్యూల్డ్ ప్రాంతాలలో పంచాయతీ చట్టం) నిబంధనల ప్రకారం గ్రామసభ అనుమతితో మాత్రమే మద్యం దుకాణాన్ని గ్రామంలో తెరవవచ్చని చెప్పారు. మతపరమైన స్థలం, పాఠశాల లేదా ఏదైనా ముఖ్యమైన ప్రదేశం సమీపంలో ఉన్న మద్యం దుకాణాన్ని తొలగించాలనీ, ముఖ్యమైన రోజుల్లో కూడా మూసివేయాలని గ్రామసభ నిర్ణయించగలదని చెప్పారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద అనర్హులకు ఇళ్లు మంజూరు చేశారన్న ఫిర్యాదుపై బర్వానీ జిల్లా సెంద్వా జనపద్ పంచాయతీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ను సస్పెండ్ చేయాలని ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆదేశించారు. గ్రామం నుంచి వివిధ రాష్ట్రాలకు వెళ్లే వారితోపాటు బయటి నుంచి వచ్చే వారిపై కూడా గ్రామసభలో రికార్డు పెడతామని తెలిపారు. గ్రామంలో శాంతి, వివాదాల పరిష్కార కమిటీని ఏర్పాటు చేస్తామనీ, చిన్న చిన్న విషయాలను పోలీసులతో కాకుండా గ్రామంలోనే పరిష్కరించుకుంటామన్నారు.