గన్ చూపించిన వెనక్కి తగ్గకుండా పోరు.. బ్యాంక్ దొంగలను తరిమికొట్టిన ఇద్దరు మహిళా కానిస్టేబుల్స్.. వీడియో వైరల్
బీహార్లో హాజీపూర్లోని ఒక బ్యాంకుకు కాపలాగా ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు బ్యాంకు దోపిడికి అడ్డుకనున్న తీరుపై ప్రశంసల వర్షం కురుస్తోంది.
బీహార్లో హాజీపూర్లోని ఒక బ్యాంకుకు కాపలాగా ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు బ్యాంకు దోపిడికి అడ్డుకనున్న తీరుపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ముగ్గురు దొంగలతో ధైర్యంగా పోరాడిన మహిళా కానిస్టేబుళ్లు.. బ్యాంకు దోపిడి జరగకుండా అడ్డుకున్నారు. ఆ దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ప్రస్తుతం ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. వివరాలు.. జుహీ కుమారి, శాంతి కుమారి సదర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సెందూరి చౌక్లోని ఉత్తర బీహార్ గ్రామీణ బ్యాంకు ప్రవేశద్వారం వద్ద విధుల్లో ఉన్నారు.
బ్యాంకు దోపిడి చేద్దామని ముగ్గురు వ్యక్తులు లోనికి ప్రవేశించారు. అయితే వారికి ఏం పని ఉందని జుహీ, శాంతిలు అడగగా.. దొంగలు బెదిరించేందుకు యత్నించారు. ఓ వ్యక్తి గన్ బయటకు తీసి వారికి గురిపెట్టాడు. అయితే జూహీ, శాంతిలు మాత్రం ఏమాత్రం బెదరకుండా వారిని ఎదురునిలిచారు. జూహీ, శాంతిలు తమ వద్ద ఉన్న గన్లతో దొంగలతో వారిపై ఎదురుదాడికి దిగారు. ఈ క్రమంలోనే దొంగలకు, కానిస్టేబుళ్లకు మధ్య కొన్ని సెకన్ల పాటు ఘర్షణ నడిచింది. దొంగలు దాడి చేసేందుకు యత్నించిన కూడా మహిళా కానిస్టేబుల్స్ వెనక్కి తగ్గలేదు. ఈ క్రమంలోనే భయపడిన దొంగలు అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఘటనలో జూహీ గాయపడ్డారు.
‘‘ముగ్గురికీ బ్యాంకులో పని ఉందా అని నేను అడిగాను.. వారు అవును అని చెప్పారు. నేను పాస్బుక్ చూపించమని అడిగాను, వారు తుపాకీని బయటకు తీశారు’’ అని జూహీ చెప్పారు. ‘‘వారు మా రైఫిల్స్ను లాక్కోవడానికి ప్రయత్నించారు. కానీ ఏమి జరిగినా మేము వారిని బ్యాంకును దోచుకోకుండా చూడాలని అనుకున్నాం. మా ఆయుధాన్ని వారి చేతుల్లోకి వెళ్లకుండా చూడాలని మేము నిర్ణయించుకున్నాం. జూహీ తన తుపాకీతో వారికి గురిపెట్టింది’’ అని శాంతి చెప్పారు. ఇక, ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
ప్రస్తుతం పోలీసులు బ్యాంకు దోపిడికి యత్నించిన ఆ వ్యక్తుల కోసం గాలిస్తున్నారు. ‘‘సెందూరి వద్ద ఉదయం 11 గంటల సమయంలో ముగ్గురు వ్యక్తులు బ్యాంకును దోచుకోవడానికి ప్రయత్నించారు. మా మహిళా కానిస్టేబుళ్లు అసాధారణమైన ధైర్యాన్ని ప్రదర్శించి వారిని భయపెట్టగలిగారు. ఎలాంటి కాల్పులు జరగలేదు. కానిస్టేబుళ్లకు రివార్డ్ ఇస్తాం’’ అని సీనియర్ పోలీసు అధికారి ఓం ప్రకాష్ తెలిపారు.