uniform civil code : ఏ ముస్లిం స్త్రీ తన భర్త మూడు పెళ్లిల్లు చేసుకోవాలనుకోదు - అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ
తన భర్త మూడు పెళ్లిల్లు చేసుకోవాలని ఏ ముస్లిం మహిళా కోరుకోదని అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ అన్నారు. వారికి న్యాయం చేయాలంటే యూసీసీ తప్పకుండా తీసుకురావాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.
ముస్లిం మహిళలకు న్యాయం జరగాలంటే యూనిఫాం సివిల్ కోడ్ తీసుకురావాలని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ శనివారం అన్నారు. ప్రతీ ముస్లిం మహిళా యూనిఫాం సివిల్ కోడ్ కావాలని కోరకుంటోందని తెలిపారు. ‘‘ ఏ ముస్లిం మహిళనైనా అడగండి. యూసీసీ నా సమస్య కాదు. ఇది ముస్లిం మహిళలందరికీ సంబంధించినది. ఏ ముస్లిం మహిళ తన భర్త మరో ముగ్గురు భార్యలను ఇంటికి తీసుకురావాలని కోరుకోదు’’ అని సీఎం శనివారం న్యూఢిల్లీలో అన్నారు.
అస్సాం రాష్ట్రంలో యూసీసీని తప్పనిసరిగా అమలు చేయాల్సిన అవసరంద ఉందని సీఎం హిమంత బిస్వా శర్మ నొక్కి చెప్పారు. ముస్లిం మహిళలందరికీ న్యాయం చేయడానికి ఈ చట్టం అవసరమని అన్నారు. వారికి న్యాయం జరగాలంటే ట్రిపుల్ తలాక్ రద్దు తర్వాత యూసీసీని తీసుకురావాల్సి ఉంటుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. అస్సాంలోని స్వదేశీ ముస్లింలు, వలస ముస్లింల మధ్య భేదం చెప్పిన సీఎం.. మునుపటి వారితో కలపకూడదని కోరుకుంటున్నారని అన్నారు.
‘‘ అస్సాంలోని ముస్లిం సమాజానికి ఒకే మతం ఉంది. కానీ సంస్కృతి, మూలాలు రెండు వేర్వేరు విభాగాలను కలిగి ఉన్నాయి. వాటిలో ఒకటి అస్సాంకు చెందినది కాగా వారు గత 200 సంవత్సరాలలో వలస వచ్చిన చరిత్ర లేదు. ఆ వర్గం వారు వలస వచ్చిన ముస్లింలతో కలసి ఉండకూడదని కోరుకుంటారు.’’ అని హిమంత బిస్వా శర్మ చెప్పారు. అస్సాంలోని స్థానిక, వలస వచ్చిన ముస్లింల గుర్తింపుపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ఆయన అన్నారు.
ఇదిలా ఉండగా.. కొన్ని రోజులు స్థబ్దుగా ఉన్న ఈ యూసీసీ అంశంపై ఇటీవల కాలంలో మళ్లీ చర్చలు ప్రారంభమయ్యాయి. కొన్ని బీజేపీ పాలిత రాష్ట్రాలు దీనిని అమలపై మాట్లాడుతున్నాయి. అయితే ఈ చర్చలను ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఇప్పటికే వ్యతిరేకించింది. ఈ మేరకు ఆ బోర్డు ప్రధాన కార్యదర్శి మౌలానా ఖలీద్ సైఫుల్లా రహ్మానీ ఇటీవల ఒక ప్రకటన విడుదల చేశారు. ఉత్తరాఖండ్ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాలు లేదా కేంద్రం ప్రభుత్వం దేశంలో ధరల పెరుగుదల, నిరుద్యోగం మొదలైన అంశాలపై ప్రజల దృష్టిని మరల్చడానికి మాత్రమే ఈ యూసీసీ అంశం తెరమీదికి తీసుకొస్తున్నాయని ఆరోపించారు.
మొదటగా హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్ యూసీసీ అమలు చేయడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పడంతో దీనిపై తాజా చర్చ మొదలైంది. యూనిఫాం సివిల్ కోడ్ ముసాయిదా కోసం త్వరలో ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి కూడా తెలిపారు. కాగా యూనిఫాం సివిల్ కోడ్ అంటే ఏమిటో ప్రభుత్వం స్పష్టంగా నిర్వచనం ఇవ్వాలని కాంగ్రెస్ నాయకుడు సల్మాన్ ఖుర్షీద్ అన్నారు. రాజ్యాగంలో యూసీసీ ప్రస్తావన ఉందని, అయితే దీనికి స్పష్టమైన నిర్వచనం మాత్రం లేదని, దాని ప్రభావం ఎలా ఉటుందనే విషయం కూడా లేదని తెలిపారు.
ఏమిటీ యూనిఫాం సివిల్ కోడ్.. ?
మతం, లింగం, ప్రాంతీయత, సంప్రదాయలతో సంబంధం లేకుండా దేశంలోని పౌరులందరికీ ఒకే రకమైన చట్టాలను రూపొందించి అమలు చేయడమే ఈ యూనిఫాం సివిల్ కోడ్ ఉద్దేశం. ప్రస్తుతం వివిధ సంఘాల వ్యక్తిగత చట్టాలు వారి మత గ్రంథాల ఆధారంగా కొనసాగుతున్నాయి. ఈ సివిల్ కోడ్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 44 కింద వస్తుంది. ఇది భారతదేశ భూభాగం అంతటా పౌరుల కోసం ఒకే విధమైన సివిల్ కోడ్ను పొందేందుకు ప్రయత్నిస్తుంది.