బెంగళూరు: భర్తలను చంపేసి, డ్రామాలాడిన భార్యలు
కర్ణాటక రాజధాని బెంగళూరులో ఇద్దరు మహిళలు తమ భర్తలను వేర్వేరు ఘటనల్లో చంపేశారు.
బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులో ఇద్దరు మహిళలు తమ భర్తలను వేర్వేరు ఘటనల్లో చంపేశారు. వారిద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. ఎరాలహళ్లి ప్రాంతానికి చెందిన గంగారత్న, సంజీవప్ప(35) భార్యాభర్తలు. సంజీవప్ప ప్రతి రోజూ మద్యం తాగివచ్చి తనను వేధిస్తున్నాడనే కోపంతో గంగారత్న భర్త వృషణాలను నలిపేసి, దిండుతో నొక్కి చంపేసింది.
ఆ తర్వాత తన భర్త మితిమీరి మద్యం తాగి మరణించాడని చెప్పింది. పోలీసులు సంజీవప్ప మృతదేహాన్ని పోస్టుమార్టం చేయించగా అసలు విషయం వెలుగు చూసింది. దీంతో గంగారత్నను పోలీసులు అరెస్టు చేశారు.
భార్య అమాయకత్వం నటించడంతో ఈ కేసును ఛేదించడానికి పోలీసులకు మూడు నెలలు పట్టింది. అంతేకాకుండా సంజీవప్ప వైవాహికేతర సంబంధం పెట్టుకున్నాడనే కోపం కూడా ఆమెకు ఉంది.
మరో ఘటనలో హుబ్బలి ప్రాంతానికి చెందిన శివయోగిని అతని భార్య భారతి క్రికెట్ బ్యాటుతో కొట్టి చంపింది. మద్యం తాగి మంచం మీద నుంచి కింద పడి భర్త మరణించాడని భారతి పోలీసులకు తప్పుడు ఫిర్యాదు చేసింది.
దీనిపై పోలీసులు దర్యాప్తు చేయగా భారతినే భర్తను చంపేసినట్లు తేలింది. దీంతో పోలీసులు భారతిని అరెస్టు చేసారు.