Udaipur: ఉదయ్ పూర్ హత్య నిందితుల్లో ఒకరు బీజేపీ మెంబర్.. : కాంగ్రెస్
Udaipur killing: వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నుపూర్ శర్మకు సోషల్ మీడియా వేదికగా మద్దతు ప్రకటించారనే కారణంతో ఉదయ్పూర్ లో ఇద్దరు దుండగులు ఒక టైలర్ గొంతు కోసి చంపారు. ఈ ఘటనపై ఎన్ఐఏ విచారణ జరుపుతోంది.
Udaipur Murder Case: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఉదయ్పూర్ టైలర్ హత్య ఇప్పుడు రాజకీయ దుమారం రేపుతోంది. కాంగ్రెస్, బీజేపీల మధ్య మాటల యుద్ధానికి తెరలేపింది. రాజస్థాన్ లో కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఈ క్రమంలోనే రాష్ట్రంలో హిందువులకు రక్షణ లేందంటూ కాంగ్రెస్ సర్కారుపై బీజేపీ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తోంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ నాయకులు స్పందిస్తూ.. ఉదయ్పూర్ ఘోర హత్యకు సంబంధించిన ఇద్దరు నిందితుల్లో ఒకరు బీజేపీ సభ్యులు అంటూ సంచలన ఆరోపణలు చేసింది. దీనికి సంబంధించిన ట్వీట్ వైరల్ కావడంతో బీజేపీ స్పందిస్తూ.. వాటిని తిప్పికొట్టింది. వివరాల్లోకెళ్తే..
ఉదయ్పూర్లో టైలర్ను దారుణంగా హత్య చేసిన కేసులో ప్రధాన నిందితుల్లో ఒకరు బీజేపీ సభ్యుడు అని కాంగ్రెస్ శనివారం ఆరోపించింది. ఈ కారణంగా ఉదయ్పూర్ హత్య కేసును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)కు అప్పగించడానికి కేంద్రం త్వరగా కదిలిందా? అని ప్రశ్నించింది. కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో పార్టీ మీడియా విభాగం అధిపతి పవన్ ఖేరా మాట్లాడుతూ.. రియాజ్ అత్తారీతో బీజేపీ సంబంధాలను ఎత్తి చూపిన ఉదయపూర్ సంఘటనకు సంబంధించి ఒక మీడియా బృందం చాలా సంచలనాత్మకమైన విషయాలను బహిర్గతం చేసిందని అన్నారు. కొన్ని నివేదికలు నిందితుడిని రియాజ్ అక్తారీ అని కూడా పేర్కొన్నాయి. "కన్హయ్య లాల్ హంతకుడు, రియాజ్ అత్తారీ ఒక బీజేపీ సభ్యుడు" అని ఖేరా విలేకరుల సమావేశం తర్వాత ఒక ట్వీట్లో తెలిపారు.
ఉదయ్పూర్ హత్య నిందితుల్లో ఒకరు బీజేపీకి చెందినవారు ఉన్నారనే ఆరోపణలపై బీజేపీ స్పందించింది. బీజేపీ ఐటి సెల్ చీఫ్ అమిత్ మాల్వియా కాంగ్రెస్ ఆరోపణలు తోసిపుచ్చుతూ.. దానిని ఫేక్ న్యూస్ అని కొట్టిపారేశారు."మీరు #FakeNewsని ప్రచారం చేయడంలో నాకు ఆశ్చర్యం లేదు. ఉదయపూర్ హంతకులు బీజేపీ సభ్యులు కాదు. రాజీవ్ గాంధీని హతమార్చేందుకు ఎల్టీటీఈ హంతకుడు కాంగ్రెస్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించినట్లే వారి చొరబాటు ప్రయత్నం" అని ట్వీట్ చేశారు.
కాగా, మమహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నుపూర్ శర్మకు సోషల్ మీడియా వేదికగా మద్దతు తెలుపుతూ.. పోస్టులు పెట్టిన ఉదయ్ పూర్ వాసిని ఇద్దరు దుండగులు అత్యంత దారుణంగా గొంతుకొసి హత్య చేశారు. నిందితులు పోలీసుల అదుపులో ఉన్నారు. ఎన్ఐఏ దీనిపై విచారణ జరుపుతోంది.