సీఎం షిండే వెళ్లిన మార్గంలో గోముత్రం చల్లిన ఉద్దవ్ మద్దతుదారులు..
శివసేనలో ప్రస్తుతం రెండు వర్గాలు ఉన్న సంగతి తెలిసిందే. ఒక్కటి మాజీ సీఎం ఉద్దవ్ ఠాక్రే వర్గం కాగా, మరోకటి ప్రస్తుత సీఎం ఏక్నాథ్ షిండే వర్గం. ఈ రెండు వర్గాల మధ్య వివాదాలు రోజురోజుకు తీవ్రం అవుతున్నాయి.
శివసేనలో ప్రస్తుతం రెండు వర్గాలు ఉన్న సంగతి తెలిసిందే. ఒక్కటి మాజీ సీఎం ఉద్దవ్ ఠాక్రే వర్గం కాగా, మరోకటి ప్రస్తుత సీఎం ఏక్నాథ్ షిండే వర్గం. ఈ రెండు వర్గాల మధ్య వివాదాలు రోజురోజుకు తీవ్రం అవుతున్నాయి. కొద్ది నెలల కిందట ఉద్దవ్ ఠాక్రేకు వ్యతిరేకంగా పెద్ద సంఖ్యలో శివసేన ఎమ్మెల్యేలతో కలిసి తిరుగుబావుట ఎగరవేసిన ఏక్నాథ్ షిండే.. బీజేపీ మద్దతుతో సీఎం పీఠం ఎక్కిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఉద్దవ్, షిండ్ వర్గాల మధ్య పోరు సాగుతూనే ఉంది. తాజాగా ఔరంగాబాద్లో సీఎం ఏక్నాథ్ షిండే వెళ్లిన మార్గం ఉద్ధవ్ ఠాక్రే మద్దతుదారులు ‘‘గోమూత్రం’’ (ఆవు ముత్రం) చల్లారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు వైరల్గా మారాయి.
నివేదికల ప్రకారం.. ఔరంగాబాద్లోని బిడ్కిన్లో ఉద్దవ్ ఠాక్రే మద్దతుదారులు.. ఏక్నాథ్ షిండే వెళ్లిన మార్గంలో నిమ్మ ఆకులను ఉపయోగించి గోమూత్రాన్ని చల్లారు. షిండే శిబిరంలోని ఎమ్మెల్యేలపై తీవ్ర స్థాయిలో మండపడ్డారు. ప్రతి ఒక్కరికి రూ. 50 కోట్లు ఆఫర్ చేసిన తర్వాత పార్టీ నాయకత్వంపై తిరుగుబాటు చేశారని ఆరోపించారు.
ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి చెందిన అంబాదాస్ దాన్వే మాట్లాడుతూ.. షిండే ఈ మార్గం గుండా వెళ్ళిన తర్వాత తమ పార్టీ కార్యకర్తలు రోడ్డు శుద్ధి చేయడానికి 'గోమూత్ర' (ఆవు మూత్రం) పోశారని చెప్పారు. అయితే ఈ నిరసనపై షిండే శిబిరం ఇంకా స్పందించలేదు.
ఇదిలా ఉంటే.. ముంబైలోని దాదర్లో శనివారం రాత్రి గణేష్ నిమజ్జనం సందర్భంగా ఉద్దవ్, షిండే మద్దతుదారులు ఘర్షణకు దిగాయి. ఇరువర్గాలు మొదట ప్రభాదేవిలో, తర్వాత దాదర్ పోలీస్ స్టేషన్ వెలుపల ఘర్షణ పడ్డారు. దాదర్లో జరిగిన ఘర్షణలో షిండే శిబిరానికి చెందిన ఎమ్మెల్యే సదా సర్వాంకర్ కాల్పులకు తెగబడినట్టుగా వార్తలు వచ్చాయి. అయితే ఈ ఆరోపణలను ఆయన ఖండించారు. పోలీసులు తనను విచారణకు పిలిస్తే సహకరిస్తానని చెప్పారు.
ఈ ఘర్షణలకు సంబంధించి ఉద్దవ్ ఠాక్రే శిబిరానికి చెందిన ఐదుగురు కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. అయితే తర్వాత వారు బెయిల్పై విడుదలయ్యారు. ఈ ఘటనకు సంబంధించి ఇరువర్గాలకు చెందిన 10 మందిపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.