Maharashtra Political Crisis: మ‌హారాష్ట్ర రాజ‌కీయం ర‌స‌వ‌త్తరంగా సాగుతోంది. తాజాగా రెబ‌ల్ ఎమ్మెల్యేల‌పై అన‌ర్హ‌త వేటు వేయాలని ఉద్ద‌వ్ ఠాక్రే బృందం నూత‌నంగా అసెంబ్లీ స్పీక‌ర్ గా ఎన్నికైన రాహుల్ నార్వేక‌ర్ ను క‌లిశారు. తమ పార్టీ ఆదేశాలను ఉల్లంఘించారనే ఆరోపణలపై తిరుగుబాటు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాల‌ని పిటిషన్‌ను దాఖలు చేశారు.

Maharashtra Political Crisis: మ‌హారాష్ట్ర రాజ‌కీయం రోజురోజుకు ర‌స‌వ‌త్తరంగా మారుతున్నాయి. శివ‌సేన‌పై రెబల్ ఎమ్మెల్యే తిరుగుబాటు.. సీఎంగా శివ‌సేన అధినేత ఉద్ద‌వ్ ఠాక్రే రాజీనామా.. ఈ క్ర‌మంలో ఎవరూ ఉహించ‌ని విధంగా.. శివ‌సేన రెబ‌ల్ నేత ఏక్ నాథ్ షిండే సీఎం గా, మాజీ సీఎం దేవేంద్ర ఫ‌డ్న‌వీస్ డిప్యూటీ సీఎంగా ప్ర‌మాణ స్వీకారం చేయ‌డం. ఈ త‌రుణంలో షిండేను పార్టీ నుంచి ఉద్ద‌వ్ బ‌హిష్క‌రించ‌డం. నేడు బీజేపీ నాయకుడిని అసెంబ్లీ స్వీక‌ర్ గా నియ‌మించ‌డం... ఇలా ఎన్నో ఉహించ‌ని, ఉత్కంఠ భ‌రిత అంశాల‌కు మ‌హారాష్ట్ర రాజ‌కీయాలు వేదిక‌య్యాయి.

 తాజాగా మ‌రో కీల‌క ఘ‌ట‌న జ‌రిగింది. రెబ‌ల్ ఎమ్మెల్యేల‌పై అన‌ర్హ‌త వేటు వేయాలని శివ‌సేన అధినేత భావిస్తున్నారు. ఈ క్ర‌మంలో నూత‌నంగా అసెంబ్లీ స్పీక‌ర్ గా ఎన్నికైన రాహుల్ నార్వేక‌ర్ ను క‌లిశారు. తమ పార్టీ ఆదేశాలను ఉల్లంఘించారనే ఆరోపణలపై తిరుగుబాటు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాల‌ని శివ‌సేన‌ పిటిషన్‌ను దాఖలు చేసింది. ఆదివారం స్పీకర్ ఎన్నిక సందర్భంగా.. తమ అభ్యర్థులకు అనుకూలంగా ఓటు వేయాలని ఉద్ధవ్ ఠాక్రే, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని సేన వర్గాలు పార్టీ శాసనసభ్యులకు వేర్వేరుగా విప్‌లు జారీ చేశాయి.

సీఎం షిండే నేతృత్వంలోని బృందం స్పీకర్‌గా బీజేపీకి చెందిన రాహుల్ నర్వేకర్‌కు అనుకూలంగా ఓటు వేయగా, ఠాక్రే నేతృత్వంలోని శిబిరంలోని 16 మంది ఎమ్మెల్యేలు వ్యతిరేకంగా ఓటు వేశారు. 164 ఓట్లు సాధించిన నర్వేకర్ 107 ఓట్లతో ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన అభ్యర్థి రాజన్ సాల్విపై విజయం సాధించారు.

ఎన్నికల అనంతరం ఉద్ధవ్‌ ఠాక్రే నేతృత్వంలోని శివసేన వర్గం స్పీకర్‌ రాహుల్‌ నార్వేకర్‌తో సమావేశమై తిరుగుబాటు శిబిరం ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసింది. గత నెలలో షిండే వ‌ర్గం త‌మ పార్టీకి వ్యతిరేకంగా తిరుగుబాటు ప్రారంభించారు. మెజారిటీ ఎమ్మెల్యేలు షిండే పక్షాన నిలిచారు. దీంతో ఇది ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని మహా వికాస్ అఘాడి (MVA-శివసేన, NCP, కాంగ్రెస్) ప్రభుత్వం పతనం అయ్యింది. మహారాష్ట్ర 20వ ముఖ్యమంత్రిగా షిండే గురువారం ప్రమాణ స్వీకారం చేయగా, డిప్యూటీ సీఎంగా బీజేపీ అగ్రనేత దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేశారు. రేపు మెజారిటీ నిరూపించుకునేందుకు షిండే బలపరీక్షను ఎదుర్కోనున్నారు.

ఇదిలా ఉంటే.. మహారాష్ట్ర శాసనసభ ప్రత్యేక సమావేశాల మొదటి రోజు ( ఆదివారం) అసెంబ్లీ స్పీకర్ ఎన్నిక జరిగింది. ఇందులో బీజేపీ అభ్యర్థి రాహుల్ నర్వేకర్ మహారాష్ట్ర శాసనసభ స్పీకర్‌గా ఎన్నికయ్యారు. రాహుల్ నర్వేకర్‌కు మద్దతుగా మొత్తం 164 ఓట్లు పోలయ్యాయి. అదే సమయంలో ఆయనకు వ్యతిరేకంగా 107 ఓట్లు పోలయ్యాయి. స్పీకర్ ఎన్నిక సందర్భంగా 12 మంది సభ్యులు గైర్హాజరు కాగా, ముగ్గురు ఎమ్మెల్యేలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు.

ఫిబ్రవరి 2021లో కాంగ్రెస్‌కు చెందిన నానా పటోలే రాజీనామా చేయడంతో అధ్యక్ష పదవి ఖాళీగా ఉంది. స్పీకర్ లేకపోవడంతో డిప్యూటీ స్పీకర్ నరహరి జిర్వాల్ తాత్కాలిక స్పీకర్‌గా వ్యవహరించారు. విశేషమేమిటంటే.. మహా వికాస్ అఘాడి (MVA) ప్రభుత్వాన్ని పడగొట్టడానికి తిరుగుబాటుకు నాయకత్వం వహించిన ఏకనాథ్ షిండే జూన్ 30న మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత మహారాష్ట్ర శాసనసభ ప్రత్యేక సమావేశాన్ని పిలిచారు. ఈ రోజు సమావేశానికి మొదటి అధ్యక్షుడిని ఎన్నుకున్నారు. ఇందులో బీజేపీ ఎమ్మెల్యే రాహుల్ నర్వేకర్ అసెంబ్లీ కొత్త స్పీకర్‌గా ఎన్నికయ్యారు.

రాహుల్ నార్వేకర్ ఎవరు?

45 ఏళ్ల రాహుల్ నార్వేకర్ గతంలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, శివసేనతో అనుబంధం కలిగి ఉన్నాడు. కొలాబా నుండి సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన నర్వేకర్, 2014లో శివసేన నుండి వైదొలిగి, 2014 లోక్‌సభ ఎన్నికలలో మావల్ నియోజకవర్గం నుండి NCP అభ్యర్థిగా పోటీ చేశారు. అయితే ఎన్నికల్లో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. తరువాత అతను మహారాష్ట్ర లెజిస్లేటివ్ కౌన్సిల్‌కు ఎన్నికయ్యాడు. 2019 వరకు దాని సభ్యునిగా కొనసాగాడు. 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ టికెట్‌పై కొలాబా స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించారు.